– మొదటి తారీఖునే జీతాలు ఇస్తున్నందుకా?
– ఆర్టీసీ కార్మికులకు సీఎం రేవంత్ సూటి ప్రశ్నలు
హైదరాబాద్ : మీ సమరం తెలంగాణ ప్రజలపైనా? ఎందుకు మీ సమరం? గతంలో లేని విధంగా మొదటి తారీఖునే జీతాలు ఇస్తున్నందుకా? అంటూ ఆర్టీసీ కార్మికులను సీఎం రేవంత్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు.
సోమవారం హైదరాబాద్లో జీ అవార్డులు 2025 ఫంక్షన్లో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..ప్రతి నెలా రూ. 7 వేల కోట్లు ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలుగా ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు.
గత పాలకులు రూ. 8,500 కోట్లు రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలు పెట్టి వెళ్లారని, అయితే కొన్ని రాజకీయ పార్టీలు తమపై ఆరోపణలు చేస్తున్నాయన్నారు. అవన్నీ గత ప్రభుత్వంలోని వాళ్లు చెల్లించకుండా పెండింగ్ పెట్టి వెళ్లిన బకాయి లేనని గుర్తు చేశారు.
కేవలం పదహారు నెలల్లో తమ ప్రభుత్వం రైతుల ఖాతాలకు రూ. 30 వేల కోట్ల నగదును బదిలీ చేసిందన్నారు. ఉచిత విద్యుత్ అని చెప్పి విద్యుత్ శాఖకు బకాయిలు పెట్టి వెళ్లారంటూ, గత ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ ఉత్పత్తికి బొగ్గు కొనుగోలు చేసి సింగరేణికి సైతం బకాయిలు పెట్టి వెళ్లిన ఘనత గత ప్రభుత్వానిదని విమర్శించారు.
ప్రాజెక్టులు నిర్మించామని చెప్పి..కాంట్రాక్టర్లకు సైతం బకాయిలు పెట్టారని ఈ సందర్బంగా గుర్తు చేశారు. 11 శాతం వడ్డీకి అప్పులు తెచ్చారని, ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? అంటూ బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు.
ప్రభుత్వం అంటే మేం ఒక్కరమే కాదని, మనమంతా కలిస్తేనే ప్రభుత్వమన్నారు. మనం పాలకులం కాదని, సేవకులమనిస్పష్టం చేశారు.
ఆర్టీసీ కార్మికులు చేపట్టనున్న సమ్మె నిర్ణయంపై వెనక్కి తగ్గేది లేదంటూ ప్రభుత్వానికి వారు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టనున్న సమ్మెపై సీఎం రేవంత్ రెడ్డి ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.