జ‌గ‌న్ చెప్పారంటే చేస్తారంతే

-ఇదంతా నాకే కలగా ఉంది
-చిక్కుముడులు విడదీసి బందరు వాసుల కల అయిన పోర్టు నిర్మాణ పనులను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్రారంభించారు
-మాకు మేలు చేసిన వారిని మేం గుండెల్లో పెట్టుకుంటాం
-మచిలీపట్నం ఎమ్మెల్యేపేర్ని వెంకట్రామయ్య (నాని)

మ‌చిలీప‌ట్నం: చరిత్రలో మొదటిసారి బందరుకు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మెడికల్‌ కాలేజ్‌ ఇచ్చారని, ఇదంతా త‌న‌కే క‌ల‌గా ఉంద‌ని మాజీ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. నా పదవీకాలం ఉండగానే రూ.550 కోట్ల‌తో మెడిక‌ల్ కాలేజీ పూర్తవుతుందన్నారు. బంద‌ర్‌లో జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్యే పేర్ని నా ని ఏమన్నారంటే…వారి మాటల్లోనే

అందరికీ నమస్కారం, బందరుకు ఇంత వైభవం తీసుకొచ్చిన సీఎంగారికి వందనాలు, సీఎంగారు బందరు ఎప్పుడు వస్తారా అని నాలుగేళ్ళుగా ఎదురుచూశాం, పాదయాత్రలో చెప్పినట్లు మీ పోర్టు పనులు మొదలయ్యేటప్పుడే వస్తాను అన్నారు, ఈ రోజు వచ్చారు, మునులు యజ్ఞం చేసే సమయంలో భగ్నం చేయడానికి రాక్షసులు ఎలా అడ్డంకులు సృష్టించేవారో అలాగే చంద్రబాబు, ఆయన తాబేదార్లు బందరు పోర్టు అడుగుముందుకు పడకుండా కోర్టుల్లో దావాలు వేశారు, నక్కజిత్తుల చంద్రబాబుకు ఎక్కడ బలం ఉందో తెలుసు కదా, నాలుగేళ్ళు ఏం చేశారని కొందరు మాట్లాడుతున్నారు, కానీ మీరు పెట్టిన చిక్కుముడులు విడదీసి బందరు వాసుల కల అయిన పోర్టు నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి సీఎంగారు వచ్చారు. ఇప్పుడు బందరు పోర్టు గుర్తుకొచ్చిందా అని ఒక పేపర్‌లో రాశారు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన కడుపు మంట అంతా రాశారు, ఈ ప్రారంభోత్సవంతో టీడీపీ నాయకులు ఈనో ప్యాకెట్లు తాగుతూ కడుపుమంట చల్లార్చుకుంటున్నారు. జగన్‌గారు చంద్రబాబు ఇళ్ళ స్ధలాలు ఇచ్చారా అని అడిగారు, పదివేలపైనే ఉంటారన్నాను, నేను సీఎం అవగానే ఎంతమంది ఉంటే అంతమందికి స్ధలాలు ఇస్తానన్నారు, బందరు నియోజకవర్గంలో సుమారుగా 450 ఎకరాల భూమిని కొనుగోలు చేసి 25,090 పట్టాలు పేదలకు ఇవ్వడం జరిగింది.

మా ఊళ్ళో కాలనీలు కాదు ఒక ఊరే నిర్మాణం చేయబోతున్నారు, కరగ్రహారం అనే గ్రామంలో 326 ఎకరాల సింగిల్‌ లేఅవుట్‌లో 15,751 ఇళ్ళు వస్తున్నాయి, రైతులు చిరునవ్వుతో భూములు, పొలాలు ఇచ్చి సంతోషంగా ఉన్నారు. మనిషికి, భూమికి విడదీయరాని బంధం ఉంటుంది, 31 లక్షల మంది పేదలకు ఇళ్ళ స్ధలాలు ఎవరిచ్చారు, గిలకలదిండి అనే మత్స్యకార గ్రామంలో ఇంతవరకు నిరుపేదలకు పట్టా ఇవ్వలేదు, కానీ మీరు 1,050 మందికి పట్టాలు ఇచ్చారు, ఆ ఊరి చరిత్రలో మొదటిసారి, బందరుకు మెడికల్‌ కాలేజ్‌ ఇచ్చారు, మనం ఆయనకు గుండెల్లో స్ధానం ఇవ్వాలి, మనం ఊహించామా మెడికల్‌ కాలేజ్‌ వస్తుందని, ఇదంతా నాకే కలగా ఉంది, నా పదవీకాలం ఉండగానే పూర్తవుతుంది, రూ. 550 కోట్లతో సుమారుగా 64 ఎకరాలలో మెడికల్‌ కాలేజ్‌ పూర్తికావొస్తుంది. గోల్డ్‌ కవరింగ్‌ పరిశ్రమల వారు పాదయాత్రలో జగన్‌గారిని కలిసి కరెంట్‌ బిల్లుల గురించి మాట్లాడి తమ సమస్య చెప్పారు, సీఎం అవగానే కరెంట్‌ చార్జీలు తగ్గించి వారిని ఆదుకున్నారు, ఆయన చెప్పారంటే చేస్తారంతే.

అలాగే గోల్డ్‌ కవరింగ్‌ పరిశ్రమకు నీటిని ఇచ్చారు, బందరు వైభవాన్ని తీసుకురావడం కోసం మచిలీపట్నం కేంద్రంగా కృష్ణా జిల్లా అవడంతో ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాలన్నీ కళకళలాడుతున్నాయి, మచిలీపట్నానికి మరో ఎమ్మార్వో ఆఫీస్‌ను కూడా మంజూరు చేశారు, బందరు పోర్టు గురించి వైయ‌స్‌ఆర్‌ గారి దగ్గరకు వెళితే యాంకరేజ్‌ పోర్టు కాదు డీప్‌ వాటర్‌ పోర్టు ఉండాలన్నారు, ఆయన మరణంతో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది, చంద్రబాబు తనకు, తన అనుచరుల కోసం దుర్మార్గమైన ఆలోచన చేసి అమరావతి కోసం ప్రయత్నించారు. మా అందరి కలను నిజం చేస్తున్నందుకు మనస్పూర్తిగా మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మెడికల్‌ కాలేజ్‌ వద్ద ఉన్న రైల్వే లైన్‌ మీద ఆర్వోబీని మంజూరు చేయాలని కోరుతున్నా, అంబేద్కర్‌ విగ్రహాన్ని రూ. 5 కోట్లతో పునరుద్దరించాలని కోరుతున్నాను, తీరప్రాంతంలో ఉన్న గ్రామాల్లో పేదలకు తాము సాగుచేసుకుంటున్న భూములకు పట్టాలు లేవు, చంద్రబాబు ఆ భూములన్నీ ప్రభుత్వ భూములుగా రికార్డులు మార్చడం వల్ల వారు ఇబ్బంది పడుతున్నారు, మీరు ఆ భూములు అనుభవిస్తూ అర్హత గల పేదవారికి పట్టాలు ఇవ్వాలని కోరుతున్నాను, మేం మాకు మేలు చేసిన వారిని గుండెల్లో పెట్టుకుంటాం, నాడు తండ్రితో పనిచేశాను, నేడు కుమారుడితో పనిచేస్తున్నాను, ఈ అవకాశం ఇచ్చిన బందరు ప్రజలకు పాదాభివందనాలు.

మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఏమ‌న్నారంటే..
అందరికీ నమస్కారం, బందరు పోర్టు అంటే ఇక్కడి ప్రజల తీరని కోరిక, డచ్, పోర్చుగీస్‌ వారు జెట్టీ కట్టి పోర్టు పనులు చేసిన చరిత్ర బందరుది. కానీ ఈ రోజు నిజమైన పోర్టు తీసుకొచ్చిన ఘనత సీఎంగారిది, గత ప్రభుత్వంలో శిలాఫలకాలు వేశారు కానీ దానికి ఫైనాన్షియల్‌ క్లియరెన్స్‌లు లేవు, డబ్బులు లేవు, పర్యావరణ అనుమతులు లేవు కానీ నాలుగు రోజులు లేట్‌ అయినా అన్ని అనుమతులు తీసుకొచ్చి చిత్తశుద్దితో పోర్టు పనులు ప్రారంభించిన వ్యక్తి మన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌. మంచి పనులు చేస్తే చరిత్ర ఎప్పుడూ మరిచిపోదు, ప్రకాశం బ్యారేజ్‌…ఆ రోజు కాటన్‌ దొరగారి బిక్ష, ఇప్పటికీ కృష్ణా డెల్టా రైతాంగం మరిచిపోదు, ఆ తర్వాత కృష్ణా డెల్టా రైతాంగం కోసం పులిచింతల ప్రాజెక్ట్‌ అవసరమని దివంగత సీఎం వైఎస్సార్‌  పులిచింతల పూర్తి చేసి 45 టీఎంసీల నీటిని నిలబెట్టిన మొనగాడు, అదే విధంగా ఆయన తనయుడు మన రాష్ట్రంలో ఇన్ని పోర్టులు నిర్మించి దాదాపు లక్ష మందికి ఉపాధి కల్పిస్తున్నారు.

అభివృద్ది అంటే మాటలు కాదు చేసి చూపించడం, విశాఖ, ముంబాయి, చెన్నై అభివృద్ది చెందాయి అంటే పోర్టుల వల్లే, మచిలీపట్నం కూడా ఈ దేశ చిత్రపటంలో ఒక మంచి పోర్టుగా అభివృద్ది చెందబోతుంది. ఈ పోర్టుకు ఉన్న సాల్ట్‌ భూముల్లో పరిశ్రమలు పెడితే అభివృద్ది చెందడంతో పాటు బందరు ప్రజానీకానికి ఉద్యోగాలు వస్తాయి, పోర్టు పూర్తయ్యేసరికి మంచి రహదారులు కూడా రాబోతున్నాయి, దివిసీమ ప్రజానీకం చిరకాల కోరిక మచిలీపట్నం–రేపల్లె రైల్వే లైన్, దీనిపై గతంలో కూడా చర్చించాం, పీఎం గతిశక్తి స్కీం ద్వారా దీనిని కూడా పోర్టు ప్రాజెక్ట్‌లో కలిపితే దివిసీమ ప్రజల కోరిక నెరవేరుతుంది, పోర్టుకు ఉపయోగపడుతుంది. నేను తెనాలి ఎంపీగా ఉన్నప్పుడు పులిచింతల ప్రాజెక్ట్‌ ప్రారంభోత్సవంలో భాగస్వామి అయ్యాను, అదే విధంగా బందరు ఎంపీగా ఈ పోర్టు విషయంలో భాగస్వామిగా ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను. థాంక్యూ.

Leave a Reply