Suryaa.co.in

Telangana

వడ్లకు బోనస్ రూ.500లు ఇవ్వలేనోళ్లు… రూ.30 వేల కోట్ల రుణమాఫీ చేస్తానంటే నమ్మేదెలా?

-రైతుల కోసం రూ.700 కోట్లు ఖర్చు చేసి తాలు, తరుగు లేకుండా వడ్లు కొనలేరా?
-6 గ్యారంటీల అమలు పెద్ద బోగస్
-మోసాలు చేయడంలో కేసీఆర్ మించిన కాంగ్రెస్ నేతలు
-కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై నిప్పులు చెరిగిన బండి సంజయ్ కుమార్
-సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరిన చొప్పదండి -నియోజకవర్గ కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు

వడ్లకు రూ.500 రూపాయల బోనస్ ఇవ్వలేని కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ పేరుతో రూ.30 వేల కోట్లను మాఫీ చేస్తామంటే నమ్మేదెవరని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వానలతో కొనుగోలు కేంద్రాల వద్ద వడ్లు తడిసిపోతున్నాయని, గతంలో ఇచ్చిన హామీ మేరకు తాలు, తరుగు, తేమతో సంబందం లేకుండా వడ్లను కొనుగోలు చేయడానికి రూ.700 కోట్లు ఖర్చు చేస్తే రైతులకు మేలు జరుగుతుందని చెప్పారు.

ఆ నిధులను కూడా సమకూర్చలేని ప్రభుత్వం రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానంటే రైతులెవరూ నమ్మడం లేదన్నారు. జీతాలు, అప్పులు చెల్లించడానికే నెలనెలా రూ.11 వేల కోట్లను సమకూర్చలేక అపసోపాలు పడుతున్న ప్రభుత్వం వద్ద రూ.30 వేల కోట్ల రుణమాపీ ఎట్లా చేస్తుందో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. మోసాలు చేయడంలో కాంగ్రెస్ నేతలు కేసీఆర్ ను మించి పోయారన్నారు.

ఈరోజు సాయంత్రం కరీంనగర్ లోని ఎంపీ కార్యాలయంలో బండి సంజయ్ సమక్షంలో చొప్పదండి నియోజకవర్గంలోని వెలిచాలకు చెందిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నాయకులు పెద్ద ఎత్తున బీజేపీలో చేరారు. వారందరికీ కాషాయ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించిన బండి సంజయ్… ఈ సందర్బంగా వారిని ఉద్దేశించి ప్రసంగించారు.. ముఖ్యాంశాలు….

బీజేపీలో చేరిన వివిధ పార్టీలకు చెందిన చొప్పదండి నియోజకవర్గ నాయకులకు స్వాగతం. ఈ దేశం అభివ్రుద్ది చెందాలంటే, పేదల బతుకులు బాగుపడాలంటే మోదీయే ప్రధానిగా ఉండాలని భావించి కరీంనగర్ లో బీజేపీని గెలిపించేందుకు సిద్దమై ఇతర పార్టీల నుండి వస్తున్న నేతలకు మనస్పూర్తిగా స్వాగతం పలుకుతున్నా…

మొన్నటి ఎన్నికల్లో అధికారంలోకి వస్తే వంద రోజుల్లో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను నమ్మి గెలిపిస్తే.. అధికారంలోకి వచ్చాక నమ్మక ద్రోహం చేసింది. ఇయాళ కరీంనగర్ జిల్లాలో ఎప్పుడు వర్షం పడతదో తెల్వని పరిస్థితి. ఇతర జిల్లాల్లో వానలు పడి వడ్లు తడిసిపోతున్నయ్.

వడ్లకు బోనస్ ఇస్తామన్నరు. రాష్ట్రవ్యాప్తంగా 70 లక్షల టన్నుల వడ్లు పండినయ్. బోనస్ ఇయ్యాలంటే క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ ఇవ్వాలంటే రూ.3,500 కోట్లు కావాలి. అట్లాగే పత్తి, మిర్చి, మొక్క జొన్నసహా ఇతర పంటలకు మరో రూ.1500 కోట్లు కావాలి…

అట్లాగే తాలు, తరుగు, తేమ లేకుండా వడ్లు కొనాలంటే ప్రభుత్వం రూ.700 కోట్లు ఖర్చవుతాయి. ఎందుకంటే తాలు, తరుగు, తేమ పేరుతో క్వింటాలుకు సగటున 5 కిలోలు చొప్పున రైతులు నష్టపోతున్నరు.

ఈ లెక్కన బోనస్ కోసం రూ.5 వేలు కోట్లు, తాలు, తరుగు లేకుండా రూ.700 కోట్లు ఖర్చు పెడితే రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించే వాళ్లు..

కానీ అదేమీ చేయకుండా రైతులను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ఆగస్టు 15న రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామంటే నమ్మేదెలా? రుణమాఫీ చేయాలంటే రూ.30 వేల కోట్లు అవసరం. ప్రభుత్వ ఖజానాలో నయా పైసా లేదు. జీతాలు, అప్పుల కోసమే నెలనెలా రూ.11 వేల కోట్లు సమకూర్చలేక అపసోపాలు పడుతున్నరు.. మరి రుణమాఫీ ఎట్లా చేస్తారో ప్రభుత్వం సమాధానం చెప్పాలే… మోసాలు చేయడంలో కాంగ్రెస్ నేతలు కేసీఆర్ ను మించి పోయారు..

ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నా… వర్షాలతో రైతులు ఇబ్బంది పడుతున్నరు. కొనుగోలు కేంద్రాల వద్ద సరైన సౌకర్యాలు లేవు.. వెంటనే యుద్ద ప్రాతిపదికన ఇచ్చిన మాట ప్రకారం బోనస్ ఇచ్చి వడ్లను కొంటారా? లేదా? స్పష్టం చేయాలి. అట్లాగే తాలు, తరుగు, తేమతో సంబందం లేకుండా వడ్లను కనీస మద్దతు ధరతోపాటు అదనంగా బోనస్ ఇచ్చి వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నా…

ఎమ్మెల్యేగా ఓడిపోయిన బండి సంజయ్ ఎంపీగా పోటీ చేయడానికి కరీంనగర్ పునరావాస కేంద్రమా? అంటూ వినోద్, గంగుల కమలాకర్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ….

ఆ మాట అనడానికి సిగ్గుండాలే.. ఎంపీగా బిడ్డ ఓడిపోతే ఎమ్మెల్సీ సీటు ఇచ్చారు. వినోద్ కుమార్ లక్ష ఓట్లతో ఓడిపోతే ప్రణాళిక సంఘం ఛైర్మన్ ఇచ్చారు.. ఎమ్మెల్యేగా ఓడిపోయిన కొప్పుల ఈశ్వర్ కు ఎంపీ సీటిచ్చారు.. మరి వాటినేం అంటారు? నేను లోకల్. వినోద్ నాన్ లోకల్.. సిట్టింగ్ ఎంపీని. మరి ఎవరికి పునరావాస కేంద్రమో ప్రజలు ఆలోచించాలి. ఇవన్నీ గమనించే ప్రజలు గత ఎన్నికల్లో బీఆర్ఎస్ చెంప చెళ్లు మన్పించినా వాళ్లకు సిగ్గు రాలేదు…

ప్రభుత్వాన్ని కూల్చాలనే ఉద్దేశం బీజేపీకి లేదు.. గతంలో బీఆర్ఎస్ నుండి, ఇప్పుడు కాంగ్రెస్ నుండి పలువురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతామని ఆసక్తి చూపుతున్నా… ఆ పదవులకు రాజీనామా చేసి వస్తేనే బీజేపీలో చేర్చుకుంటామని చెప్పినం. ఎందుకంటే బీజేపీ సిద్దాంతాలు, విధానాలున్న పార్టీ. గతంలో ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి బీజేపీలో చేర్చుకున్న విషయాన్ని మర్చిపోవద్దు…

పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ప్రధాన ప్రత్యర్ధే లేదు. 17కు 17 సీట్లు గెలవబోతున్నాం. కరీంనగర్ లో నన్ను ఓడగొట్టడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు కలిసి పనిచేస్తున్నరు. డబ్బులు వెదజల్లుతున్నరు. కాంగ్రెస్ శ్రేణులే ఈ విషయాన్ని నాకు చెబుతూ.. ఎవరెన్ని కుట్రలు చేసినా మీకే ఓటేస్తామని చెబుతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్ధులు రెండో స్థానం కోసమే పోటీ పడుతున్నారు.. బీజేపీ బంపర్ మెజారిటీతో కరీంనగర్ సీటును కైవసం చేసుకోబోతోంది. దేశంతోపాటు రాష్ట్రంలోనూ ఎక్కడ చూసినా బీజేపీ గాలి వీస్తోంది. మోదీ హవా నడుస్తోంది.

కాంగ్రెస్ పరిస్థితి చూస్తే జాలేస్తోంది. నామినేషన్లు ప్రారంభమైన తరువాత కూడా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులే దొరకడం లేదు.. దేశంలో కాంగ్రెస్ కూటమికి కెప్టెన్(ప్రధాని) లేకుండానే బరిలో దిగుతోంది. ఇక్కడ టీం సభ్యులే కరువుయ్యారు. ఇగ కరీంనగర్ లో బీఆర్ఎస్ అభ్యర్ధి గెలిచే అవకాశాలే లేవు… ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావు. పొరపాటున కరీంనగర్ లో గెలిస్తే బీఆర్ఎస్ తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలుచుకుంటుంది.. అందుకే దేశంలో జరిగే ఇండియన్ పొలిటికల్ లీగ్(ఐపీఎల్) పోటీల్లో 400 సీట్లతో మోదీ ఐపీఎల్ కప్ ను కైవసం చేసుకున హ్యాట్రిక్ సాధించబోతున్నారు..

నేనడుగుతున్నా… కరీంనగర్ లో పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్ధి ఎన్నడైనా ప్రజా సమస్యలపై కొట్లాడారా? ఇక్కడున్న మంత్రి గత ఐదేళ్లలో ఎన్నడైనా ప్రజల కోసం ఉద్యమాలు చేశారా? నేను ప్రజల కోసం నిరంతరం కొట్లాడిన. జైలుకుపోయిన. నాపై 109 కేసులు పెట్టినా భయపడకుండా కేసీఆర్ ను గద్దె దించే దాకా పోరాడిన. హిందుగాళ్లు బొందుగాళ్లని హేళన చేసిన కేసీఆర్ చెంప చెళ్లు మన్పించిన చరిత్ర కరీంనగర్ ప్రజలది.

నాస్తికుల నోట కూడా జై శ్రీరాం అన్పించిన చరిత్ర తెలంగాణ ప్రజలది… కాంగ్రెస్ పార్టీ పీఎఫ్ఐ లాంటి ఉగ్రవాద సంస్థలను పెంచి పోషిస్తుంటే.. వాళ్లకు వ్యతిరేకంగా కొట్లాడుతున్న ఏకైక పార్టీ బీజేపీ. దేశంలో, రాష్టంలో గుంట నక్కలన్నీ ఏకమైనా బీజేపీ సింహం మాదిరిగా సింగిల్ గా పోటీ చేస్తోంది. మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం..

LEAVE A RESPONSE