Suryaa.co.in

Telangana

అర్బన్ నక్సల్స్ భావజాలం ఉన్నవారికి కీలక బాధ్యతలా?

– గద్దర్ పేరుమీద అవార్డులు ఇవ్వడం కూడా అందులో భాగమే
– యాకుబ్ మెమన్, అజ్మల్ కసబ్ లాంటి వాళ్ల పేరుమీద కూడా అవార్డులు ఇస్తారేమో?
– వారిని సంతృప్తిపర్చడం కోసమే ప్రభుత్వ నిర్ణయాలు.. నియామకాలు
– పాలనపై రేవంత్‌కు పట్టేదీ?
– ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలే వారికి పరిపాలన అనిపిస్తోందా?
– ప్రభుత్వ తీరుతో అధికారులు కూడా అయోమయం
– భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డా. సోలంకి శ్రీనివాస్

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన మీద పట్టు సాధించలేకపోయారు. అధికారం దక్కినప్పటి నుంచి రేవంత్ రెడ్డి పాలనలో స్థిరత చూపలేకపోతున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలే వారికి పరిపాలన అనిపిస్తోందా అన్న సందేహం ప్రజల్లో ఉంది.

అధికారుల్ని తరచూ బదిలీ చేయడం పరిపాలన దృక్పథం లేకపోవడమే కాదు, పాలనలో అనిశ్చితిని పెంచే చర్య. ఇది అవినీతికి తలుపు తీసే చర్యగా ప్రజల్లో భావన ఏర్పడుతోంది. ప్రతి మూడు నెలలకోసారి లేదా ఆరు నెలలకోసారి అధికారులను మారుస్తూ పరిపాలనను అస్థిరత వైపు నెట్టుతున్నారు. ఇది అవినీతికి తలుపులు తెరిచే ప్రయత్నమా?

మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కూడా యూపీఏ హయాంలోని అధికారులనే కొనసాగిస్తూ పాలనను సమర్థవంతంగా నడిపించారు. సమయపాలన, విధినిర్వహణలో పారదర్శకతకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు.

అడ్మినిస్ట్రేషన్‌ను సరైన దారిలో పెట్టే సామర్థ్యం లేకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి ప్రత్యక్ష నిదర్శనం. ప్రభుత్వ తీరుతో అధికారులు కూడా అయోమయంలో పడుతున్నారు. మరి ఇప్పుడు చేసిన ఐపీఎస్, ఐఏఎస్ ఆఫీసర్ల బదిలీలు కూడా మూన్నాళ్ల ముచ్చటేనా..?

తాజా అధికార నియామకాల్లో విద్యా రంగం సహా అనేక బాధ్యతల్ని అర్బన్ నక్సలైట్ భావజాలం కలిగిన వ్యక్తులకే ఇచ్చినట్లుగా స్పష్టమవుతోంది. ప్రభుత్వ నియామకాల్లో వైస్ చాన్సలర్లు (వీసీలు), విద్యా కమిషన్ వంటి కీలక పదవులతో పాటు, కోదండరాం లాంటి వారు అదేకోవలో నియామకమైనవారే. అర్బన్ నక్సలైట్ భావజాలం కలిగిన వారిని సంతృప్తిపర్చడం కోసమే ప్రభుత్వ నిర్ణయాలు.. నియామకాలు జరుగుతున్నాయి.

తెలంగాణ సినీ కళాకారులకు గద్దర్ పేరుమీద అవార్డులు ఇవ్వడం కూడా అందులో భాగమే. తెలుగు సినీ ప్రముఖులు కూడా ఈ అవార్డుల విషయంలో పునరాలోచన చేయాలి. ఎందుకంటే.. రేపటి తరానికి ఈ అవార్డు విశిష్టత ఏంటని ఎవరైనా ప్రశ్నిస్తే సమాధానం ఏంటి? రాహుల్ గాంధీ చెప్తే రేపటి రోజున యాకుబ్ మెమన్, అజ్మల్ కసబ్ లాంటి వాళ్ల పేరుమీద కూడా అవార్డులు ఇస్తారేమో?

కాంగ్రెస్ మంత్రివర్గంలోని ఒక మంత్రి కూడా ఆ భావజాలాన్ని సమర్థిస్తూ ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలని మాట్లాడుతున్నారు. నక్సలైట్లను భారత చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం (1967) ప్రకారం ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించిందే కాంగ్రెస్ ప్రభుత్వం (2010లో). కాంగ్రెస్ హయాంలోనే భారత చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం (UAPA) ప్రకారం నక్సలైట్లు ఉగ్రవాద సంస్థలుగా గుర్తించబడ్డారు (2010లో). 1981లో ఇంద్రవెల్లిలో గిరిజనులపై కాల్పులు జరిపిన పార్టీ కూడా కాంగ్రెస్. ఇప్పుడు అదే పార్టీ గిరిజన సంక్షేమంపై మాట్లాడటం ద్వంద్వ వైఖరికి నిదర్శనం. ‘ఆపరేషన్ గ్రీన్ హంట్’ కూడా 2009లో UPA హయాంలోనే ప్రారంభమైంది. ఇప్పుడు కాంగ్రెస్ నేతలు వీటిని విమర్శించడమంటే, తమ స్వంత పాలనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్లే అవుతుంది.

ఒకవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెబుతూ, మరోవైపు మీ మంత్రులు హెలికాప్టర్లలో తిరిగే దుర్బర పాలన — ఇది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే. నిజంగా బడ్జెట్ కష్టాల్లో ఉన్న ప్రభుత్వం అయితే, ఈ విధమైన దుబారా, అనవసర అవార్డుల కార్యక్రమాలు, హంగామాలు మానేయాలి.
గద్దర్ అవార్డులు పేరుతో రాజకీయ లక్ష్యాలను నెరవేర్చే ప్రయత్నం చేయడం, ప్రముఖులను వేదికగా వినియోగించడం దురుద్దేశపూరితమైనది. అలాంటి కార్యక్రమాల్లో పాల్గొనబోయే సినీ ప్రముఖులు ఒకసారి పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది.

రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్నా” అని చెప్పిన రేవంత్ రెడ్డి.. తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని తక్కువ చేయడమే. తెలంగాణ ప్రజలు తనకు అవకాశం ఇచ్చారు. రాహుల్ గాంధీకి ఊడిగం చేయడానికి కాదు. ప్రజలకు సేవ చేయడం మీ మొదటి బాధ్యత.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదంటే.. ఎలా మెరుగుపర్చుకోవాలో పనిచేయాలి. ఇప్పటివరకు రేవంత్ రెడ్డి.. రాహుల్ గాంధీ కోసం ఊడిగం చేసే దాంట్లో కనీసం 10 శాతం దీనిపై ఆలోచన చేస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడేది. కేవలం కొంతమందిని సంతృప్తిపర్చడానికో, కాలయాపనకో కాకుండా 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచించాలి.

LEAVE A RESPONSE