Suryaa.co.in

Telangana

మల్లన్నసాగర్ నిర్మాణంతో అక్కడ భూకంపం వచ్చే ప్రమాదం

– కాళేశ్వరంపై చర్చకు సిద్ధమా?
– కుంగింది మూడు పిల్లర్లే కాదు
– బీఆర్‌ఎస్‌కు ప్రొఫెసర్ కోదండరాం సవాల్

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ ఇచ్చిన నివేదికపై బీఆర్‌ఎస్ చర్చకు రావాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం సవాల్ చేశారు. అది అవినీతితో నిండిన ప్రాజెక్టు అని ఆరోపించారు. ప్రపంచ ప్రఖ్యాత ఇంజనీర్ హన్మంతరావు చెప్పినా వినిపించుకోకుండా, కేసీఆర్ కాళేశ్వరం నిర్మించారని విమర్శించారు.

కాళేశ్వరం పై బీఆర్ఎస్ అబద్దాలు చెబుతోందని, కాగ్ చెప్పిన వాస్తవాలపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం సవాల్ చేశారు. కాళేశ్వరంతో ఎలాంటి ఉపయోగం ఉండదని తెలిసి కూడా కేసీఆర్ తప్పుడు నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు.

ఈ సందర్బంగా ఆదివారం కోదండరాం సోమాజిగూడ వద్ద మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఐక్యరాజ్య సమితికి పని చేసిన హన్మంతరావు సైతం కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టవద్దన్నప్పటికి కేసీఆర్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదన్నారు. గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులను కొందరికి గుండు గుత్తగా కేటాయించారని కాగ్ వెల్లడించిందన్నారు.

కాళేశ్వరం ద్వారా రైతులకు సాగు నీరు అందించడం చాలా కష్టమని, ఒక ఎకరాకు నీరందించడానికి 46 వేల రూపాయలు ఖర్చు అవుతుందని కోదండరాం అన్నారు. రాష్ట్రంలో 60 శాతం విద్యుత్ కాళేశ్వరం నిర్వహణకు అవసరం ఉంటుందని, కాళేశ్వరం ప్రాజెక్టులో మల్లన్న సాగర్ నిర్మాణం వల్ల ఆ ప్రాంతంలో భూకంపలు వచ్చే ప్రమాదం ఉందన్నారు.

కేవలం కొండపోచమ్మ కాలువ నిర్మాణానికి రూ. 70 కోట్లు కేటాయించారని, గతంలో కడెం ప్రాజెక్ట్ మట్టి మాత్రమే కొట్టుకుపోయిందని.. తర్వాత జరిగిన నిర్మాణంలో ఎలాంటి ఇబ్బంది లేదన్నారు.

కాళేశ్వరంలోని మేడిగడ్డ బ్యారేజ్‌లో పిల్లర్లు కుంగాయి.. ఇంటికి ఒక్క పిల్లర్ కుంగితే ఇల్లు నిలబడుతుందా..? అని కోదండరాం ప్రశ్నించారు. కాళేశ్వరంలో మేడిగడ్డ నుంచి 80 శాతం నీళ్లు అందించే బ్యారేజ్ అదే పగుళ్ళు చూపిందన్నారు.

కుంగింది మూడు పిల్లర్లు మాత్రమే కాదని, కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు లక్షకు రూ. 87 వేలకోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని ఆర్ధికంగా కుప్పకూల్చారని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఇంజనిరింగ్ వ్యవస్థ నిర్వర్యం జరిగిందని, దీనిపై సమగ్రంగా విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వంపై భారం తగ్గేందుకు రీషెడ్యూల్ చేయాలని కోరుతామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిస్థితి ఈ విధంగా మారడానికి కారణమైన బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలనిడిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE