Suryaa.co.in

Andhra Pradesh

గ్రామసభ – సంచలన తీర్మానం

15 వ ఆర్థిక సంఘం ద్వారా కేంద్రం ప్రభుత్వం మా బొడ్డపాడు గ్రామానికి పంపిన 9 లక్షల 80 వేల రూపాయలు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మాగ్రామానికి తిరిగి ఇచ్చివెయ్యాలి – గ్రామ సభ తీర్మానం
కృష్ణా జిల్లా ,తోట్ల వల్లూరు మండలం, బొడ్డపాడు గ్రామంలో సర్పంచ్ మూడే శివ శంకర్ యాదవ్ అధ్యక్షతన జరిగిన “బొడ్డపాడు గ్రామ సభలో ” తమ గ్రామానికి కేంద్రం పంపిన నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించి తన సొంత అవసరాలకు వాడుకోవడం దారుణమని వెంటనే ఆ నిధులు తిరిగి ఇచ్చివెయ్యాలని బొడ్డపాడు గ్రామ ప్రజలు తమ గ్రామ సభలో ఏకగ్రీవ తీర్మాణం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది.
ఈ సందర్బంగా గ్రామ సర్పంచ్ మూడే శివ శంకర్ మాట్లాడుతూ 15 వ ఆర్థిక సంఘం ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని పంచాయతీలకు సుమారు 3000 వేల కోట్ల రూపాయలు పంపిస్తే, దానిలో మా బొడ్డపాడు గ్రామానికి 9 లక్షల 80 వేల రూపాయలు రావడం జరిగిందని, వాటిని రాష్ట్ర ప్రభుత్వం దొడ్డి దారిన దారి మళ్లించి మా సంతకాలు లేకుండా, కనీసం మాకు ఒక మాటైనా చెప్పకుండా డబ్బులన్నీ తీసివేసుకోవడం జరిగిందని, ఆ డబ్బులు వస్తే మా గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఎంతో ఆశగా మా బోర్డు మరియు గ్రామ ప్రజలందరూ ఆశగా ఎదురు చూశామని, కానీ ఇప్పుడు ఆ డబ్బులన్నీ రాష్ట్ర ప్రభుత్వం అడ్డదారిలో దొంగలించడంతో మా గ్రామాభివృద్ధి ఏ విధంగా చెయ్యాలో జగన్ మోహన్ రెడ్డిగారు, అధికారులు మా గ్రామ ప్రజలకి సమాధానం చెప్పాలని, అదేవిధంగా మా గ్రామానికి రావాల్సిన డబ్బులు వడ్డీతో వెంటనే చెల్లించక పొతే మా గ్రామ ప్రజలందరి సంతకాలతో హై కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పై, సంబంధిత అధికారులపై కేసులు వెయ్యాలని ఈ రోజు గ్రామ సభలో తీర్మానించినట్లు సర్పంచ్ శివ శంకర్ అన్నారు.
ఈ గ్రామ సభలో రాజకీయ పార్టీలకతీతంగా గ్రామ ప్రజలందరూ పాల్గొని తమ గ్రామానికి కేంద్రం పంపిన నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం తీసివేసుకోవడం పై మండిపడుతూ, ప్రసంగిస్తూ మా నిధులు తిరిగి ఇచ్చివెయ్యాలని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక పంపడం జరిగింది.
గ్రామ సభలో ప్రజలందరూ సంతకాలు చేసిన ఈ తీర్మాణాన్ని జిల్లా కలెక్టర్ గార్కి, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గార్కి, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గార్కి పంపిస్తామని సర్పంచ్ శివ శంకర్ తెలిపాడు.
ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ కూనపరెడ్డి శివశంకర్, పంచాయతీ సభ్యులు మసీముక్కు శ్రీనివాసరావు, పెనుమాక భాగ్యలక్ష్మి, గుర్రాల రజని, జాజుల కోటేశ్వరరావు, pacs మాజీ అధ్యక్షులు శీలం నాగార్జున రావు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

LEAVE A RESPONSE