Suryaa.co.in

Telangana

రెండేళ్లలో ఎస్సెల్బీసీ పనులు పూర్తి చేసి నీళ్లు అందిస్తాం

-దేవరకొండను సస్యశ్యామలం చేస్తా
-బైక్ ర్యాలీలో నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి

▫️రెండేళ్లలో ఎస్సెల్బీసీ సొరంగం పనులను పూర్తి చేసి నీళ్లు అందిస్తామన్నారు నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి. దేవరకొండ నియోజకవర్గంలోని అంగడిపేట, కొండమల్లేపల్లి మండలాల్లో సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బాలునాయక్, సాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డిలతో కలిసి ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు.

డిండి, అక్కంపల్లి, పెద్దగట్టు ఎత్తిపోతల పథకం పనులను కూడా పూర్తి చేసి దేవరకొండను సస్యశ్యామలం చేస్తామన్నారు. బాలు నాయక్ తో కలిసి దేవరకొండను మిగతా నియోజవర్గాలకు ధీటుగా అభివృద్ధి చేస్తామని రఘువీర్ రెడ్డి హామీ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ లకు తగిన గుణంపాఠం చెప్పాలని సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. తన హయాంలోనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

▫️అసెంబ్లీ ఎన్నికల్లో తనకిచ్చిన మెజార్టీ కంటే అధిక మెజార్టీ ఇచ్చి రఘువీర్ రెడ్డిని గెలిపించాలని ఎమ్మెల్యే బాలునాయక్ దేవరకొండ ప్రజానీకాన్ని కోరారు. ఎమ్మెల్యే నిధులకు, ఎంపీ నిధులు తోడైతే దేవరకొండను మరింత అభివృద్ధి చేసుకునే అవకాశముందన్నారు. తాత గడ్డంపల్లి నారాయణరెడ్డి, నాన్న జానారెడ్డి మాదిరిగానే తన అన్న రఘువీర్ రెడ్డికి ప్రజాసేవ చేసే అవకాశాన్ని కల్పించాలని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి అభ్యర్థించారు.

దేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచి రఘువీర్ రెడ్డి చరిత్ర సృష్టిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన బైక్ ర్యాలీలో కాంగ్రెస్ మండలాధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, పెద్దసంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశారు

LEAVE A RESPONSE