Suryaa.co.in

Editorial

జిలెటిన్‌స్టిక్స్ లైసెన్స్ దందా.. అంతా సైలెన్స్!

  • లైసెన్స్ ఒకరిది.. దందా మరొకరిది

  • వారి నుంచి లైసెన్సులు లాగేసుకున్న ‘అద్దంకి ముఠా’

  • చీమకుర్తి, బల్లికురవ క్వారీలు వారి నుంచి కొనాల్సిందే

  • చెప్పిన రేటుకు జిలెటెన్‌స్టిక్స్ కొనసాగిల్సిందే

  • వైసీపీ హయాంలో వ్యాపారం చేసిన ఆ లైసెన్స్ కంపెనీలు

  • ఇప్పుడు వారి నుంచి స్వాధీనం చేసుకుని ఆ పేరుతోనే దందా చేస్తున్న
    అద్దంకి టీడీపీ నేతలు

  • ఇటీవల వైసీపీ నేత కంపెనీపై పోలీసు దాడులు

  • మిగిలిన వారిని వదిలేయడంపై అనుమానాలెన్నో

  • కర్త కర్మ క్రియ అంతా ‘అద్దంకి ఆత్మ’ట

  • జీరో బిల్లులతో అడ్డగోలు పేలుడు వ్యాపారం

  • కొన్నిచోట్ల 20 శాతం బిల్లులతో సరఫరా

  • మాజీ మంత్రి కాకాణి కేసులో ఓ లైసెన్సుదారుడు ముద్దాయి

  • ఆ ముద్దాయికి ఉమ్మడి ప్రకాశం జిల్లా టీడీపీ పెద్దల దన్ను?

  • ఆయనను తప్పించేందుకు రంగంలోకి దిగిన ఒక మంత్రి, మరో ఎమ్మెల్యే?

  • నెల్లూరు, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో లైసెన్సులతో వ్యాపారం

  • జిలిటెన్‌స్టిక్స్ సరఫరా వినియోగంపై తనిఖీలేవీ?

  • పేలుడు పదార్ధాల స్టాక్ లెక్కించే తనిఖీలేవీ?

  • పేలుడు పదార్ధాల సరఫరా దారితప్పితే బాధ్యులెవరు?

  • నిఘా నిద్రపోతోందా?

  • చీమకుర్తి, బల్లికురవ క్వారీల్లో జిలెటిన్‌స్టిక్స్ సరఫరాకు లెక్కలేవీ?

( మార్తి సుబ్రహ్మణ్యం)

అవి మైనింగ్ ఉన్న ప్రాంతాలు. వాటిని పేల్చాలంటే పేలుడు పదార్ధాలు అవసరం. ఎవరంటే వారు సొంతంగా కొండలు-రాళ్లను పేల్చడానికి కుదరదు. దానికి లైసెన్సు ఉన్న కంపెనీల నుంచి, పేలుడు పదార్ధాలు కొనుగోలు చేయాలి. వాటికి బిల్లులు ఉండి తీరాలి. ఆ లైసెన్సు దారులకు రెండు కేటగిరీలుంటేనే కంపెనీలు, వాటికి పేలుడుపదార్ధాలు సరఫరా చేస్తాయి. ఇదంతా చట్టబద్ధంగా జరగాల్సిన దందా.

కానీ క్వారీలు, మైనింగ్‌లు దండిగా ఉన్న చీమకుర్తి, బల్లికురవ ప్రాంతాల్లో.. అందుకు విరుద్ధమైన దందా, అధికారపార్టీ నేతల దన్నుతో విజయవంతంగా నడుస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పేరుకు..ఇక్కడ పేలుడుపదార్ధాలు సరఫరా చేస్తున్నది ఆ నాలుగు లైసెన్సు దారులే అయినప్పటికీ, వారి నుంచి లైసెన్సులు స్వాధీనం చేసుకుని, వారి పేరుతోనే దందా చేస్తున్నది మాత్రం ‘అద్దంకి పెద్దలేన’ట.

వారి పేరుతో పేలుడు పదార్ధాలు కొనుగోలు చేస్తున్న ఈ పెద్దల ముఠా.. చీమకుర్తి, బల్లికురవలోని క్వారీ యజమానులకు తమ వద్దనే ఆ పేలుడు పదార్ధాలను.. తాము చెప్పిన రేటుకు కొనాలని షరతులు పెడుతున్న వైనం, ఇప్పుడు మైనింగ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిందట. ఈ్యవహారం మొత్తం ‘అద్దంకి ఆత్మ’ ఆధ్వరంలోనే జరుగుతోందన్నది, ‘ఒరిజినల్ టీడీపీ’ వర్గాల ఆరోపణ. ఎందుకంటే.. ఇప్పడు అద్దంకిలో ‘అసలు టీడీపీ’-‘కొసరు టీడీపీ’ వర్గాల మధ్య సైద్ధాంతిక సమరం జరుగుతోందిలెండి. అదీ అసలు యవ్వారం!

గంగపాలెం చెందిన ఒకరు, వలపర్లకు చెందిన మరొకరు, రామాంజిపురం గ్రామానికి చెందిన ఇంకొకరు, గురిజేపల్లికి చెందిన మరొకరు, నాగరాజుపల్లికి చెందిన మరో వ్యక్తికి పేలుడు పదార్ధాలు సరఫరా చేసేందకు లైసెన్సులున్నాయి. వీరంతా బల్లికురవ మండలానికి చెందిన వారే. యజమానులు ఎవరైనా సరే.. క్వారీల్లో కొండలు, రాళ్లను పేల్చేందుకు ఉపయోగించే పేలుడు పదార్ధాల సామాగ్రిని, వీరి నుంచి కొనుగోలు చేయాల్సిందే.

గత వైసీపీ ప్రభుత్వంలోనూ వీరే సరఫరా చేశారు. ఇప్పుడు ప్రభుత్వం మారిన నేపథ్యంలో.. అద్దంకి ఆత్మ రంగంలోకి దిగి, వారి నుంచి లైసెన్సులు స్వాధీనం చేసుకుని, వారిపేరుతో ఆయన మరికొందరితో కలసి దందా చేస్తున్నారన్నది టీడీపీ వర్గాల ఆరోపణ. ఆ ప్రభుత్వంలో మీరు వ్యాపారం చేశారు కాబట్టి, మా ప్రభుత్వంలో మేము చేస్తాం అన్న సూత్రీకరణను తెరపైకి తెచ్చి, బలవంతంగా వారి నుంచి లైసెన్సులు స్వాధీనం చేసుకున్నారట. అయితే అందులో ఇద్దరికి మాత్రం కొంతశాతం వరకూ వాటాలు ఇచ్చారట. ఆ ప్రకారంగా వారు పేలుడు పదార్ధాలు అమ్ముకుని, తమకు కేటాయించిన శాతం వరకు డబ్బులు తీసుకుని, మిగిలిన సొమ్మును, తమ నుంచి స్వాధీనం చేసుకున్న ముఠాకు ఇవ్వాలన్నమాట! ఇదో వ్యాపార నీతి!!

నిజానికి ఈ లైసెన్సులలో రెండు కేటగిరిలు ఉంటాయి. 21 నెంబర్, 22 నెంబర్ అనే పేర్లతో ఉండే ఆ లైసెన్సుల మార్గదర్శకాల ప్రకారం.. 21 నెంబర్ అనేది కొత్తవి అయితే, 22 నెంబర్ అనేది పాతవి. అయితే నిబంధనల ప్రకారం 21 నెంబర్ ఉన్న లైసెన్సుదారుకు, 22 నెంబర్ లైసెన్సుదారులే పేలుడుపదార్ధాల ఇండెంట్‌కు సిఫార్సు చేయాలి. వీటిని క్వారీలకు సరఫరా చేసే సమయంలో జీఎస్టీతోపాటు, అన్ని రకాల బిల్లులు ఉండాలి.

కాగా.. గత కొద్దికాలం నుంచి ‘అద్దంకి ముఠా’, ఈ నిబంధనలను అటకెక్కించేసింది. ఎలాంటి బిల్లులు లేకుండా 80 శాతం దందా చేస్తుంటే కేవలం 20 శాతమే బిల్లులలతో వ్యాపారం జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అటు క్వారీ యజమానులు కూడా బిల్లులు లేకుండా ఇస్తుండటంతో, పేలుడు పదార్ధాలు కొనుగోలు చేస్తున్నారు. ఒక్క బల్లికురవ మండంలోని క్వారీల నుంచి ఈ పేలుడు పదార్ధాల వ్యాపారం నెలకు 3 కోట్ల వరకూ ఉంటుందని ఒక అంచనా. గత ప్రభుత్వ హయాంలో కంటే పేలుడు పదార్ధాల ప్యాకెట్‌కు.. 200 నుంచి 300 రూపాయలు అదనంగా క్వారీ యజమానుల నుంచి వసూలు చేస్తున్నట్లు చెబుతున్నారు.

అయితే ప్రస్తుతం దేశంలో ఉగ్రవాదుల కదలికలు, మావోయిస్టుల కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో.. ఈ పేలుడు పదార్ధాలు, దారి మళ్లే అవకాశంపై ఆందోళన వ్యక్తమవుతోంది. అసలు ఒక్కో క్వారీలో ఎంత పేలుడు పదార్ధం అవసరం? దానికి సంబంధించి కంపెనీల నుంచి కొనుగొలు చేస్తున్నది ఎంత? క్వారీ యజమానులు తీసుకున్న పేలుడు పదార్ధాలు మొత్తం వినియోగిస్తున్నారా? లేక వాటిని ఇంకెవరికయినా మళ్లిస్తున్నారా? లైసెన్సుదారుల గోడౌన్‌లో ఉన్న స్టాక్ ఎంత? కంపెనీల నుంచి వారు కొనుగోలు చేసిన పేలుడు పదార్ధాలకు- సరఫరా చేసిన పేలుడు పదార్ధాలకు- గోడౌన్‌లో ఉన్న స్టాక్ ఎంతన్నది అధికారులు తనిఖీలు చేస్తుండకపోవడమే ఆశ్చర్యం.

పేలుడు పదార్ధాలు ఇవీ..
క్వారీలలో రాళ్లను పేల్చేందుకు జిలెటిన్‌స్టిక్ తప్పనిసరి. అయితే అది రకరకాల రూపాల్లో వినియోగిస్తారు. ది ఎఫ్, డీ గార్డ్, తూటా 180, 200 మాటర్లు, ఓడీ, ఈడీ, బూస్టర్లు ద్వారా పేలుళ్లు జరుపుతారు. వీటిని చెన్నై, హైదరాబాద్, నాగపూర్ నుంచి కొనుగోలు చేయిస్తుంటారు.

పేలుడు ద ందా వెనుక ‘త్రినే’త్రుడు అతడే.. కాకాణి కేసులోనూ అతడే!
బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు పేలుడు పదార్ధాలు కావాలంటే.. అది కూడా బిల్లులు లేకుండా.. మహా అయితే ఓ 20 శాతం బిల్లులతోనే దందా చేయడంలో మాస్టర్ ఆయన. ఆయన ‘త్రినే’త్రంలోనే బల్లికురువ కేంద్రంగా, ఈ బిల్లులు లేని దందా విజయవంతంగా నడుస్తోందని టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. ఈ త్రినేత్రుడు ఆషామాషీ మనిషి కాదు. 21 లెసెన్సులతోపాటు, మళ్లీ ఒక లీజుకు తీసుకున్న లైసెన్స్ ఉంది. కొంతమంది లైసెన్సుదారులు.. ఈ ‘త్రినే’త్రుడి లైసెన్సు పేరుమీదనే ఇండెంటు పెట్టుకుని, పేలుడుపదార్ధాలు తెప్పించుకుంటున్నారట.

సదరు ‘త్రినే’త్రుడు వైసీపీ జమానాలో ఒక వెలుగు వెలిగారట. సంచలనం సృష్టించి, ప్రస్తుతం పరారీలో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కేసులోనూ ఈ త్రినేత్రుడు ముద్దాయిట. కాకాణి క్వారీలకు ఈయనే పేలుడు పదార్ధాలు సరఫరా చేసేవారని, నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు చెబుతున్నారు. అయితే ఈ త్రినేత్రుడి ప్రధాన వ్యాపారమంతా బల్లికురవ, చీమకుర్తి, మార్టూరు కావడంతో.. టీడీపీ పెద్దలు రంగంలోకి దిగి, త్రినేత్రుడిని కాపాడేందుకు రంగంలోకి దిగారని నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఆ కేసు నుంచి తప్పించేందుకు ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ఓ మంత్రి, మైనింగ్ నియోజకవర్గంలో వర సగా గెలుస్తున్న మరో టీడీపీ ఎమ్మెల్యే రంగంలోకి దిగినట్లు నెల్లూరు టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆ ప్రకారంగా బల్లికురవ మండలం రామాంజిపురానికి చెందిన హన్మంతరావును.. ‘త్రినే’త్రుడి స్థానంలో ఉంచి, త్రినేత్రుడిని తప్పించారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ కేసు విచారిస్తున్న పోలీసులు మాత్రం హన్మంతరావు ముద్దాయి అని, అతనికి పేలుడు పదార్ధాలు ఎవరు సరఫరా చేశారో విచారిస్తామని చె బుతున్నారట.

అయితే నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి కాకాణి కేసులో రామాంజిపురానికి చెందిన హన్మంతరావును అతని ఇష్టపూర్వకంగానే ఇరికించి, త్రినేత్రుడిపై కేసు కాకుండా.. ఆయన ద్వారా ‘అద్దంకి పెద్దలు’, పేలుడు పదార్ధాల దందాను కొనసాగిస్తున్నట్లు ఒరిజినల్ టీడీపీ నేతలు చెబుతున్నారు. నిజం నారాయణుడికెరుక?

అయితే దీనిపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సీరియస్‌గా ఉన్నట్లు చెబుతున్నారు. కాకాణి కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సోమిరెడ్డి.. ఆ కేసులో ఏ ఒక్కరినీ వదిలేదన్న కసితో, పోలీసులపై ఒత్తిడి చేస్తున్నారు. అయినా.. తమ సామాజికవర్గానికి చెందిన ఆ ‘త్రినే’త్రుడిని కాపాడేందుకు, మిత్రులైన ఆ మంత్రి-ఎమ్మెల్యే పావులు కదుపుతున్నట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు.

LEAVE A RESPONSE