Suryaa.co.in

Telangana

సింగరేణిని కాపాడి అభివృద్ధి చేసే బాధ్యత మాదే

-ఈ ఏడాది సింగరేణిలో 1900 ఉద్యోగాల భర్తీ
-నూతన గనుల ఏర్పాటు కోసం ప్రత్యేక కృషి
-సింగరేణిలో బీసీ లైజన్ ఆఫీసర్ నియామకం
-సింగరేణి ద్వారా మరో 1600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు
-సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో 800 మెగావాట్ల ప్లాంటు కు త్వరలో శంకుస్థాపన
-రామగుండం బీ పవర్ ప్రాజెక్టు స్థానంలో మరో 800 మెగావాట్ల ప్లాంట్…
-సింగరేణి ఆధ్వర్యంలో నిర్మాణంపై పరిశీలన
-సింగరేణి ప్రాంత నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనే మా ధ్యేయం
-సింగరేణి సంపద పెంచడం.. కార్మికులకు పంచడమే మా లక్ష్యం
– హైదరాబాద్ లో సింగరేణి అతిథి గృహ శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు ప్రకటన
– గత మూడు నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో
సింగరేణిలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు : సీఎండీ ఎన్.బలరామ్

సింగరేణి ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ ఏడాదిలో సింగరేణి ఆధ్వర్యంలో దాదాపు 1900 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన, ఆర్థిక, ప్రణాళికా శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు ప్రకటించారు. ఇందులో భాగంగా గత వారంలో 489 ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ అయ్యాయని.. మరో 1352 ఉద్యోగాల భర్తీకి అతి త్వరలో నోటిఫికేషన్లు విడుదల కానున్నట్లు ఆయన ప్రకటించారు.

మంగళవారం హైదరాబాద్ బంజారా హిల్స్లో నిర్మించనున్న సింగరేణి అతిథి గృహ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

134 ఏళ్ల చరిత్ర ఉన్న సింగరేణికి హైదరాబాద్ లో గెస్ట్ హౌస్ లేకపోవడం బాధాకరమని.. కార్మికులు, అధికారుల ప్రయోజనార్థం రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి గజాల స్థలాన్ని కేటాయించిందని తెలిపారు. సింగరేణి ప్రాంతానికి చెందిన తనకు ఈ అతిథి గృహాన్ని ప్రారంభించే అవకాశం లభించడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నానన్నారు.

సింగరేణి విస్తరణ చర్యల్లో భాగంగా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో జైపూర్ లో నిర్వ హిస్తున్న ప్రస్తుత 1200 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాంగణంలో త్వరలో 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ ప్లాంట్ ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.
అలాగే రామగుండంలో ఉన్న జెన్ కో ఆధ్వర్యంలో దశాబ్దాల క్రితం నిర్మించిన ప్లాంట్ ఆవరణలో 800 మెగావాట్ల ప్లాంట్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. సింగరేణి ఆధ్వర్యంలో ఈ ప్లాంట్ నిర్మాణం చేపట్టాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. దీంతో సింగరేణి థర్మల్ సామర్థ్యం 2800 మెగావాట్లకు చేరుతుందన్నారు.

అలాగే సింగరేణి సుస్థిర భవిష్యత్ కోసం, ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి కోసం కొత్త గనులను ఏర్పాటు చేయాలన్న దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా కేంద్ర బొగ్గు శాఖ మంత్రిని కలిసి తాడిచర్ల -2 గనిని సింగరేణికి కేటాయించేందుకు విజ్ఞప్తి చేయగా.. సానుకూల స్పందన లభించిందన్నారు.

అలాగే నైనీ గని ప్రారంభానికి ఉన్న అవాంతరాలను తొలగించేందుకు ఒడిశా ముఖ్యమంత్రితో మాట్లాడించడం జరిగిందన్నారు. సింగరేణి ఆధ్వర్యంలోని రాష్ట్రంలోని భారీ జలాశయాలపై ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లు, ఓపెన్ కాస్ట్ లపై పవన విద్యుత్ వంటివి ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు చేస్తున్నామన్నారు.

సింగరేణి సమస్యలపై మానవీయ కోణంలో ముందుకు వెళ్తున్నామని… తాము తీసుకునే నిర్ణయాలన్నీ సింగరేణి ఉజ్వల భవిష్యత్కు బాటలు వేసేవిగానే ఉంటాయన్నారు. సింగరేణి సంపదను పెంచడమే తమ లక్ష్యమని.. అలా పెంచిన సంపదను కార్మికులకు పంచడమే ధ్యేయమని ప్రకటించారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతను పోటీ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు వీలుగా డాక్టర్ బీఆర్.అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లను త్వరలో ప్రారంభిస్తామని ప్రకటించారు.

రాష్ట్ర అభివృద్ధిలో సింగరేణి కీలక పాత్ర పోషిస్తుందనీ, ఈ సంస్థను అభివృద్ధి చేయడం, కొత్త ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందన్నారు. సింగరేణిలో ఎస్సీ, ఎస్టీ లైజన్ ఆఫీసర్లు ఉన్న మాదిరిగానే బీసీ లైజనింగ్ ఆఫీసర్ నియామకాన్ని చేపట్టేలా చర్యలు తీసుకోవాలని యాజమాన్యాన్ని ఆదేశిస్తున్నట్లు తెలిపారు.

ఈ సమావేశానికి సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ ఎన్.బలరామ్ స్వాగతం పలుకుతూ 134 సంవత్సరాల చరిత్ర గల సింగరేణి సంస్థకు హైదరాబాద్ లో సొంత గెస్ట్ హౌస్ లేదని, రాష్ట్ర ప్రభుత్వం వారు సొంత గెస్ట్ హౌస్ కోసం వెయ్యి గజాల స్థలాన్ని కేటాయించడమే కాక శంకుస్థాపనకు విచ్చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. గత 100 రోజుల్లో సింగరేణిలో కార్మికుల సంక్షేమానికి, సంస్థ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అనేక కార్యక్రమాలను చేపట్టినట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సంస్థను దేశంలోనే అగ్రగామి సంస్థగా నిలబెడతామన్నారు.

సింగరేణి ఛైర్మన్ మరియు ఎండీ ఎన్.బలరామ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, పరిశ్రమలు, వాణిజ్యం, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మీ, కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలు వివేక్, వినోద్, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, ప్రేమ్ సాగర్ రావు, మాజీ ఎంపీ, భారత మాజీ క్రికెట్ కెప్టెన్ అజారుద్దీన్, ప్రాతినిథ్య సంఘ నాయకులు జనక్ ప్రసాద్ పాల్గొన్నారు.

LEAVE A RESPONSE