Suryaa.co.in

Editorial

టీడీపీ-జనసేన కలిస్తే వార్ వన్‌సైడేనా?

– ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేనకు 18 శాతం ఓటు బ్యాంకు
– కృష్ణాలో రెండు, విశాఖ జిల్లాలో ఒక నియోజకవర్గంలో జనసేన పూర్తి హవా
– టీడీపీకి 93 సీట్లు పక్కానా?
– వైసీపీకి ఖాయంగా 20 సీట్లేనా?
– 68 సీట్లలో పోటాపోటీ
– అందులో 90 శాతం వైసీపీ గెలిచినా వచ్చేది 75 సీట్లే
– ఆ 68 సీట్లలో టీడీపీ కి 50 శాతం వస్తే 125 సీట్లకు పైమాటే
– కడపలోనే వైసీపీ బలం
– కర్నూలు, అనంతపురం, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో టీడీపీ క్లీన్‌స్వీప్
– ఆ నాలుగు జిల్లాలో ఖాతా తెరవని వైసీపీ
– సీమలో జనసేన బలం 3 శాతం లోపే
– బలిజలు దరికి రాని వైనం
– మొత్తంగా టీడీపీకి 45, ఉభయగోదావరి జిల్లాల వరకూ జనసేనకు 18 శాతం ఓట్లు
– నెలరోజులు, నియోజకవర్గానికి 3 వేల శాంపిల్స్ సేకరణ
– నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు సర్వేలో తేలిన ఫలితమిది
( మార్తి సుబ్రహ్మణ్యం)

సాహసం-సంచలనాలకు మారుపేరైన నర్సాపురం వైసీపీ రెబెల్ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు తాజాగా మరో సంచలనానికి తెరలేపారు. ఆయన సొంతంగా చేయించిన సర్వేలో… ఏపీలో అధికారంలోకి వచ్చేది టీడీపీ మాత్రమేనని తేలింది. ఇక టీడీపీ-జనసేన కలిస్తే, ‘వార్ వన్‌సైడే’నని స్పష్టమయింది.mp-raju2మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మాదిరిగా, నర్సాపురం ఎంపీ రఘరామరామకృష్ణంరాజుకు ఎన్నికల సర్వేలు చేయించడం చాలాకాలం నుంచి అలవాటు. ఆ ప్రకారమే ఈసారి కూడా ఆయన సర్వే సంస్థతో ఓటరు నాడి పట్టే ప్రయత్నం చేశారు.

ఆ ప్రకారంగా.. ఉభయగోదావరి జిల్లాల వరకూ జనసేనకు 18 శాతం ఓటు బ్యాంకు ఉండటం, ఉత్తరాంధ్రలోనూ కొన్ని నియోజకవర్గాల్లో ఆ పార్టీ బలంగా ఉన్నందున, రెండూ కలిస్తే సునామీ ఖాయమన్నది ఆ సర్వే నివేదిక సారాంశం. ఇక వైసీపీకి ఒక్క కడప జిల్లాలో తప్ప ఎక్కడా బలం లేదని, ఆశ్చర్యకరంగా అనంతపురం-కర్నూలు జిల్లాల్లో టీడీపీ స్వీప్ చేస్తుందన్నది మరో విభ్రాంతికర సారాంశం.

జూన్-జులై నెలలో ఒక ప్రైవేటు న్యూస్ ఏజెన్సీ, యాప్ ద్వారా శాస్త్రీయ పద్ధతిలో చేయించిన సర్వేకు..నియోజకవర్గానికి 3 వేలు సగటున శాంపిల్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒక నియోజకవర్గానికి ఈ స్థాయిలో శాంపిల్ నిర్వహించడం బట్టి, సర్వే ఏ స్థాయిలో-ఎంత విస్తృతంగా జరిగిందో స్పష్టమవుతుంది. రాష్ట్రంలో కొన్ని సిటీలకు సంబంధించిన 4,5 నియోజకవర్గాల్లో మినహా, అన్ని నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించారు. ‘‘రానున్న ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేస్తారు’ అన్న ఏకైక ప్రశ్న ఆధారంగా జరిగిన ఈ సర్వే ఫలితాల వివరాలు ఇవీ.

వచ్చే ఎన్నికలు రెండు ప్రధాన పార్టీలయిన వైసీపీ-టీడీపీకి ప్రతిష్ఠగా మారాయి. ఇక జనసేన ఈ ఎన్నికల్లో తన ఉనికి చాటుకోనుంది. ఈ నేపథ్యంలో నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు చేయించిన సర్వేలో టీడీపీ విజయం సాధించబోతోందన్న ఫలితం వెలువడింది. జిల్లాలు, నియోజకవర్గాల వారీగా వైసీపీ-టీడీపీకి వచ్చిన శాతాలను కూడా ప్రకటించారు. అందులో ఆశ్చర్యకరమైన రీతిలో సీఎం-వైసీపీ అధినేత జగన్ సొంత కడప జిల్లాలో మాత్రమే వైసీపీ పూర్తి ఆధిక్యత కనబరచగా, మిగిలిన జిల్లాల్లో టీడీపీకే మొగ్గు కనబడటం ప్రస్తావనార్హం. ఇక జనసేనకు ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రమే 18 శాతం ఓట్లు లభించటం విశేషం.

తెలుగుదేశం పార్టీకి సొంతగా 93 స్థానాలు ఖాయంగా వస్తాయన్నది సర్వే నివేదిక సారాంశం. వీటిలో ఒక్కో నియోజకవర్గంలో.. వైసీపీ కంటే టీడీపీకి 9 శాతం, మరికొన్ని నియోజకవర్గాల్లో 5-9 శాతం ఎక్కువ ఉండటం గమనార్హం. అదేవిధంగా వైసీపీకి సుమారు 20 సీట్ల వరకూ వస్తాయని పేర్కొంది. మొత్తం 175babu-speds-dis స్థానాల్లో 68 నియోజకవర్గాల్లో, టీడీపీ-వైసీపీ మధ్య పోటాపోటీ నెలకొంది. ఈ 68 నియోజకవర్గాల్లో ఒకవేళ 90 శాతం ఓట్లు వైసీపీకి పోలయితే, ఆ పార్టీకి 73- 75 సీట్ల వరకూ వచ్చే అవకాశం ఉంది. అదే 68 నియోజకవర్గాల్లో టీడీపీకి 50 శాతం ఓట్లు పోలయితే, 125 సీట్ల వరకూ సాధించే అవకాశం ఉన్నట్లు సర్వే నివేదిక స్పష్టం చేసింది.

ఇక జనసేన ఉభయ గోదావరి జిల్లాల వరకూ 18 శాతం వరకూ ఓట్లు సాధించే అవకాశం కనిపించింది. అదేవిధంగా కృష్ణాజిల్లాలోని అవనిగడ్డ, మచిలీపట్నం, విశాఖలోని పాయకరావు పేట నియోజకవర్గాల్లో జనసేన పూర్తి ఆధిపత్యంలో ఉన్నట్లు తేలింది. అయితే మిగిలిన జిల్లాల్లో జనసేన హవా పెద్దగా కనిపించలేదు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఆ పార్టీకి 7,8 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది.

బలిజలు ఎక్కువగా ఉన్న రాయలసీమలో జనసేనకు అంతగా సానుకూల పరిస్థితులు కనిపించ కపోవడం ఆశ్చర్యం. అక్కడ బలిజలు పవన్‌ను తమవాడిగా భావించడం లేదన్న వాదన, ఆ సామాజికవర్గం వారు టీడీపీ వైపే ఉన్నారన్నది నిజమేనని తేలింది. అయితే, ఉభయగోదావరి- విశాఖ, కృష్ణా జిల్లాల్లోని నాలుగయిదు నియోజకవర్గాల్లో కాపులు మాత్రం జనసేన వైపే మొగ్గు చూపటం విశేషం.

కానీ, టీడీపీ-వైసీపీకి వచ్చిన శాతం పరిశీలిస్తే.. టీడీపీ-జనసేన కలిస్తే వార్ వన్‌సైడే అని మాత్రంPawan-Kalyan-meets-Naidu-twitter స్పష్టమవుతుంది. తూర్పు గోదావరిలో ఉన్న 19, పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలు కీలకం. ఈ క్రమంలో జనసేన- టీడీపీ పోటీ ప్రభావం, ఉభయ గోదావరి జిల్లాలపై కచ్చితంగా పడుతుందని స్పష్టమవుతుంది.

ఈ సర్వే ఫలితాలు కేవలం అసెంబ్లీ నియోజకవర్గాలపైనే కాకుండా, పార్లమెంటు నియోజకవర్గాలపైనా చూపించడం సహజం. ఆ ప్రకారంగా వచ్చే ఎన్నికల్లో.. ఎంపీ స్థానాలు కూడా టీడీపీ ఎక్కువగా సాధించడం ఖాయమన్న అంచనాలో తప్పులేదు.

సహజంగా సర్వే సంస్థలు విజయానికి కొన్ని ప్రాతిపదికలు నిర్ణయిస్తాయి. సర్వేల్లో పార్టీల మధ్య 4 శాతం తేడా ఉంటే దానిని పోటా పోటీగా భావిస్తాయి. అదే 4-6 శాతం ఓట్ల తేడా ఉంటే దానిని ఎడ్జిగా భావిస్తుంటాయి. 9 శాతం వస్తే దాన్ని గన్‌షాట్‌గా భావిస్తాయి. తాజా సర్వేలో టీడీపీకి 93 స్థానాలు గన్‌షాట్ అని తేలగా, వైసీపీకి 15 గన్‌షాట్ అని తేలింది. ఇక ఎడ్జి ఉన్న నియోజకవర్గాలు కూడా టీడీపీ ఖాతాలోనే పడటం ప్రస్తావనార్హం.

సర్వేలో కీలక అంశాలు
సర్వే నివేదిక పరిశీలిస్తే.. కర్నూలు, అనంతపురం, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో వైసీపీ అసలు ఖాతా తెరిచే అవకాశం కనిపించడం లేదు.
శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల నియోజకవర్గంలో టీడీపీ-వైసీపీకి చెరో 40 శాతం రావడం విశేషం.
తూర్పు గోదావరి జిల్లాలో అమలాపురం, అనపర్తి, పి.గన్నవరం, పిఠాపురం, రాజానగరం, రామచంద్రాపురం, రాజోలు నియోజకవర్గాల్లో వైసీపీ వైపే మొగ్గు కనిపించింది. ఇక కాకినాడ రూరల్‌లో మాత్రం టీడీపీ-వైసీపీకి చెరో 33 శాతం రావడం విశేషం.
పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచంట, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో వైసీపీకి మొగ్గు కనిపించింది. అయితే దెందులూరు, కోవూరు, నిడదవోలు, ఉంగుటూరు నియోజకవర్గాల్లో మాత్రం ఇరుపార్టీలకూ సమాన శాతం రావడం ప్రస్తావనార్హం.
కృష్ణా జిల్లాలో గన్నవరం, నూజివీడులో వైసీపీకి మొగ్గు కనిపించగా, పామర్రులో మాత్రం ఇరు పార్టీలకూ 44 శాతం రావడం విశేషం.
గుంటూరు జిల్లాలో బాపట్ల, గురజాల, నరసరావుపేట నియోజకవర్గాల్లో వైసీపీ అధిపత్యం కనిపించింది. అయితే సత్తెనపల్లిలో మాత్రం ఇరుపార్టీలకూ చెరో 44 శాతం రావడం ప్రస్తావనార్హం.
ఇక ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు నియోజకవర్గంలో మాత్రమే వైసీపీ అధిపత్యం కనిపించింది. దర్శి, కొండపి, మార్కాపురం నియోజకవర్గాల్లో ఇరు పార్టీలకూ సమాన శాతం రావడం విశేషం.
కడప జిల్లాలో బద్వేలు, కడప, కమలాపురం, కోడూరు, పులివెందుల, రాయచోటి నియోజకవర్గాల్లో వైసీపీ అధిక్యం స్పష్టంగా కనిపించగా, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, రాజంపేట నియోజకవర్గాల్లో టీడీపీకి ఆధిక్యం కనిపించింది. మైదుకూరులో మాత్రం ఇరుపార్టీలకు చెరో 44 శాతం రావడం ప్రస్తావనార్హం.
చిత్తూరు జిల్లాలోని పుంగనూరు, పూతలపట్టు నియోజకవర్గాల్లో మాత్రమే వైసీపీ ఆధిక్యం స్పష్టంగా కనిపించింది.
1
2
3
4
5
6

LEAVE A RESPONSE