Suryaa.co.in

Telangana

మేథావులు పదవులకు అమ్ముడుపోయారు

– కాంగ్రెస్ పార్టీ అంటే చీటింగ్, కరప్షన్, కలెక్షన్
– నడి బజారులో నిలదీయాలి
– నిరుద్యోగులకు బీఆర్ఎస్ పార్టీ అండ
– మ్యానిఫెస్టోలో ఏ ఒక్క హామీనైనా నిలబెట్టుకున్నారా?
– గ్రూప్ 1 లో అవకతవకలు, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన డా.ఎర్రోళ్ల శ్రీనివాస్

హైదరాబాద్: ప్రభుత్వం వల్ల అన్యాయాన్ని గురైన నిరుద్యోగులకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలబడుతుందని టీఎస్ఎంఎస్ఐడీసీ మాజీ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

అధికారంలోకి వస్తే రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో భర్తీ చేస్తామని హామీ ఇచ్చారని, కనీసం మ్యానిఫెస్టోలో పొందుపర్చిన ఏ ఒక్క హామీనైనా నిలబెట్టుకున్నారా అని ప్రశ్నించారు. 1:100 ప్రాతిపదికన ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు.

కాంగ్రెస్ పార్టీ నాయకులను నిరుద్యోగులు నమ్మరని భావించి ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీని రప్పించి మోసపూరిత హామీలు ఇచ్చారన్నారు. 40 లక్షల నిరుద్యోగులను అడ్డంపెట్టుకొని కాంగ్రెస్ పెద్దలు కేబినేట్లో ఉద్యోగాలు సంపాదించుకున్నారని ఆరోపించారు.

16 నెలల కాలంలో నిరుద్యోగులను పిలిచి మాట్లాడిన దిక్కులేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు న్యాయం జరుగుతుందన్న ఉద్దేశ్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో నం. 55 తీసుకువచ్చిందని, కాని ఆ వర్గాలన్నింటికి ఆన్యాయం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 29ను తీసుకువచ్చిందన్నారు.

ఇది భారత రాజ్యాంగ స్ఫూర్తిని వ్యతిరేకంగా రిజర్వేషన్ల అమలును ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు గతేడాదే అసెంబ్లీలో స్పష్టం చేశారని గుర్తు చేశారు.

నాడు బీఆర్ఎస్ పై బురద జల్లిన మేథావులు నేడు నిరుద్యోగులు, విద్యార్థులను లాఠీలతో కొడుతూ అరెస్టులు చేయిస్తుంటే ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ప్రస్తుతం తెలంగాణలో విధ్వంసం జరుగుతుందని, ఓ వైపు హైడ్రా, మరో వైపు మూసీ, లగచర్ల, ఇంకో వైపు HCU భూముల పేరిట దౌర్జన్యకాండ కొనసాగుతుండగా, ప్రశ్నించాల్సిన మేథావులు పదవులకు అమ్ముడుపోయారన్నారు.

దీనిపై కాంగ్రెస్ లోని ఆయా వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అంటే చీటింగ్, కరప్షన్, కలెక్షన్ అని. ఆ పార్టీ నేతలను నడిబజారులో నిలదీయాలని నిరుద్యోగులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో తెలంగాణ విఠల్, తెలంగాణ క్రాంతి దళ్ ఆధ్యక్షులు పృథ్విరాజ్, నర్సింహా, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE