Suryaa.co.in

Editorial

జగన్.. మరో కోడికత్తి కేసు కథ రె‘ఢీ’?

  • జగన్ పర్యటనలో యువకుడి అత్యుత్సాహం

  • కారెక్కిమరీ జగన్‌కు షేక్‌హ్యాండ్

  • పట్టుకున్న సెక్యూరిటీ

  • ఒక కోడికత్తి, మరో గులకరాయి కథకు రంగం సిద్ధం?

  • ఇప్పటికే తనకు సెక్యూరిటీ పెంచాలని కోర్టులో జగన్ పిటిషన్

  • ఇప్పుడు ఈ ఘటనను సాకుగా చూపే యత్నం?

  • జగన్ కారెక్కేంత వరకూ పోలీసులు ఏం చేస్తున్నారు?

  • జగన్ ప్రైవేట్ ఆర్మీ నిద్రపోతోందా?

  • మరో కారు కేసు కుట్ర ప్రచారానికి రంగం సిద్ధం?

( మార్తి సుబ్రహ్మణ్యం)

వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్‌రెడ్డి ముందు.. కట్టుకథలకు ప్రాణం పోయడంలో చేయి తిరిగిన కథా రచయితలు, సినీ దిగ్దర్శకులు బలాదూరే. ఆ నిజాన్ని విశాఖలో ఒక కోడికత్తి కేసు.. బెజవాడలో ఇంకో గులకరాయి కేసు రుజువుచేశాయి. లేటెస్టుగా మరో హత్యకుట్ర కథకు ప్రాణం పోస్తున్న అనుమానాలకు నంద్యాలజిల్లా సీతారామపురం వేదిక కానుంది. అదే కారు కుట్ర కేసు!

హత్యకు గురైన వైసీపీ నాయకుడు, పసుపులేటి సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన జగన్‌కు భారీ స్వాగతం లభించింది. ఆయనను చూసేందుకు జనాలు భారీగా తరలివచ్చారు. పార్టీ ఓడిపోయినా ఆయనకు ఇంకా జనంలో ఇమేజ్ తగ్గలేదని, జగన్‌ను చూసేందుకు, దగ్గరకొచ్చి కరచాలనం చేసేందుకు జనం పోటీలు పడుతున్నారన్న నిజం ఇటీవల జరిగిన ఆయన రెండు పర్యటనలూ రుజవు చేశాయి. ఇది కూటమికి ఒక హెచ్చరిక సంకేతమన్నది వేరే విషయం.

అయితే నంద్యాలజిల్లా పర్యటనలో జరిగిన ఓ ఘటన అనేక అనుమానాలు-జగన్ భవిష్యత్తు ప్రణాళికకు ఊపిరిపోసినట్లు కనిపిస్తోంది. జగన్ చుట్టూ లెక్కలేనంతమంది పోలీసులు, జడ్‌ప్లస్ భద్రత ఉన్నప్పటికీ.. ఒక యువకుడు ఆయన కారెక్కిమరీ, అద్దంపైన ఎక్కి జగన్‌కు షేక్‌హ్యాండ్ ఇవ్వడం అనేక అనుమానాలకు తెరలేచింది.

సహజంగా జడ్ ప్లస్ భద్రత ఉన్న జగన్ సమీపానికి ఎవరినీ పంపించరు. ఆయన కారులో నిలబడి అభివందనం చేసే సమయంలో కూడా భద్రతా సిబ్బంది ఆయన వెనుక, పక్కనే ఉంటారు. కారు ముందు వారితోపాటు, స్థానిక పోలీసులు కూడా పహారాకాస్తుంటారు. జడ్ ప్లస్ భద్రత ఉన్న ఎవరికైనా సెక్యూరిటీ ఇలాగే ఉంటుంది. కానీ వాటిని దాటుకుని ఒక యువకుడు, కారు అద్దాలు ఎక్కి మరీ జగన్‌కు షేక్‌హ్యాండ్ ఇచ్చారంటే.. అది ముందస్తు ప్రణాళికలో భాగంగా వేసుకున్న వ్యూహమేనని, బుర్రబుద్ధి ఉన్న ఎవరికైనా స్పష్టమవుతుంది.

అసలు ఆ యువకుడు జగన్ కారు ఎక్కే వరకూ పోలీసులు ఏం చేస్తున్నారు? పోనీ పోలీసులు పట్టించుకోలేదనుకున్నా, జగన్ ప్రైవేటు ఆర్మీ ఏం చేస్తున్నట్లు? జగన్ వెనుక ఉన్న గన్‌మెన్ ఎందుకు చూడలేదు? ఇవన్నీ అనుమానించేందుకు ఉన్న అవకాశాలే.

అయితే.. పోలీసులు, రాజకీయ వర్గాలు దీన్ని మరో కోణంలో విశ్లేషిస్తున్నాయి. ఇటీవల జగన్ తనకు 900 మంది పోలీసులతో భద్రత కల్పించాలని, సీఎం చంద్రబాబునాయుడు తరహాలోనే తనకూ సెక్యూరిటీ ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో నంద్యాల జిల్లా సీతారామపురంలో జరిగిన ఘటనను ఉదాహరణగా చూపి, జగన్ ప్రాణాలకు ప్రమాదం ఉన్నందున.. తక్షణం ఆయనకు సెక్యూరిటీ పెంచాలని వాదించే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

గతంలో జగన్ విపక్షనేతగా ఉన్న సమయంలో.. విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన కోడికత్తి కేసును, ఈ సందర్భంగా రాజకీయ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. దాడి జరిగిన వె ంటనే విశాఖలోని ఆసుపత్రికి వెళ్లకుండా. విమానంలో హైదరాబాద్ వెళ్లి తనకు నచ్చిన రెడ్డిగారి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారట. అధికారంలోకి వచ్చిన తర్వాత చికిత్స చేశారని చెబుతున్న సదరు డాక్టర్ రెడ్డిగారికి పదవి కూడా ఇచ్చారనుకోండి.

ఆ సందర్భంలో విచారణకు వెళ్లిన ఏపీ పోలీసులకు జగన్ సహకరించలేదు. తనకు ఏపీ పోలీసులపై నమ్మకం లేదని చెప్పారు. చాలకాలం పాటు కోడికత్తి కేసును విచారించిన ఎన్‌ఐఏ కోర్టుకు హాజరయి, జగన్ ఇప్పటివరకూ సాక్ష్యం ఇచ్చింది లేదు. కోర్టు ఎన్నోసార్లు ఆయనకు మినహాయింపు ఇవ్వడం కూడా విమర్శలకు దారితీసింది.

అప్పుడు సీఎంగా ఉన్నందున సెక్యూరిటీ కోణంలో తాను కోర్టుకు రాలేనని, కావాలంటే కోర్టు నుంచి ఎవరినైనా పంపించి సాక్ష్యం నమోదు చేసుకోవాలని జగన్ న్యాయవాది వాదించారు. నిజంగా తనపై కోడికత్తి శీను తనపై హత్యాయత్నం చేసినప్పుడు, కోర్టుకు హాజరై నాటి సంఘటనను జడ్జికి వివరించాలి కదా? అన్నది ప్రశ్న. అయితే జగన్‌పై హత్యాయత్నానికి సంబంధించి ఆధారాలు లేనందున, కోర్టు కోడికత్తి శీనుకు బెయిల్ ఇచ్చింది. అది వేరే విషయం.

ఆ తర్వాత ఎన్నికల ప్రచార సమయంలో.. బెజవాడలో ప్రచారం చేస్తున్న జగన్‌పై, ఇద్దరు యువకులు రాయి విసిరిన ఘటన సంచలనం సృష్టించింది. వెంటనే ఆసుపత్రికి వెళ్లకుండా ఎన్నికల ప్రచారం చేసి నింపాదిగా ఆసుపత్రికి వెళ్లిన జగన్‌కు.. ఓపెన్‌హ్టార్టు సర్జరీ చేసినంత బిల్డప్పు ఇచ్చిన ఫొటోలు, మీడియాకు పంపించారు. ఆ రాయితో జగన్‌ను హత్య చేయాలని చూశారంటూ కేసు పెట్టి, వారిని జైల్లో పెట్టారు. విచిత్రంగా వారు విసిరిన ఒకే రాయి.. ముందు జగన్ నుదుటకు తగిలి కిందపడి.. విఠలాచార్య సినిమా లెవల్లో మళ్లీ పైకి లేచి, పక్కనే ఉన్న అప్పటి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసుకు తగిలిందని, విచారణ అధికారులు వెల్లడించారు.

ఇక ఆ తర్వాత జగన్ నుదుట గాయానికి సంబంధించి వేసిన ప్లాస్టర్ల సైజు, రోజూ పెరగడం సోషల్‌మీడియాలో బోలెడంత కామెడీ పండించింది. పైగా గాయానికి గాలి రాకుండా అన్ని రోజులు అంత పెద్ద కట్లు కడితే సెప్టిక్ అవుతుందని డాక్టర్ చెల్లెమ్మ సునీత హెచ్చరించింది. అటు సొంత చెల్లి షర్మిల కూడా ఒకే రాయి ఇద్దరికి ఎలా తగులుతుందని లా పాయింట్ తీసింది.

దానితో సిగ్గుపడ్డ జగన్ తన నుదిటిపై ఉన్న ప్లాస్టర్ తీసేశారు. విచిత్రంగా నుదుటిపై ఒక చిన్న గీత కూడా కనిపించలేదు. అది వేరే ‘కథ’. దాని తర్వాత జగన్ సెక్యూరిటీ పెంచుతూ నిఘా దళపతి ఉత్తర్వులిచ్చారు.

ఇప్పుడు సీతారామపురంలో యువకుడి అత్యుత్సాహ యవ్వారం పరిశీలిస్తే.. ఆ యువకుడు జగన్‌ను హత్య చేసేందుకే కారు ఎక్కాడని, ఈ ఘటనలో కూటమి సర్కారు వైఫల్యం చెందిందన్న కొత్త కథకు ప్రాణం పోసేందుకు.. వైసీపీ కొత్తగా తయారుచేసుకున్న ప్రచారంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఆ యువకుడికి చంద్రబాబునాయుడు, పవన్,లోకేష్‌తో సంబంధాలున్నాయి కాబట్టి.. ఆ ముగ్గురిపైనా కేసులు పెట్టాలని, వైసీపీ వ్యూహబృందం డిమాండ్ చేసినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. ఏతావతా.. ఈ ఘటనను ఉదాహరణగా చూపించి, అటు హైకోర్టులో తన భద్రత పెంచుకోవడం.. ఇటు రాష్ట్రంలో శాంతిభద్రతలు అధ్వానంగా ఉన్నాయని, ప్రతిపక్షనేత ప్రాణాలకే భద్రత లేదని గత్తర చేసే కొత్త కథకు సిద్ధమవుతున్నట్లే కనిపిస్తోంది.

LEAVE A RESPONSE