ఆర్టీసీని అమ్మేస్తే రూ.1,000 కోట్ల బ‌హుమతి ఇస్తారట‌!

-కేంద్రంపై సంచ‌ల‌న ఆరోప‌ణ చేసిన కేసీఆర్‌
-ఆర్టీసీని అమ్మేయాల‌ని కేంద్రం నుంచి లేఖ‌ల‌పై లేఖ‌లు వ‌స్తున్నాయ‌ని ఆరోప‌ణ‌
-అన్ని రాష్ట్రాల‌పైనా కేంద్ర ఆర్థిక శాఖ ఒత్తిడి తీసుకొస్తోంద‌ని విమ‌ర్శ‌

తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాల్లో భాగంగా సోమ‌వారం స‌భ‌లో సీఎం కేసీఆర్ ఓ సంచ‌ల‌న‌ అంశాన్ని ప్ర‌స్తావించారు. ప్ర‌జ‌ల ర‌వాణాలో కీల‌క భూమిక పోషిస్తున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ (టీఎస్సార్టీసీ)ని గంప‌గుత్త‌గా అమ్మేయాలంటూ కేంద్ర ప్ర‌భుత్వం ఒత్తిడి చేస్తోంద‌ని ఆయ‌న‌ ఆరోపించారు. ఈ త‌ర‌హా ఒత్తిడి ఒక్క తెలంగాణ‌పైనే కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాల ప్ర‌భుత్వాల‌పైనా ఉంద‌ని ఆయ‌న వెల్ల‌డించారు. ఈ మేర‌కు కేంద్రం రాసిన లేఖ‌ల‌ను కూడా ఆయ‌న స‌భ‌లో ప్ర‌ద‌ర్శించారు.

ఆర్టీసీని గంప‌గుత్త‌గా అమ్మేయాల‌ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి కార్యాల‌యం నుంచి లేఖ‌ల మీద లేఖ‌లు వ‌స్తున్నాయ‌ని కేసీఆర్ తెలిపారు. త‌మ ప్ర‌తిపాద‌న మేర‌కు ఎవ‌రు ముందుగా ఆర్టీసీని అమ్మేస్తారో వారికి రూ.1,000 కోట్ల మేర బ‌హుమానాన్ని కూడా అందిస్తామ‌ని కేంద్రం చెబుతోంద‌ని ఆయ‌న ఆరోపించారు. ప్ర‌భుత్వ సంస్థ‌ల‌ను తాము అమ్మేస్తున్నామ‌ని, త‌మ బాట‌లో మీరు కూడా న‌డ‌వండి అంటూ రాష్ట్రాల‌ను కేంద్రం ప్రోత్స‌హిస్తోంద‌ని కేసీఆర్ విమ‌ర్శించారు.

Leave a Reply