Suryaa.co.in

Telangana

రేవంత్ ఆడుతున్నది తొండి మ్యాచులు

– నీ మాటల్లో తొండి, హామీల అమల్లో తొండి. కానీ కలెక్షన్లలో మాత్రం 2020
– కేసీఆర్ టెస్టు, వన్ డే, 2020 ఏదైనా అద్బుతంగా ఆడుతడు
– డిసెంబర్ 9, 2009 ప్రకటన వచ్చిందంటే కేసీఆర్ దీక్ష ఫలితం
– ఆయన దీక్ష చేయకుంటే ఈనాడు తెలంగాణ ప్రకటన వచ్చేదా?
– తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కేసీఆర్ పుట్టిన రోజు వేడుకల్లో మాజీ మంత్రి హరీశ్ రావు

హైదరాబాద్: కేసీఆర్ జన్మదినం రాష్ట్ర ప్రజలందరికీ పండుగ దినం. కేసీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక నాయకుడు కాదు, నాలుగు కోట్ల ప్రజల భావోద్వేగం. కేసీఆర్ 1954లో పుట్టారు. ఆయన పుట్టిన రెండేళ్లకే ఉన్న తెలంగాణను ఆంధ్రలో కలిపింది ఆనాటి కాంగ్రెస్ పార్టీ. 1969లో మలి దశ తెలంగాణ ఉద్యమం వచ్చిన నాడు కేసీఆర్ వయస్సు 16 ఏండ్లు.

16 ఏండ్లలోనే జై తెలంగాణ అంటూ ఉద్యమంలో పాల్గొన్నడు.
కేసీఆర్ సహా తెలంగాణ వాదులు ఇష్టం ఉన్నా లేకున్నా ఆంధ్ర పాలకుల పార్టీల్లో పని చేశారు. కేసీఆర్ కూడా తెలుగుదేశంలో పని చేశారు. తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రశ్నిస్తూ వచ్చారు. అన్ని భరించారు. తెలంగాణ బాగు పడాలంటే రాష్ట్ర ఏర్పాటు తప్ప మరొక దారి లేదని బయటికి వచ్చారు. కరెంట్ బిల్లులు పెంచితే తెలంగాణ ప్రజలకు ఉరితాడు అయిదని చెప్పిండు. వందలు, వేల గంటల మేథోమదనం తర్వాత తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారు.

ఎవరు జై తెలంగాణ అన్నా పదవి కోసమే అని నాడు అపవాదు ఉండేది. 1969 నుంచి 2001 మధ్య అనేక మంది జై తెలంగాణ అని ఉద్యమం ప్రారంభించి, పదవి రాగానే మధ్యలో వదిలి పెట్టారు. దాని వల్ల ప్రజల్లో అపనమ్మకం కలిగింది. ఆ అపవాదును తొలగించడానికి మూడు పదవులను గడ్డి పోచలుగా త్యజించారు. తెలంగాణ ప్రజల్లో నమ్మకం కల్పించారు కేసీఆర్.

డిప్యూటీ స్పీకర్ పదవి, కార్యదర్శి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిండు. కేసీఆర్ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉందని నాడు ప్రొఫెసర్ జయశంకర్ రావు అనేవారు. ఎంతో మంది మేధావులు కేసీఆర్ మీద విశ్వాసం ఉంచారు. ఆ నమ్మకాలను కేసీఆర్ నిలబెట్టిండు.

2001 నుంచి కేసీఆర్ తో పని చేసే అదృష్టం నాకు దొరికింది. తెలంగాణ కోసం ఎంతో శ్రమించారు. ఎన్నో బాధలు అనుభవించారు. ఉద్యమ సమయంలో వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. రకరకాలుగా బదనాం చేసేవారు. మొండి ధైర్యంతో పోరాటం చేసిండు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిండు. దట్ ఈజ్ కేసీఆర్. పదవులకు ఆశపడినా, కుంగిపోయినా, వెనక అడుగు వేసినా ఈరోజు మన తెలంగాణలో మనం ఉండే వాళ్లం కాదు. తెలంగాణ వచ్చిందంటే అది కేసీఆర్ మొండి పట్టుదల, పోరాటం వల్లే.

ఫిబ్రవరి 17 ఎంత ముఖ్యమో, నవంబర్ 29 కూడా అంతే ముఖ్యం. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో, అయితే తెలంగాణ జైత్ర యాత్ర లేదంటే నా శవయాత్ర అని చెప్పి ఆమరణ దీక్షకు దిగిండు. గాంధీజీ సత్యాగ్రహం, పొట్టి శ్రీ రాములు ఆమరణ దీక్ష చూసాం. కేసీఆర్ ప్రాణ త్యాగానికి సిద్ధమై ఢిల్లీ పీఠాన్ని కదిలించారు. డిసెంబర్ 9, 2009 ప్రకటన వచ్చిందంటే కేసీఆర్ దీక్ష ఫలితం. ఆయన దీక్ష చేయకుంటే ఈనాడు తెలంగాణ ప్రకటన వచ్చేదా? దీక్ష విరమించండి, మేము తెలంగాణ ప్రక్రియ ప్రారంభిస్తామని చిదంబరం ఫోన్ చేస్తే, కేసీఆర్ వినలేదు.

తెలంగాణ ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన వస్తేనే దీక్ష విరమిస్తానని భీష్మించుకున్నడు కేసీఆర్. అప్పటికే 11 రోజులు అయ్యింది. ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింది. కానీ పట్టుదల మాత్రం వదలలేదు. మీరే రాసి పంపండి అంటే, జయశంకర్ స్వహస్తాలతో రాసి ఢిల్లీకి పంపితే, దాన్నే చిదంబరం ఢిల్లీ నుంచి అనౌన్స్ చేసిండు. అట్ల తెలంగాణ తెచ్చుకున్నం. తెలంగాణ తేవడమే కాదు, తెలంగాణను కన్నబిడ్డ లెక్క చూసుకున్నడు కేసీఆర్ పదేండ్లలో కన్న బిడ్డ లాగా తెలంగాణను తీర్చిదిద్దారు.

తాగు నీరు, సాగు నీరు, విద్యుత్… అన్ని రంగాల్లో తెలంగాణను అద్బుతంగా తీర్చిదిద్దారు. దేశానికి రోల్ మోడల్ గా చేశారు.కేసీఆర్ కు తెలంగాణకు ఉన్న బంధం తల్లి బిడ్డల బంధం, పేగు బంధం. 2020 మ్యాచులు ఆడుతున్న అని రేవంత్ అంటున్నడు. ఆయన ఆడుతున్నది తొండి మ్యాచులు. పైసల కోసం ఆడుతున్న మ్యాచులు. నీ మాటల్లో తొండి, హామీల అమల్లో తొండి. కానీ కలెక్షన్లలో మాత్రం 2020. దీపం ఉండంగనే ఇళ్లు సక్కబెట్టుకోవాలని సదురుకుంటున్నవు. కేసీఆర్ టెస్టు, వన్ డే, 2020 ఏదైనా అద్బుతంగా ఆడుతడు.

ఎప్పుడు ఏది ఆడాల్నో కేసీఆర్ కు బాగా తెలుసు. అవసరం అయితే డిఫెన్స్ అడుతడు, అవసరం అయితే సిక్స్ లు కొడుతడు. తెలంగాణ ప్రజలు ఏడికిపోయినా మళ్లీ కేసీఆర్ రావాలంటున్నరు. కూలీ పని చేసుకునే వాళ్ల దగ్గర నుంచి రోడ్ల మీద పోయే పిల్లల వరకు అందరూ కేసీఆర్ రావాలి అంటున్నారు. రేవంత్ పాలన బాగోలేదని తిడుతున్నరు. ఓటమి విజయానికి నాంది అంటరు. భవిష్యుత్తులో మరో మూడు టర్ములు గెలవడానికి ఇది నాంది కాబోతుంది.

అందరూ కేసీఆర్ వైపు చూస్తున్నరు. ఒకడు తెచ్చినం అంటడు, ఇంకొకడు ఇచ్చినం అంటడు. కానీ తెలంగాణ వచ్చిందంటే, డిల్లీ కదిలిందంటే దానికి కారణం కేసీఆర్. కారణజన్ముడు కేసీఆర్.

LEAVE A RESPONSE