Suryaa.co.in

Editorial

లిక్కర్ కేసులో ధనుంజయరెడ్డి అరెస్ట్ తప్పదా?

– కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్పకు హైకోర్టులో దక్కని ఊరట
– ఆ ముగ్గురికి అరెస్టుల నుంచి రక్షణ ఇవ్వలేమన్న  హైకోర్టు
– ఇక వారి మిగిలింది వారి అరెస్టులే
– పోలీసులు ఇప్పుడైనా పరుగులు తీస్తారా?
– గతంలో పలువురి బెయిల్ పిటిషన్లు కొట్టేసినా అరెస్టు చేయని వైఫల్యం
– ఆ ముగ్గురు నోరు విప్పితేనే బిగ్‌బాస్ ఎవరో తెలిసేది
( అన్వేష్)

జగన్ జమానాలో సంచలనం సృష్టించిన వేల కోట్ల రూపాయల లిక్కర్ కుంభకోణంలో కీలక వ్యక్తుల అరెస్టులకు రంగం సిద్ధమవుతోంది. జగన్ దగ్గర అదనపు కార్యదర్శిగా ఉన్న ధనంజయరెడ్డి, ఓఎస్డీగా ఉన్న కృష్ణమోహన్‌రెడ్డి, భారతీరెడ్డికి అత్యంత సన్నిహితుడైన బాలాజీ గోవిందప్పతో తాము చర్చించామంటూ.. ఇప్పటికే ఇదే కేసులో అరెస్టయిన నిందితులు, పోలీసులకు వాంగ్మూలం ఇచ్చిన విషయం తెలిసిందే. తాము ఎక్కడెక్కడ వారిని కలిసింది.. ఎవరికి ఎంత ముట్టచెప్పిందన్న వివరాలన్నీ నిందితులు పూస గుచ్చినట్లు చెప్పేశారు.

నిజానికి వీరికంటే ముందే.. వాసుదేవరెడ్డి లిక్కర్ బొక్కలన్నీ సవివరంగా వెల్లడించిన తర్వాతనే, తన మాతృ శాఖకు వెళ్లిపోయారు. ‘నాపై ఉన్న కేసులపై విచారణ జరుపుకోండి. నేను మీకు సహకరిస్తా. కానీ నన్ను నా మాతృశాఖకు పంపించండి’ అని వాసుదేవరెడ్డి చాలాకాలం నుంచీ, టీడీపీలో తనకు సన్నిహితులయిన వారి ద్వారా పైస్థాయికి రాయబారం పంపించగా.. కీలక భేటీ తర్వాత, ఆయన నుంచి వాంగ్మూలం తీసుకుని, ఎన్‌ఓసీ ఇచ్చినట్లు పార్టీ-ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.

ఇక లిక్కర్ కేసులో ఏయే కంపెనీల ఆర్డర్లు ఆమోదించాలి? ఎన్ని కేటాయించాలి? వారి నుంచి వచ్చే కమిషన్లు ఏ కంపెనీల ద్వారా మళ్లించాలి? అనే కీలక అంశాలన్నీ ధనంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్ప నిర్ణయించేవారని నిందితులు పోలీసు విచారణలో వెల్లడించడంతో.. ఆ ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకోవడం అనివార్యంగా మారింది. కాగా లిక్కర్ ద్వారా వచ్చిన కమిషన్లను చెన్నైకు చెందిన అనిల్‌రెడ్డి ప్రధాన పర్యవేక్షణ చేయగా, మిగిలిన వారంతా వివిధ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేవారని పోలీసుల విచారణలో తేలింది. ప్రధానంగా అప్పట్లో జగన్ కోసం, టీడీపీ అగ్రనేతలను వేధించిన ఓ డీజీపీ తనయుడికి చెందిన ఐటి కంపెనీల్లో కూడా.. లిక్కర్ పెట్టుబడులు పెట్టారన్న అనుమానాలు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ధనంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్ప వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేయడంతో, ఇక వారికి దారులు మూసుకుపోయాయి. అయితే గతంలో పోలీసుల ైవె ఫల్యం వల్ల చాలామంది పోలీసులను తప్పించుకుని, సుప్రీంకోర్టుకు వెళ్లి రక్షణ తెచ్చుకున్న అనుభవాలు దృష్టిలో ఉంచుకుని.. ఈసారైనా పోలీసులు పరుగులు పెట్టి వారిని అరెస్టు చేస్తారా? లేక యధావిథిగా వారిని సుప్రీంకోర్టుదాకా వెళ్లనిచ్చి, ముందస్తు బెయిల్ తెచ్చుకునే వెసులుబాటు కల్పిస్తారా? అన్నది చూడాలి. ఈ కేసులో ఆ ముగ్గురిని విచారిస్తే.. లిక్కర్ కేసులో బిగ్‌బాస్ ఎవర న్నదీ తేలిపోతుందని పోలీసు-రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

LEAVE A RESPONSE