– తెలంగాణ విజన్ డాక్యుమెంట్ కు అనుగుణంగా క్వాంటం రోడ్డు మ్యాప్
– క్వాంటం రోడ్డు మ్యాప్ కలిగిన తొలి రాష్ట్రం తెలంగాణ
– రాష్ట్ర, దేశ అభివృద్ధికి క్వాంటం టెక్నాలజీ కీలకం
– క్వాంటం స్టార్ట్ అప్ పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
హైదరాబాద్ : భవిష్యత్తు క్వాంటం ఎకానమీ లీడర్ గా హైదరాబాద్ నిలుస్తుంది, ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, డిజిటల్ నైపుణ్యం వంటి అన్ని వనరులు హైదరాబాదులో దండిగా ఉన్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. నీతి ఆయో రోడ్డు మ్యాప్ “తెలంగాణ రైజింగ్ 2047”, 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చే రాష్ట్ర దృష్టికోణానికి అనుగుణంగా రూపొందించబడింది అని అభివర్ణించారు.
త్రిబుల్ ఐటీ గచ్చిబౌలిలో నీతి ఆయోగ్ రోడ్ మ్యాప్ ఫర్ క్వాంటం అండ్ తెలంగాణ క్వాంటం స్ట్రాటజీ ఆవిష్కరణ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మాట్లాడారు. తెలంగాణ క్వాంటం వ్యూహం ద్వారా క్వాంటం టెక్నాలజీకి ప్రత్యేక రోడ్మ్యాప్ కలిగిన దేశంలోని తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందనీ డిప్యూటీ సీఎం తెలిపారు.
1980వ దశకం లోనే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుకున్నామని రాబోయే రోజుల్లో ప్రపంచాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడిపిస్తుందని ఆ రోజుల్లోనే తాము హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులుగా చర్చించుకున్న విషయాన్ని సభలో డిప్యూటీ సీఎం పంచుకున్నారు. క్వాంటం టెక్నాలజీ ప్రపంచాన్ని ఏ ఇతర సాంకేతికత కంటే వేగంగా అన్ని రంగాల్లోనూ మార్పు తీసుకురాబోతుందని డిప్యూటీ సీఎం తెలిపారు.
గొప్ప భవిష్యత్తు కోరుకునే ఏ దేశానికైనా క్వాంటం వ్యూహం అవసరం అని అన్నారు. దేశాల భవిష్యత్తు, వారి జాతీయ భద్రత, వారి ఆర్థిక పరిమాణం, అభివృద్ధి , అన్నింటినీ ఇది పెద్ద స్థాయిలో ప్రభావితం చేస్తుందనీ తెలిపారు.జాతీయ మిషన్కు అనుసంధానంగా రూపొందించిన తెలంగాణ క్వాంటం వ్యూహం (టీక్యూఎస్), పరిశోధన, నైపుణ్యాభివృద్ధి, విద్య, మౌలిక వసతులు, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో ఏకీకృత, భవిష్యత్ను దృష్టిలో పెట్టుకున్న లక్ష్యాలను సాధిస్తుంది అని డిప్యూటీ సీఎం తెలిపారు. టీక్యూఎస్ ప్రారంభంతో పాటు, భారతదేశంలో అత్యంత ఆధునిక క్వాంటం ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ను నిర్మించాలన్న మా రాష్ట్ర సంకల్పాన్ని ప్రపంచానికి ఈ వేదిక ద్వారా ప్రకటిస్తున్నాం అన్నారు. మేము కేవలం వ్యూహరచననే కాకుండా, అమలుకు రోడ్డు మ్యాప్ ను ఆవిష్కరిస్తున్నాం అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు.
బలమైన, లోతైన పరిశ్రమ, విద్యాసంస్థల భాగస్వామ్యాలను మేము ప్రోత్సహించబోతున్నాం అన్నారు. క్వాంటం టెక్నాలజీ తెలంగాణతో పాటు భారత ఆర్థిక వృద్ధికి కీలకాధారం కానుంది అని డిప్యూటీ సీఎం వివరించారు.
ఇది అన్ని రంగాల్లో గ్లోబల్ పెట్టుబడులను ఆకర్షించడానికి, నిలుపుకోవడానికి సహాయపడుతుంది,మా పరిశోధన, ఆవిష్కరణ ప్రణాళికలకు ఇది అత్యంత కీలకం అని తెలిపారు. స్టార్టప్ల లక్ష్యాలను చేరుకోవడంలో కూడా క్వాంటం ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నారు.
ఈ రోజు, మేం యువ భారత్ స్టార్టప్ ఫండ్ను ₹1,000 కోట్లతో స్థాపిస్తున్నామని ప్రత్యేకంగా చెప్పాలి, క్వాంటం స్టార్టప్లు మా ప్రధాన దృష్టి అని డిప్యూటీ సీఎం ఉద్ఘాటించారు. ప్రయోగశాలలలోని పరిశోధన నుంచి మార్కెట్లోని వ్యాపార, అనుబంధ విభాగాల వరకు పూర్తి క్వాంటం విలువ శృంఖల (వాల్యూ చైన్)ను ఎలా నిర్మించాలన్న దానికి తెలంగాణ ఆదర్శ రాష్ట్రంగా మారడానికి మేము కృషి చేస్తామని డిప్యూటీ సీఎం భరోసా ఇచ్చారు.
క్వాంటం కేవలం వ్యాపారం లేదా ఆర్థికాభివృద్ధికే కాదు, కంప్యూటింగ్, కమ్యూనికేషన్స్, సైబర్ సెక్యూరిటీ సామర్థ్యాల పెంపుకు కూడా కీలకం అని తెలిపారు తెలంగాణ విస్తృతమైన శాస్త్రీయ, విధాన దృక్పథం, కార్యసాధన శక్తి ఈ మూడింటినీ కలిపి, విద్యాసంస్థలు, స్టార్టప్లు, పరిశ్రమ, ప్రభుత్వం భాగస్వాములుగా పనిచేసే బలమైన ఎకోసిస్టమ్ను నిర్మిస్తుంది అని డిప్యూటీ సీఎం అన్నారు. మన దేశం ఒక గొప్ప “క్వాంటం లీప్” తీసుకుంటున్న ఈ రోజును మనమందరం కలిసి జరుపుకుందామన్నారు.
సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు తో పాటు నీతి ఆయోగ్ సీఈవో బి.వి.ఆర్. సుబ్రహ్మణ్యం, సభ్యులు డాక్టర్ వి.కె. సారస్వత్, దేబ్జాని ఘోష్, స్పెషల్ సిఎస్ సంజయ్ కుమార్, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్, ఐఐఐటి-హైదరాబాద్, ఐఐటీ-హైదరాబాద్, సి.ఆర్. రావు ఇన్స్టిట్యూట్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్ఆర్) ప్రముఖులు పాల్గొన్నారు.