Suryaa.co.in

Telangana

నేను నాన్ లోకలయితే రేణుకా, నాదెండ్ల లోకలా?

-భట్టి విక్రమార్క ద్రోహి!
-నా దయతోనే భట్టి ఎమ్మెల్సీ అయ్యాడు
-నాకు ఖమ్మం సీటు రాకుండా అడ్డుకుంటున్నాడు
-కాంగ్రెస్‌కు బీసీలు అవసరం లేదా?

-మాజీ ఎంపి హన్మంతరావు సంచలన ఆరోపణలు

ఢిల్లీ: మాజీ ఎంపి, కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పై సంచలన ఆరోపణలు చేశారు. తనకు ఖమ్మం సీటు రాకుండా భట్టి అడ్డుపడుతున్నాడని, తన కుటుంబం కోసం టికెట్ అడుగుతున్నాడని ఆరోపించారు. తన దయతో ఎమ్మెల్సీ అయిన భట్టి, ద్రోహి అన్నారు.

వీహెచ్ ఇంకా ఏమన్నారంటే… భట్టి విక్రమార్క నాకు ద్రోహం చేస్తున్నారు. భట్టి ఎందుకు నన్ను అడ్డుకుంటున్నారో నాకు తెలియడం లేదు. మొదట సీటు ఇస్తా అన్నారు. ఇప్పుడు నన్ను పట్టించుకోవడం లేదు. భట్టి ఈ రోజు పార్టీలో ఈ స్థానంలో ఉన్నాడంటే అందుకు నేనే కారణం. భట్టిని ఎమ్మెల్సీ చేసేంది నేనే. నా కుటుంబంలో ఎవరు రాజకీయాల్లో లేరు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ నాకు న్యాయం చేయాలి. నేను లోకల్ కాదు అంటున్నారు. రేణుకా చౌదరి, నాదెండ్ల భాస్కర్, రంగయ్య నాయుడు వీళ్లంతా లోకలా?

పార్టీ కోసం పదవులు ఆశించకుండా పని చేసిన నాకు న్యాయం చేయాలి. ఖమ్మం లోక్‌సభ స్థానం నాకు కేటాయిస్తే ఖచ్చితంగా గెలుస్తా. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతోంది. బీసీ ఓట్లు కాంగ్రెస్‌కి అవసరం లేదా? బీసీలు ఓట్లు వేసే మిషన్లా?

రాహుల్ గాంధీ జోడో న్యాయ యాత్ర, కులగణన అంటున్నారు.. నాకు రాహుల్ గాంధీ న్యాయం చేయాలి. నేను పార్టీ కోసం పనిచేశా. చచ్చే వరకు పార్టీలోనే ఉంటా. చనిపోయిన తర్వాత కూడా పార్టీ జెండా నాపై ఉంటుంది. నేను పార్టీ మారను. నేను పార్టీలో ఎందరికో సహాయం చేశా.

నా వయసు నాకు అడ్డంకి కాదు. ఈ వయసులోనూ రన్నింగ్ రేసులో పాల్గొంటా. రాహుల్ గాంధీ ఖమ్మం నుంచి పోటీ చేస్తే నేను తప్పుకుంటా. రాహుల్ రాకపోతే నేను ఖమ్మం నుంచి పోటీకి అర్హుడిని’’ అని వీహెచ్ హన్మంత రావు స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE