– మద్యాన్ని అడ్డు పెట్టుకుని చంద్రబాబు అడ్డగోలు ఆర్జన
– గత పాలనలో మద్యం కుంభకోణంలో చంద్రబాబుపై సీఐడీ కేసు
– మూడు డిస్టిలరీలకు లబ్ధి చేకూర్చడానికి ఆనాడు చంద్రబాబు క్విడ్ప్రోకో
– ఆ కేసుపై చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదు?
– మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, మాజీ ఎంపీ మార్గాని భరత్
రాజమహేంద్రవరం: మద్యం మాఫియాను పెంచి పోషిస్తున్న కూటమి ప్రభుత్వం తమ అవినీతి నుంచి ప్రజల దృష్టి మళ్ళించేందుకే గత ప్రభుత్వంలో పారదర్శకంగా అమలు చేసిన లిక్కర్ పాలసీపై, స్కామ్ అంటూ కేసులు పెడుతూ కొత్త నాటకాన్ని తెర మీదికి తీసుకువచ్చిందని వైయస్సార్సీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆక్షేపించారు.
రాజమహేంద్రవరంలో వేర్వేరుగా వారు మీడియాతో మాట్లాడుతూ.. అత్యంత పారదర్శకంగా వైయస్ఆర్సీపీ ప్రభుత్వం మద్యం విధానాన్ని అమలు చేస్తే, లేని స్కామ్ను సృష్టించి తప్పుడు కేసులతో కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ను అమలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వంలో మద్యాన్ని అడ్డు పెట్టుకుని చంద్రబాబు అడ్డగోలుగా చేసిన అవినీతిపై సీఐడీ నమోదు చేసిన కేసులో చంద్రబాబు ఏ–3 నిందితుడిగా ఉన్న విషయం వాస్తవం కాదా? అని వారు నిలదీశారు.
మద్యం దుకాణాలు మొత్తం కూటమి నాయకులకు, వారికి సంబంధించిన మనుషులకే వచ్చేలా జాగ్రత్త పడ్డారు. ప్రైవేటు దుకాణాల నుంచి 30శాతం కమీషన్లు తీసుకున్నారు. ఇవ్వని వారిపై ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు దాడులు చేయడం రాష్ట్రం అంతా చూసింది. తర్వాత ఈ దుకాణాలన్నింటినీ టీడీపీ నాయకుల ఆధీనంలో ఉన్న మాఫియా చేతిలో తీసుకొచ్చారు. ఏ బ్రాండు అమ్మాలి? ఎంతకు అమ్మాలి? అనే నిర్ణయాలన్నీ లిక్కర్ మాఫియా చేతిలోనే ఉన్నాయి.
ప్రతి క్వార్టర్ బాటిల్ను దాదాపు రూ.20 ఎక్కువకు అమ్ముతున్నారు. ముందస్తు వ్యూహంతో తమకు నచ్చిన ప్రైవేటు కంపెనీతో చంద్రబాబు ఒక సర్వే చేయించి, ఆ సర్వే ఆధారంగా వారికి కావాల్సిన బ్రాండ్లు మాత్రమే అమ్మేలా చేస్తున్నారు. ఈ బ్రాండ్లకు సంబంధించిన ఆర్డర్లను తమకు నచ్చిన డిస్టలరీలకు ఇస్తున్నారు.
క్వాలిటీ దారుణంగా తగ్గించిన మద్యాన్ని రూ.99కి అమ్ముతూ మద్యం ప్రియుల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. వీలైనంత మేర అవినీతి సొమ్మును దండుకోవడానికి అనధికారికంగా 20 నుంచి 30శాతం మేర లిక్కర్ అమ్మాలని టార్గెట్లు పెట్టారు. పర్మిట్ రూమ్స్ ఏర్పాటు చేసి వాటి నుంచి డబ్బులు వసూలు చేసుకుని భారీ ఆర్జిస్తున్నారు.
2014–19 ప్రభుత్వంలో చంద్రబాబు మద్యం కుంభకోణంలో విపరీతమైన అవినీతికి పాల్పడ్డాడు. దీనిపై సీఐడీ కూడా కేసు నమోదు చేసింది. మద్యం కుంభకోణానికి సంబంధించి నమోదైన ఈ ఎఫ్ఐఆర్లో చంద్రబాబు ఏ–3 నిందితుడు. ఈ మేరకు ఏసీబీ కోర్టులో పిటిషన్ను కూడా వేసింది. న్యాయస్థానం కూడా విచారణకు అనుమతించింది. ఇందులో ఏ–1గా అప్పటి ఎక్సైజ్ కమిషనర్, ఏ–2గా నాటి ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్రపై కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. మరి ఈ కేసు ఏమైంది? దీని గురించి ఎందుకు మాట్లాడ్డం లేదు?.
నంద్యాల మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డికి చెందిన ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్కి, అయ్యన్నపాత్రుడుకి చెందిన విశాఖ డిస్టిలరీకి, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడు పుట్టా సుధాకర్యాదవ్కు చెందిన పీఎంకే డిస్టిలరీకి అప్పట్లో అడ్డగోలుగా మేలు చేకూర్చడానికి అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అడ్డదారులు తొక్కింది. ఇందుకోసం ఏకంగా 2012 ఎక్సైజ్ పాలసీని మార్చేసిన మాట వాస్తవం కాదా?
2012 నుంచి 2015 వరకు ప్రభుత్వానికి రూ.2,984 కోట్లు పన్నులు రాగా, 2015లో కొత్త పాలసీ తీసుకువచ్చి ప్రభుత్వానికి ఈ పన్నులు రాకుండా చేసిన మాట నిజం కాదా? తద్వారా చంద్రబాబు ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం వచ్చిన మాట వాస్తవం కాదా? రెండు బేవరేజ్లు, మూడు డిస్టిలరీలకు లబ్ధిచేకూర్చడానికి చంద్రబాబు ప్రభుత్వం క్విడ్ప్రోకోకి పాల్పడినట్లు సీఐడీ నమోదుచేసిన ఎఫ్ఆర్పై ఎందుకు విచారణ ముందుకు కదలడం లేదు?
టీడీపీ ప్రభుత్వంలో జరిగిన ఈ కుంభకోణం ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రూ.1,300 కోట్ల నష్టం వాటిల్లింది. అంటే ఐదేళ్ల కాలంలో రూ.5500 కోట్లు కుంభకోణం జరిగింది. 2019 ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కొన్ని కంపెనీలకు ప్రాధాన్యత ఇస్తూ, వారి ఉత్పత్తులకు, వారి మార్కెట్ వాటాకు అనుకూలంగా హడావిడిగా ఆర్డర్లు ఇచ్చేశారు. ఇది చంద్రబాబు చేసిన నేరం కాదా?
చంద్రబాబు హయాంలో అవసరానికి మించి లిక్కర్ కంపెనీలకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులిచ్చి కొందరి నుంచే 70 శాతం బ్రాండ్లు కొనుగోలు చేశారు. పక్కా ప్లాన్తో, కొందరు అధికారుల సహకారంలో కొన్ని సంస్థలకు చట్టవిరుద్ధంగా ఆర్థిక ప్రయోజన చేకూర్చినట్లు బయటపడింది. మరి ఈ కేసు ఎందుకు బయటకు రావడం లేదు?. రాష్ట్రంలో 2012 నుంచి అమలులో ఉన్న మద్యం కొనుగోళ్లపై ప్రివిలేజ్ ఫీజును తొలగించి అస్మదీయ కంపెనీలకు ప్రయోజనం కలిగించేందుకు అడ్డగోలుగా కథ నడిపిన చంద్రబాబు తీరుపై వైయస్సార్సీపీ హయాంలో సీఐడీ వద్ద కీలక ఆధారాలున్నాయి.
ప్రివిలేజ్ ఫీజును కొనసాగించడంతో పాటు 10 రెట్లు పెంచాలని అప్పటి ఎక్సైజ్ శాఖ కమిషనర్ నోట్ ఫైల్ పంపారు. దానిపై కేబినెట్లో చర్చించ లేదు. కానీ కేబినెట్ సమావేశం ముగిసిన రోజే సాయంత్రం మళ్లీ అదే ఎక్సైజ్ కమిషనర్ ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయాలనే ప్రతిపాదనతో నోట్ ఫైల్ పంపారు. ‘కాపీ టు పీఎస్ టు సీఎం’ అని స్పష్టంగా పేర్కొంటూ ఆ నోట్ ఫైల్ పంపారు. ఆ వెంటనే డిస్టిలరీలకు ప్రివిలేజ్ ఫీజు రద్దు చేస్తూ టీడీపీ ప్రభుత్వం 2015 జూన్ 22న సాయంత్రం గుట్టుగా జీవో:218 జారీ చేసింది.
అంటే కేబినెట్కు తెలియకుండానే వ్యవహారం నడిపింది. ఇది ఎంత దారుణమైన నేరం? ఈమేరకు బార్లకు ప్రివిలేజ్ ఫీజు రద్దు చేస్తూ 2015 సెప్టెంబరు 1న అప్పటి చంద్రబాబు ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. అయితే, ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయాలని కోరుతూ బార్ల యజమానుల సంఘం 2015 సెప్టెంబరు 9న వినతిపత్రం సమర్పించినట్టు చూపించారు. అంటే బార్ల యజమానుల నుంచి వినతి పత్రం రాకముందే ఆ ఫీజును రద్దు చేయాలని ప్రతిపాదిస్తూ సర్క్యులర్ జారీ చేశారు.
దాన్ని రాటిఫై చేసేందుకు అన్నట్టుగా లేని వినతి పత్రాన్ని ఒకదాన్ని సృష్టించారు. అక్రమాన్ని కప్పి పుచ్చుకునేందుకు బార్ల యజమానుల పేరిట ఇలా లేఖను సృష్టించినట్టు సీఐడీ గుర్తించింది. అనంతరం బార్లపై ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తూ 2015 డిసెంబర్ 11న జీవో 468 జారీ అయింది. అందుకు సంబంధించిన నోట్ ఫైళ్లపై ఎక్సైజ్ శాఖ మంత్రి హోదాలో కొల్లు రవీంద్ర 2015 డిసెంబర్ 3న సంతకం చేయగా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు 2015 డిసెంబర్ 4న డిజిటల్ సంతకాలు చేయడం వారి పన్నాగానికి నిదర్శనం. ఇంతటి దారుణమైన స్కాం మన కళ్ల ముందే జరిగినా, దీనిపై సీడీఐ ఆధారాలు సేకరించినా, ఎఫ్ఐఆర్ నమోదు అయినా మరి ఈ కేసు ఎందుకు ముందుకు నడవడం లేదు?
రాజ్ కసిరెడ్డి చెప్పకుండానే.. తాను అబద్ధపు వాంగ్మూలం నమోదు చేసినట్లు సిట్ అంగీకరించింది. ఇక మద్యం డిస్టిలరీలకు ఆర్డర్లలో వివక్షకు పాల్పడి అవినీతి చేశారని సిట్ పేర్కొంది. కానీ అదే నివేదికలో నాడు చంద్రబాబు ప్రభుత్వంలో కేవలం నాలుగు కంపెనీల నుంచే ఏకంగా 53.21 శాతం మద్యం కొనుగోళ్లు చేశారని వెల్లడించింది.
నెలకు రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్లు చొప్పున రాజ్ కేసిరెడ్డి వసూలు చేసి వైఎస్సార్ సీపీలోని ముఖ్యులకు ఇచ్చారని ఒకచోట.. రాజ్ కేసిరెడ్డే ఆ నిధులను దేశంలో వివిధ చోట్ల పెట్టుబడి పెట్టారని మరోచోట పరస్పర విరుద్ధంగా పేర్కొనడం ద్వారా తన దర్యాప్తులో డొల్లతనాన్ని బయటపెట్టింది. తాము బెదిరించి వేధించిన వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్ తదితరులతో ఇప్పించిన అబద్ధపు వాంగ్మూలాల ఆధారంగానే దర్యాప్తు పేరిట కనికట్టు చేసినట్టు అంగీకరించింది.