నైపుణ్య ఆధారిత శిక్షణతో నిరుద్యోగ యువత భవితకు బంగారు బాటలు

– పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నిరుద్యోగ యువతకు శిక్షణ
– స్కిల్ డెవలప్మెంట్ పార్ట్నర్స్ గా ప్రముఖ పరిశ్రమలు
– ఏపి విధానానికి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్డిసి) నుంచి అభినందనలు
– స్కిల్ ఎకోసిస్టమ్ ను అభివృద్ధి చేయడంలో భాగంగా ఐబిఎం, టెక్ మహీంద్రా, దాల్మియా, డెల్, హెచ్. సి.ఎల్ తదితర 13 ప్రముఖ సంస్థలతో ఒప్పందం
– రూ.460 కోట్లతో ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆధ్వర్యంలో 23 నైపుణ్య కళాశాలలు
– ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా పులివెందులలో ఒక స్కిల్ ఇనిస్టిట్యూట్ కు శంఖుస్థాపన
6 స్కిల్ కాలేజీల నిర్మాణానికి టెండర్లు పిలిచిన ఏపీఐఐసి
అమరావతి: విద్యార్దులకు మంచి భవిష్యత్ కావాలంటే చదువుతోపాటు వారిలో నైపుణ్యం అవసరం. ఆ నైపుణ్యం లేక అనేక పరిశ్రమలలో ఖాళీలు ఉన్నప్పటికీ, బయటి రాష్ట్రాల వారు వచ్చి ఆయా పరిశ్రమలలో పనిచేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో గడిచిన దశాబ్దాలలో అనేక మంది యువత నిరుద్యోగులుగా మిగిలిపోయారు. ఈ పరిస్థితిని సమూలంగా మార్చి రాష్ట్రంలోని యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఇండస్ట్రీ కస్టమైజ్డ్ స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రాం కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎక్కడ పరిశ్రమలున్నాయ్ ? వాటి అవసరాలేంటి? వారికి కావల్సిన మానవ వనరుల నైపుణ్యం ఎలా ఉండాలి? అనేదాని ఆధారంగా రూపొందించిన ఈ శిక్షణా కార్యక్రమం అందరి మన్ననలూ అందుకుంటూ, నిరుద్యోగులకు ఆశాకిరణంలా మారింది.
విద్యార్ధుల భవిష్యత్ కు పునాదులు వేస్తూ స్వల్ప విద్యార్హతలున్న వారిలో నైపుణ్యాలను అభివృద్ధి చేసి, కంపెనీలకు నిపుణులని అందుబాటులో ఉంచే లక్ష్యంతో మొదలైన ఈ వినూత్న ప్రాజెక్ట్ ఇండస్ట్రీ కస్టమైజ్డ్ స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రాం, (పరిశ్రమ అనుకూలిత నైపుణ్య శిక్షణ) ఇతర రాష్ట్రాలను కూడా ఆకర్షిస్తూ ముందుకు సాగిపోతోంది. అంతేగాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గడచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ (ఎపిఎస్ఎస్డిసి) గణనీయమైన పురోగతిని సాధించింది. ఈ కార్యక్రమం క్రింద ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలెప్మెంట్ కార్పొరేషన్ (ఏపిఎస్ఎస్‌డిసి) ఆధ్వర్యంలో కొత్త కొత్త విధానాలతో దాదాపు 1.7 లక్షల మంది యువతను నిపుణులుగా తీర్చిదిద్ది , వివిధ కంపెనీల అవసరాలు తీర్చేందుకు సిద్ధం చేశారు.
పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా, ఆయా పరిశ్రమల సహకారంతోనే యువతకు శిక్షణ ఇవ్వడం, మరికొంత మందికి అదనపు శిక్షణ ఇవ్వడం, వారిని నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దడంతోపాటు ఆయా కంపెనీలు లేదా పరిశ్రమల్లోనే ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యం. పరిశ్రమలు ఉండే చోటనే యువతకు శిక్షణ ఇవ్వడం వల్ల, శిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన వారిని అక్కడే ఉద్యోగాల్లోకి తీసుకోనే అవకాశాలను మెరుగుపరచి, రాష్ట్రంలో నిరుద్యోగులకు మంచి ఉపాధి అవకాశాలను కల్పించాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన.
ఈ కార్యక్రమలో భాగంగా ఎపిఎస్ఎస్డిసి శ్రీసిటీ క్లస్టర్, ఫార్మా కస్టర్, సోలార్ సెక్టార్, టెక్స్ టైల్స్ క్లస్టర్లతో భాగస్వామ్యం అయింది. ఇప్పటి వరకు ఈ కార్యక్రమం కింద 6,544 మందికి పైగా శిక్షణ ఇవ్వడంతోపాటు వారందరికీ ఉద్యోగాలు కల్పించడం జరిగింది. మరో 40 ఇండస్ట్రీలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ తరహా నైపుణ్య శిక్షణా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నందుకు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్డిసి) కూడా ఎపిఎస్ఎస్డిసిని అభినదించింది.
దీంతో పాటు ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన (పీఎంకెవీవై) కింద 43,167 మందికి శిక్షణ ఇవ్వడంతోపాటు, 19,446 మందికి ఉద్యోగ అవకశాలు కల్పించడం జరిగింది. జాతీయ స్థాయిలో ఎక్కువ ఉద్యోగాలు కల్పించిన రాష్ట్రాల్లో మనకు రెండో స్థానం దక్కింది. ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ మానుఫ్యాక్చరింగ్ (ఈఎస్డీఎం) స్కీమ్ కింద ఎలక్ట్రానిక్ సెక్టార్ లో విద్యార్థులు, నిరుద్యోగ యవతకు శిక్షణ ఇస్తున్నారు. 9, 10 వ తరగతి, ఐటిఐ, డిప్లొమా, నాన్ ఇంజనీరింగ్ విద్యార్థులకు కూడా శిక్షణ ఇస్తున్నారు.
ఎపిఎస్‌ఎస్‌డిసి, ప్రముఖ ఫ్రెంచి కంపెనీ డస్సాల్ట్ సిస్టమ్స్ సంయుక్తంగా 3 డి విభాగంలో శిక్షణ ఇచ్చేందుకు నాగార్జున యూనివర్సిటీలో మదర్ హబ్ 3 డి ఎక్స్ పీరియన్స్ సెంటర్ ను ఏర్పాటు చేశాయి. జెఎన్టీయూ అనంతపురం, ఆంధ్రా యూనివర్సిటీ, ఎస్వీ యూనివర్సిటీ పరిధిలోని 63 ఇంజనీరింగ్ కాలేజీల్లో డిజైన్ మానుఫ్యాక్చరింగ్ అండ్ అనాలసిస్ ద్వారా ఏరోస్పేస్, ఆటో మోటివ్, షిప్ బిల్డింగ్ విభాగాల్లో ఇప్పటి వరకు 66,670మంది శిక్షణ పొందారు. వీరిలో 3,982 మంది వివిధ మల్టీనేషనల్ కంపెనీల్లో ఉద్యోగాలు పొందారు. 380 మంది వివిధ రకాల పేటెంట్లకు దరఖాస్తు చేశారు. 535 మంది స్కూప్స్ ఇండెక్స్ పబ్లికేషన్లు కు ఎంపికయ్యారు. 560 మంది విద్యార్థులు ఇన్నోవేటివ్ ప్రాజెక్టులు రూపొందించారు.
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ , స్మార్ట్ ఫోన్ దిగ్గజం శామ్ సంగ్ సహకారంతో శామ్ సంగ్ ప్రిజమ్ (ప్రిపేరింగ్ అండ్ ఇన్ స్పైరింగ్ స్టూడెంట్ మైండ్స్) ను ఎపిఎస్ఎస్డిసి రాష్ట్రంలోనూ ప్రారంభింది. శామ్ సంగ్- ఎపిఎస్ఎస్డిసి ప్రాజెక్టు కోసం ఆంధ్రా యూనివర్సిటీ, జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాకినాడ, కెఎల్ యూనివర్సిటీ విజయవాడ, త్రిపుల్ ఐటి కర్నూలు లను ఎంపిక చేయడం జరిగింది. కంప్యూటర్ విజన్, మెషిన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ డకనెక్టెడ్ డివైజెస్, 5 జీ నెట్ వర్క్స్ వంటి ఆధునిక సాంకేతిక రంగాల్లో ప్రాజెక్ట్స్ పై విద్యార్థులు నైపుణ్యం సంపాదించాలని నిర్దేశించడం జరిగింది.
కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి సమయంలోనూ, ఫ్రంట్ లైన్ వర్కర్ల్సుకి వర్చువల్ ద్వారా నైపుణ్య శిక్షణ ఇవ్వడ జరిగింది. ఫిండ్, ఆఫ్రికన్ సొసైటీ ఫర్ ల్యాబొరేటరీ మెడిసిన్, లండన్ స్కూల్ ఆఫ్ హైజిన్ అండ్ ట్రోపికల్ మెడిసిన్, ఫ్యూచర్ లెర్న్ లాంటి సంస్థల సహకారంతో వివిధ కోర్సుల్లో సుమారు 3 వేల మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. అంతే కాకుండా వర్చువల్ విధానం ద్వారా ఎపిఎస్ఎస్డిసి ఆధ్వర్యంలో ఏప్రిల్ 2021 నుంచి ఆగస్టు 31, 2021 వరకు మొత్తం 81 డ్రైవ్ లు, స్కిల్ కనెక్ట్ డ్రైవ్ లు, పూల్ డ్రైవ్ లు నిర్వహించగా 30,341 మంది హాజరయ్యారు. వీరిలో 6,412 మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారు.
భవిష్యత్ ప్రణాళికలో భాగంగా, ప్రతి లోక్ సభ నియోజకవర్గంలో ఒక స్కిల్ కాలేజీ చొప్పున 25 స్కిల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించి రూ.460 కోట్ల నిధులను విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే ఒక స్కిల్ ట్రైనింగ్ అకాడమీకి వైఎస్సార్ జయంతి సందర్భంగా పులివెందులలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో 5 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.20 కోట్ల అంచనా వ్యయంతో నైపుణ్య శిక్షణా కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నారు. 45,520 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే స్కిల్ కాలేజీల్లో ఆరు క్లాస్‌ రూములు, రెండు ల్యాబ్‌లు, రెండు వర్క్‌షాపులు, ఒక స్టార్టప్‌ ల్యాబ్, అడ్మిన్, స్టాఫ్‌ గదులు ఉండే విధంగా డిజైన్‌ చేశారు. అంతే కాకుండా 126 మంది అక్కడే ఉండి శిక్షణ తీసుకునే విధంగా హాస్టల్స్‌ను కూడా నిర్మించనున్నారు.అదే విధంగా ప్రతి కాలేజీలో ఆయా ప్రాంత అవసరాలకు అనుగుణంగా రెండు ప్రాధాన్యత కోర్సులను కూడా ప్రభుత్వం ఎంపిక చేసింది.రంగాలను బట్టి కోర్సు కాల వ్యవధి 3 నెలల నుంచి 6 నెలల వరకు ఉంటుంది. వీటిని బట్టి కనీసం ఏడాదికి ఒక్కో శిక్షణ కేంద్రం నుంచి 1,920 మందికి శిక్షణ ఇవ్వడంతోపాటు ఉపాధి కల్పించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసిన ప్రభుత్వం.
తాజాగా ఏపీఎస్ఎస్డీసీ 102 కోట్ల వ్యయంతో, 6 నైపుణ్య కాలేజీలకు టెండర్లను పిలిచింది. ఇందులో భాగంగా కృష్ణా జిల్లాలో విజయవాడ, మచిలీపట్నంలో 2 నైపుణ్య కాలేజీలను, గుంటూరు జిల్లాలో నల్లపాడు, బాపట్ల, నర్సరావుపేటలో 3 నైపుణ్య కాలేజీలను, ప్రకాశం జిల్లా ఒంగోలులో ఒక నైపుణ్య కాలేజీని ఏర్పాటు చేయనున్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా.. ప్రస్తుత ప్రభుత్వం చేపడుతున్న పరిశ్రమ అనుకూలిత నైపుణ్య శిక్షణ ద్వారా, రానున్న మూడేళ్ళలో వేలాది మంది నిరుద్యోగులు ఉద్యోగ అవకశాలు పొందనున్నారు.

Leave a Reply