– దేశానికి రెండు కళ్లు మహాత్మా గాంధీ, బాబాసాహెబ్ అంబేడ్కర్
– దళిత బిడ్డ స్పీకర్ గా ఉన్నారని అసెంబ్లీకి రాకుండా ఆయన్ని అవమానిస్తున్నారు
– దళిత బిడ్డలు ఆర్ధిక మంత్రిగా ఉండొద్దా?
– ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండొద్దా?
– కులాల అంతరం తొలగి పోవాలని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నాం
– భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్: రక్తం చిందించకుండా శాంతితో యుద్ధాన్ని గెలవచ్చని మహాత్మా గాంధీ నిరూపిస్తే….దేశాన్ని ప్రపంచ దేశాలకు ఆదర్శంగా పరిపాలించవచ్చని నిరూపించింది బాబాసాహెబ్ అంబేద్కర్. మహాత్మా గాంధీ పాత్ర ఎంత ఉందో.. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో అంబేద్కర్ పాత్ర అంతే ఉంది. దేశానికి రెండు కళ్లు మహాత్మా గాంధీ, బాబాసాహెబ్ అంబేడ్కర్
అంబేద్కర్ ఆలోచనలను ప్రపంచం అనుసరిస్తోంది. విద్య ఒక్కటే మన జీవితాలని మారుస్తుందని అంబేద్కర్ నమ్మారు. అంబేద్కర్ ఆలోచనే ప్రజా పాలన విధానం. ఆర్టికల్ 3 ద్వారానే సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ ఉద్యమంలో బడుగు బలహీన వర్గాలే ముఖ్య పాత్ర పోషించాయి. పాటతో ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగసేలా చేసిన గద్దరన్న పాత్రను మరిచిపోతారని ఎవరైనా అనుకుంటే అది వారి భ్రమనే.
జయ జయహే తెలంగాణ గీతాన్ని రాసిన అందేశ్రీ మనవాడు కాదా? ఆనాటి పాలనతో పోలిస్తే ఈ ప్రజా ప్రభుత్వంలో దళితులకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం. దళిత బిడ్డ స్పీకర్ గా ఉన్నారని అసెంబ్లీకి రాకుండా ఆయన్ని అవమానిస్తున్నారు. దళిత బిడ్డలు ఆర్ధిక మంత్రిగా ఉండొద్దా? ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండొద్దా? దళితులను అవమానపరిచిన వాళ్లను ఒకసారి మైక్ ఇవ్వండి అని దళితుడిని అడిగేలా చేసింది ప్రజా ప్రభుత్వం.
అన్ని రంగాల్లో దళిత గిరిజనులకు ప్రాధాన్యత కల్పిస్తున్నాం. ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంచిన ఘనత ప్రజా ప్రభుత్వాని.ది. కులాల అంతరం తొలగి పోవాలని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నాం.పేదలకు విద్య అందాలన్న అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తున్నాం. నాణ్యమైన విద్య అందించాలన్న ఆశయంతో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ తీసుకొస్తున్నాం.
రెండేళ్లలో నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చాం. ఇందులో ఎక్కువ దళితులు, గిరిజనులకు ఇచ్చింది వాస్తవం కాదా మీరే ఆలోచించండి. 87 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఉద్యోగాలు లభించాయి.మేం నిరంతరం పనిచేస్తుంటే.. వెనక నుంచి కొందరు కుట్రలు చేసి, గోతులు తవ్వుతున్నారు.గోతులు తవ్వే వారిని ఆ గోతిలోనే పాతిపెట్టే పని మీరు చేయాలి. పదేళ్ల విధ్వంసాన్ని సరిచేస్తూ మేం ముందుకు వెళుతున్నాం.
గత పదేళ్లలో పెద్ద పెద్ద ప్రసంగాలు చేసిన నాయకులు ఒక్కసారైనా అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారా ఆలోచించండి. ప్రజా పాలనను, ప్రజా స్వామ్యాన్ని కాపాడుకునే బాధ్యత మనది.. నియోజకవర్గాల పునర్విభజన విషయంలో బీజేపీ కుట్రలు చేస్తోంది. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే కుట్ర చేస్తున్నారు. 50 శాతం ప్రాతిపదికన పెంచుతామని దక్షిణాది రాష్ట్రాల సీట్ల కోటా తగ్గించాలని చూస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలలో మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతుంది.ఈ చిన్న లెక్క కేంద్ర మంత్రులుగా ఉన్నవాళ్ళకి తెలియడం లేదా?
రాజ్యాధికారం అంతిమ లక్ష్యం అని అంబేద్కర్ చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రో రేటా ప్రకారం సీట్ల పెంపు కోసం మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. మంచి పనికి మా ప్రభుత్వం ముందుంటుంది. ఈ ప్రభుత్వం మీది..ఈ ప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యత మీది.