Suryaa.co.in

Andhra Pradesh

ఎన్నికలకు జగన్ సిద్ధం కాదు…సందిగ్ధం

-జగన్ టికెట్లు ఇస్తున్నా…పోటీకి అభ్యర్థులు లేరు
-జగన్ బటన్ నొక్కడం వల్లే 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెరిగాయి
-జాబ్ కేలండర్ కు జగన్ ఎందుకు బటన్ నొక్కలేదు?
-మద్య నిషేధం..సీఎఎస్ రద్దు హామీలకు బటన్ ఎందుకు నొక్కలేదు?
-ఓటుతో ప్రజలు నొక్కే బటన్ తో జగన్ ఇంటికెళ్లడం ఖాయం
-వందలకోట్లు మింగేసిన సలహాదారులు ఇచ్చిన ఒక్క మంచి సలహా చెప్పగలవా.?
-ఆర్థిక రాజధాని విశాఖ నేడు నేరాలకు రాజధానిగా మారింది
-సీఎం విశాఖ వస్తానంటే..జనం వద్దుబాబోయ్ అంటున్నారు
-మాడుగుల రా…కదలిరా బహిరంగ సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ధ్వజం

మాడుగుల :- ‘‘ఎన్నికలకు సిద్ధం అని జగన్ తన సభల్లో అంటున్నారు..కానీ ఓటమి భయంతో పూర్తిగా సందిగ్ధంలో ఉన్నాడు. జగన్ టికెట్లు ఇస్తున్నా పోటీకి అభ్యర్థులు దొరకడం లేదు. జగన్ బటన్ నొక్కడం వల్లే 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెరిగాయి. జాబ్ కేలండర్ కు జగన్ ఎందుకు బటన్ నొక్కలేదో సమాధానం చెప్పాలి. మద్య నిషేధం..సీఎఎస్ రద్దు హామీలకు బటన్ ఎందుకు నొక్కలేదో చెప్పాలి. వచ్చే ఎన్నికల్లో ఓటుతో ప్రజలు నొక్కే బటన్ తో జగన్ ఇంటికెళ్లడం ఖాయం’’ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.

అనకాపల్లి జిల్లా, మాడుగులలో సోమవారం రా..కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. ‘‘మాడుగులలో రా…కదలిరా అని పిలుపునిస్తే..జనం పెద్దఎత్తున తరలి వచ్చారు. యుద్ధానికి మేము కూడా సిద్ధమంటూ మా ఆడబిడ్డలు కూడా వచ్చారు. యువత ఎటువైపు ఉంటే అటువైపే గెలుపు. ప్రజాక్షేత్రంలో టీడీపీ-జనసేన గెలిచింది. రానున్న ఎన్నికల్లో తప్పకు విజయం సాధించి ప్రజల ప్రభుత్వాన్ని స్థాపిస్తాం. మాడుగుల సభకు వచ్చిన జనాన్ని చూసి తాడేపల్లి పిల్లికి జ్వరం వస్తుంది. రానున్న రోజుల్లో తాడేపల్లి పిల్లికి నిద్ర కూడా పట్టదు.

కేవలం 64రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి..రా..కదలిరా అని పిలుపునిస్తే ప్రాంతం ఏదైనా రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలు, ప్రజల్లో జోరు…స్పీడు ఎక్కడా తగ్గకుండా కనిపిస్తోంది. జగన్ రెడ్డి, వైసీపీ ప్రభుత్వంపై ప్రభుత్వంపై ప్రజల యుద్ధం కనిపిస్తోంది..ఇది రానున్న కాలంలో ఉధృతమై తుఫానుగా మారుతుంది…ఈ తుఫానులో వైసీపీ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయం.

రానున్న ఎన్నికలు టీడీపీ, జనసేకోసం కాదు..రాష్ట్ర భవిష్యత్తు కోసం. రానున్న ఎన్నికలు పార్టీలు, అధికారానికి సంబంధించినవి కాదు…తెలుగుజాతి భవిష్యత్తుకు సంబంధించినవి.రానున్న ఎన్నికల్లో రాష్ట్రం, ప్రజలు, బిడ్డల భవిష్యత్తు గెలుపుకోసమే.. సైకో పాలనను అంతం చేస్తేనే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుంది.
బటన్ నొక్కుడు మాటున…ఎంత బొక్కావో చెప్పు.?

ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాను…కానీ జగన్ రెడ్డి లాంటి సైకోను నేను నా జీవితంలో చూడలేదు. సైకో గద్దె దిగితేనే రాష్ట్రానికి మోక్షం కలుగుతుంది. జగన్ రెడ్డి 124సార్లు బటన్ నొక్కానని గొప్పగా చెబుతున్నాడు. బటన్ నొక్కుడు కాదు.. దాని చాటున నీ బొక్కుడు ఎంతో చెప్పు. బటన్ నొక్కుడు చాటున ఎంత బొక్కాడో, ఎంత దాచాడో ప్రజలంతా ఆలోచించాలి. జగన్ బటన్ నొక్కడం వల్ల 9సార్లు కరెంటు ఛార్జీలు పెరిగి పేదవాళ్లు నష్టపోయారు. రూ.64వేల కోట్ల భారాన్ని ప్రజలపై వేశాడు.

టీడీపీ పాలనలో ఒక్కసారి కూడా కరెంటు ఛార్జీలు పెంచలేదు. జగన్ బటన్ నొక్కడం వల్ల ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి, చెత్తపన్ను, ఆస్తిపన్ను, పెట్రోలో, డీజిల్ ధరలు పెరిగాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. జగన్ పాలనలో ఒక్కో కుటుంబంపై రూ.8లక్షల అప్పు పెరిగింది. జాబ్ క్యాలెండర్ కు ఎందుకు బటన్ నొక్కలేదు? 5ఏళ్లలో ఒక్కసారి కూడా జాబ్ క్యాలెండర్ కు బటన్ నొక్కలేదు. జగన్ రెడ్డిది ఉత్తుత్తి బటనే. జాబు రావాలంటే….బాబు రావాలి. మద్యనిషేధ హామీకి ఎందుకు బటన్ నొక్కలేదో మహిళలకు జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి.

మద్యనిషేధం చేయకపోతే ఓట్లు అడగనని చెప్పి…నేడు ఓట్లు వేయాలని సిగ్గులేకుండా జగన్ అడుగుతున్నాడు. సీపీఎస్ రద్దుకు ఎందుకు బటన్ నొక్కలేదో జగన్ ఉద్యోగులకు సమాధానం చెప్పాలి. ఎన్నికలకు ముందు ఉద్యోగులతో మాట్లాడుతూ…వారంలోనే సీపీఎస్ రద్దు చేస్తానని చెప్పాడు…నేటికీ చేయలేదు. జగన్ రెడ్డికి చివరి వారం దగ్గర్లోనే ఉంది. ఇక ఇంటికే…. గుంతలు పూడ్చడానికి ఒక్కసారి కూడా ఎందుకు బటన్ నొక్కలేదో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి జగన్ రెడ్డి… రైతుల ఆత్మహత్యల నివారణ కోసం ఎందుకు ఒక్కసారి కూడా బటన్ నొక్కలేదు?

రైతు బ్రతుకు వైసీపీ పాలనలో చితికి పోయింది… రోజుకు ఐదుగురు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. డీఎస్సీ కోసం ఈ ఐదేళ్లలో బటన్ నొక్కేలేదు..కానీ ఇప్పుడు మెగా డీఎస్సీ అని కాకమ్మ కబుర్లు చెబుతున్నాడు. జగన్ రెడ్డి మైనింగ్, భూగర్భగనులు, ఇసుక, మద్యంపై దోచుకునేందుకు బటన్లు నొక్కాడు. ఇసుకపై ప్రతిరోజు సాయంత్రానికి తాడేపల్లి ప్యాలెస్ కు వందలకోట్లు చేరుతున్నాయి. జగన్ సొంత బ్రాండ్లు అమ్ముకుంటూ దోచుకుంటున్నాడు. ఇప్పటికి జగన్ బ్రాండ్లు తాగి 30లక్షల మంది అనారోగ్యం పాలయ్యారు. జగన్ రెడ్డి బటన్ డ్రామాలు రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యాయి…రానున్న ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు నొక్కే బటన్ తో వైసీపీ, జగన్ రెడ్డి జైలుకెళ్లడం ఖాయం.

సలహాదారులిచ్చిన ఒక మంచి సలహా చెప్పు?
జగన్ ధనదాహంతో ఉత్తరాంధ్రను ఊడ్చేశాడు. కొండల్ని అనకొండల్లా మింగేశారు. ఉత్తరాంధ్ర ప్రజలు నీతి నిజాయితీతో ఉంటారు. నాకు ఉత్తరాంధ్ర అంటే అభిమానం. ఇలాంటి ప్రాంతంలో హింసా, అశాంతి, కబ్జాలకు నెలవుగా మారింది. రుషికొండను అనకొండలా జగన్ రెడ్డి మింగేశాడు. రూ.500కోట్లతో రుషికొండపై ప్యాలెస్ కడుతున్నాడు. కేంద్రం ఇచ్చే డబ్బులు, నరేగా నుండి వచ్చే డబ్బులు తప్ప పేదల ఇళ్లకు జగన్ ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి జగన్ రెడ్డి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు…కానీ సాక్షి పేపరుకు రూ.1000కోట్లు ప్రకటనలతో దోచిపెట్టాడు.

సలహాదారులు 100మందికి రూ.700కోట్లు ఇచ్చాడు. ఒక్క సజ్జలకే రూ.150కోట్లను జగన్ దోచిపెట్టాడు. సలహాదారులు ఇచ్చిన ఒక్క మంచి సలహా చెప్పు.? పెట్టుబడులకు విశాఖ స్వర్గధామం..నేడు వైసీపీ పాలనలో కబ్జాలకు కేంద్రబిందువుగా మారిపోయింది. విశాఖలో రూ.40వేల కోట్లను దోచేశాడు. ఇలాంటి దోపిడీ పార్టీకి వచ్చే ఎన్నికల్లో బుద్ధిచెప్పాలి.

కమీషన్లతో కంపెనీలు పరార్
విశాఖలో మిలీనియం టవర్, హైదరాబాద్ లో హైటెక్ సిటీ కట్టిన ఘనత మాది. ఉమ్మడిరాష్ట్రంలో అనేక కంపెనీలను తీసుకొచ్చాం. వాటిలో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, లులు, హెచ్ఎస్బీసీ, అదాని డేటా సెంటర్ వంటివి ఉన్నాయి. ఈ కంపెనీలను జగన్ తన కమీషన్ కక్కుర్తికోసం తరిమేసి…రియల్ ఎస్టేట్ వ్యాపారులకు భూములను దోచిపెట్టాడు. కార్తీకవనం, ఎన్సీసీ భూములు, ప్రేమ సమాజం, బే పార్కు, దస్పాల్లా భూములు, హైగ్రో భూములు మొత్తాన్ని దోచుకున్నారు.

విశాఖ మెట్రోను ఎప్పుడో మేం చేపట్టాం..దాన్ని జగన్ పట్టించుకోలేదు. టీడీపీ 2019లో వచ్చి ఉంటే ఇప్పటికే పూర్తయ్యేది. విశాఖ రైల్వే జోన్ కు 53ఎకరాలు ఇస్తే జోన్ నిర్మాణం పూర్తయ్యి…మన యువతకు వందలాది మందికి ఉద్యోగాలు వచ్చేవి. దాన్ని జగన్ రెడ్డి అడ్డుకున్నాడు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు నినాదంతో ప్రాణాలు అడ్డుపెట్టి పోరాడి సాధిస్తే..దాన్ని ప్రైవేటీకరణ చేసే పరిస్థితి వస్తే జగన్ రెడ్డి కనీసం ఒక్క మాట మాట్లాడలేదు. టీడీపీ పాలనలో ఇలాంటి పరిస్థితి వస్తే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి డబ్బులిచ్చి ముందుకు నడిపించాం తప్ప ప్రైవేటీకరణ కానివ్వలేదు.

జగన్ రెడ్డికి ఉత్తరాంధ్రపై ప్రేమ లేదు…కేవలం దోచుకునేందుకు ఒక బంగారు గనిలా మాత్రమే భావిస్తున్నాడు. గతంలో విశాఖపట్నం ఆర్థిక రాజధాని, నాలెడ్జ్ హబ్ గా తయారుచేయాలని మేం ప్రయత్నించాం…జగన్ రెడ్డి సీఎం అయ్యాక ఉత్తరాంధ్రను గంజాయికి క్యాపిటల్ గా, క్రైం క్యాపిటల్ గా మార్చాడు. పిల్లలు గంజాయికి అలవాటు పడితే.. తల్లిదండ్రుల మాట వినరు.. పిల్లల భవిష్యత్తు సర్వనాశనం అయినట్టే. ఇలాంటి గంజాయి విషయంలో జగన్ రెడ్డి ఒక్కరోజు కూడా సమీక్ష చేసి నిషేధించే ప్రయత్నం చేయలేదు.

చివరకు ఏపీ పోలీసులే గంజాయి అమ్ముతూ హైదరాబాద్ లో దొరికే సిగ్గుమాలిన పరిస్థితి వచ్చింది. ఇది పోలీసుల తప్పు కాదు…జగన్ రెడ్డి పోలీసులతో నీచమైన పనులు చేపిస్తున్నాడు. వైసీపీ ఎంపీ కుటుంబ సభ్యులను వైసీపీ నాయకులే కిడ్నాప్ చేసి…డబ్బులు వసూలు చేశారు. విశాఖ రూరల్ ఎమ్మార్వో రమణయ్యను కొంతమంది ఇంట్లోకి వెళ్లి దారుణంగా చంపేశాడు. విమానాశ్రయం నుండి నిందితుడు దర్జాగా పారిపోయాడు.

అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. హంతకులు ఇళ్లకే వచ్చి దౌర్జన్యం చేసే పరిస్థితి వచ్చింది. మహిళల మాన, ప్రాణాలకు వైసీపీ పాలనలో రక్షణ లేకుండా పోయింది. పులివెందుల రౌడీలు విశాఖను కబ్జా చేస్తున్నారు. ముఖ్యమంత్రి బంధువు అనిల్ రెడ్డి విశాఖలో కబ్జాలకు పాల్పడుతుంటే వైసీపీ ఎంపీలు సహకరిస్తూ వారు కూడా దోచుకుంటున్నారు.

ఫ్యానుకు ఉన్న మూడు రెక్కలు విరగ్గొట్టండి
విశాఖ ప్రజలు జగన్ రెడ్డిని ఈ ప్రాంతానికి రావొద్దని చెబుతున్నారు… టీడీపీ పాలనలో అమరావతి ఏపీ రాజధాని, విశాఖ ఆర్థిక రాజధాని అని ప్రజలు ఒప్పుకున్నారు. రాజధానితో మూడు ముక్కలాట ఆడుతూ రాజధాని లేకుండా చేసి చరిత్ర హీనుడుగా మిగిలాడు. జగన్ రెడ్డి వస్తున్నాడంటే ఆ ప్రాంతం ప్రజలు భయపడిపోతున్నారు. రాష్ట్రంలోని 3 ప్రాంతాల ప్రజలు ఫ్యానుకు ఉన్న 3 రెక్కలను ముక్కలుగా విరగొట్టాలి.

బాదుడే బాదుడు అనే రెక్కను పీకడానికి కోస్తా ప్రజలు, హింస, దోపిడీ రెక్కను తుక్కుతుక్కు చేయడానికి రాయలసీమ ప్రజలు, మొండి ఫ్యానును జగన్ చేతికి ఇచ్చి జగన్ కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి, వైసీపీని బంగాళాఖాతంలో విసిరేయడానికి రాష్ట్ర ప్రజలంతా సిద్ధం కావాలి. విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి క్రింద రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల బ్రతుకులు నలిగిపోతున్నాయి. ఉత్తరాంధ్రలో అసలు వైసీపీకి నాయకులు లేరా? ఈ రెడ్ల పెత్తనం ఏంటో ఆలోచించాలి. టీడీపీ పాలనలో ఉత్తరాంధ్రలో ఉత్తరాంధ్ర నాయకులే ప్రజల సంక్షేమాన్ని చూసుకున్నారు. ఇలాంటి పరిస్థితిని మేం అధికారంలోకి వచ్చాక మళ్లీ తీసుకొస్తాం.

బీసీ, ఎస్సీ నేతలపై జగన్ అక్రమ కేసులు
జగన్ రెడ్డి పాలనలో రాష్ట్ర ప్రజలు, ప్రతిపక్ష నేతలు బాధితులుగా మారారు. అయ్యన్నపాత్రుడుపై నిర్భయ కేసు, బండారు సత్యనారాయణమూర్తిపై అక్రమ కేసులు, వంగలపూడి అనితపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిన గొప్ప గొప్ప నాయకులు వైసీపీ వాళ్లు. సంక్షేమానికి చిరునామా…తెలుగుదేశంపార్టీ. రూ.2కే కేజీ బియ్యం, బీసీలను రక్షించిన పార్టీ టీడీపీ. విదేశీవిద్య, పండుగ కానుకలు, చంద్రన్నబీమా, అన్న క్యాంటీన్లు తెచ్చిన పార్టీ టీడీపీ. టీడీపీ అధికారంలోకి వచ్చాక వైసీపీ ఇచ్చిన సంక్షేమాన్ని మించిన సంక్షేమ పథకాలు తెస్తాం.

దీంతో పాటు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం. అభివృద్ధి జరిగితే సంపద వస్తుంది, ఆదాయం వస్తుంది…ఈ ఆదాయాన్ని పేదలకు పంచితే సంక్షేమం మరింత పెరుగుతుంది. ఇదే టీడీపీ సిద్ధాంతం. సూపర్-6 పథకాలలో భాగంగా… యువతకు సంవత్సరానికి 4లక్షల ఉద్యోగాలు ఇస్తాం. 5 ఏళ్లలో 20లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ భృతి నెలకు రూ.3వేలు ఇస్తాం. ఆస్తిలో సమాన హక్కును ఎన్టీఆర్, తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చింది. డ్వాక్రా, పసుపు,కుంకుమ తో ఆర్థికసాయం, ఉద్యోగాలు, కాలేజీల్లో 33శాతం రిజర్వేషన్ కల్పించన ఘనత టీడీపీది. మేం అధికారంలోకి వచ్చాక మహిళలను ఆర్థికంగా ముందుకు తీసుకెల్లే బాధ్యతను నేను తీసుకుంటానని మాటిస్తున్నా.

మహిళలను ఆర్థికంగా ముందుకు తీసుకెళ్తా
ఆడబిడ్డ నిధి ద్వారా నెలకు రూ.1,500 18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి అందిస్తాం. రాష్ట్రంలో ఎక్కడున్నా ఇస్తాం. జగన్ రెడ్డి సంవత్సరానికి ఇచ్చే రూ.18వేలు కొంతమందికే…మేం అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికీ ఇస్తాం. అమ్మఒడి ప్రతి విద్యార్థికి ఇస్తానని చెప్పి ఒక్కరికే జగన్ ఇస్తున్నాడు. మేం అధికారంలోకి వచ్చాక ఇంట్లో ఎంతమంది విద్యార్థులుంటే అంతమందికి సంవత్సరానికి తల్లికి వందనం ద్వారా రూ.15వేలు ఇస్తాం. పిల్లలు మన ఆస్తి, మన భవిష్యత్తుకు నాంది..వాళ్లను అభివృద్ధిలోకి తీసుకొచ్చే బాధ్యత నాది. దీపం పథకాన్ని తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశంపార్టీదే.

మహిళలు కట్టెల పొయ్యితో పడుతున్న ఇబ్బందులు చూసి ఈ పథకం పెట్టాను. దీన్ని జగన్ రెడ్డి మూలన పడేశాడు. మేం అధికారంలోకి వచ్చాక పేద వారికి సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా అందిస్తాం. మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడడానికి ఉచితంగా మరుగుదొడ్లు కట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. డ్వాక్రా సంఘాలు పెట్టి మహిళలను వంటింటి నుండి సమాజంలోకి తెచ్చి…వారిలో నాయకత్వ లక్షణాలను కూడా పెంచాం. మహిళలు ఎక్కడికి వెళ్లాలన్నా ఉచితంగా ఆర్టీసీ సదుపాయం కల్పిస్తాం.

2.50కోట్ల ఆడబిడ్డలు ఈ రాష్ట్రంలో ఉన్నారు…కొత్త బిచ్చగాళ్లు వచ్చి మహిళలను ఓట్లు అడుక్కుంటున్నారు. వాళ్లకు ఓటేస్తే మీ పిల్లల చేతుల్లో గంజాయి పెట్టి మీ జీవితాలను నాశనం చేసేస్తారు. మేం అధికారంలోకి వచ్చాక యువతకు వర్క్ ఫ్రం హోం పెడతాం…మండల కేంద్రంలో వర్క్ స్టేషన్లు పెట్టి తల్లిదండ్రులకు అందుబాటులో యువతను ఉంచుతాం. రక్షిత మంచినీటి పథకం తెచ్చి, ఇంటింటికీ సురక్షిత మంచినీరు అందిస్తాం..ప్రజలకు మంచినీరు ఇవ్వలేని పరిస్థితి జగన్ రెడ్డిది. రైతే రాజు అనేలా చేస్తాం…సంవత్సరానికి రూ.20వేలు ఆర్థికసాయం చేస్తాం…వ్యవసాయంలో ఆధునీకరణ తెచ్చి మీ భవిష్యత్తున బంగారుమయం చేస్తానని అన్నదాతకు మాటిస్తున్నా.

పేదలకు 2 సెంట్ల భూమిలో ఇంటి నిర్మాణం
బీసీలు టీడీపీకి వెన్నుముక లాంటి వారు. వచ్చే ఎన్నికల్లో గెలిచిన తర్వాత బీసీల రుణం తీర్చుకుంటా. బీసీ సబ్ ప్లాన్ తో పాటు..ప్రత్యేక రక్షణ చట్టం తెస్తామని హామీ ఇస్తున్నా. ఏపీలో పెన్షన్లను తెచ్చిన టీడీపీనే. ఎన్టీఆర్ హయంలో రూ.35 ఇచ్చారు. దీన్ని నేను సీఎం అయ్యాక రూ.75చేశాను. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలన్నీ కలిసి రూ.200చేశాయి. నేను 2014లో సీఎం అయ్యాక ఒక్కసారిగా రూ.1,000 కి పెంచాను. రూ.1000 నుండి రూ.2వేల కు పెంచాను. జగన్మోహన్ రెడ్డి పెన్షన్ ను అంచెలంచెలుగా పెంచానని గొప్పలు చెబుతున్నాడు.

మేం అధికారంలోకి వచ్చాక పెన్షన్ మీ ఇంటికే పంపిస్తాం.. పెన్షన్ ఎంత పెంచాలో పెంచే బాధ్యత మేం తీసుకుంటాం. రూ.5కే పూట భోజనాన్ని అన్న క్యాంటీన్ ద్వారా అందించాను. 3నెలలు పెన్షన్ తీసుకోకపోయినా ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. పేదవాళ్లకు గతంలో 2సెంట్లు భూమి ఇచ్చాం…జగన్ రెడ్డి ఇచ్చింది కేవలం సెంటు భూమి మాత్రమే. మేం అధికారంలోకి వచ్చాక 2సెంట్లు భూమి ఇచ్చి, ఉచిత ఇళ్లు కట్టిస్తాం. గతంలో మేం టిడ్కో ఇళ్లు కడితే…జగన్ రెడ్డి రంగుల పిచ్చోడిలా టిడ్కో ఇళ్లకు రంగులు వేసుకున్నాడు..లబ్ధిదారులకు ఇళ్లు ఇవ్వలేదు.

సందిగ్ధంలో జగన్
జగన్ రెడ్డి వై నాట్ 175 అంటున్నాడు…కానీ మేం అంటున్నాం…వై నాట్ పులివెందుల అని…జగన్ రెడ్డికి అభ్యర్థులు దొరకడం లేదు..కానీ సిద్ధం అంటూనే సందిగ్ధంలో పడిపోయాడు. ఎమ్మెల్యేలను జగన్ రెడ్డి బదిలీలు చేస్తున్నాడు. 6లిస్టుల ద్వారా 85మందిని మార్చాడు. కొంత మంది జగన్ రెడ్డి ఆదేశాలను చెత్తబుట్టల్లో వేశారు. కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. కొంతమంది అందుబాటులో లేకుండా వెళ్లిపోయారు. జగన్ రెడ్డి ట్రాన్స్ఫర్లతో పిచ్చి రాజకీయాలు చేస్తున్నాడు.

జగన్ రెడ్డి సిద్ధం పేరుతో రాష్ట్ర ప్రజలను సందిగ్ధంలో పడిపోయాడు. జగన్ రెడ్డికి అధికారం పిచ్చోడి చేతిలో రాయిలా వాడుతున్నాడు. రాష్ట్ర ప్రజల జీవితాలను నాశనం చేసిన జగన్ ను ఇంటికి పంపాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలదే. జగన్ తనకు ఎవరూ లేరు…పేపర్లు లేవు…ఛానళ్లు లేవు అంటున్నాడు. కానీ సాక్షి ఛానల్, పత్రిక అవినీతి పత్రికే కదా? జగన్ రెడ్డి కలియుగ భస్మాసరుడు…జగన్ రెడ్డిని అంతం చేయడం ప్రజల బాధ్యత. దీనికి ఓటు అనే వజ్రాయుధాన్ని ప్రజలు వాడుకోవాలి.

జగన్ రెడ్డిని ఓడించడానికి నిరుద్యోగులు, మహిళలు, రైతులు, పేదవాళ్లు, ఎస్సీ, బీసీ, మైనారిటీలు స్టార్ క్యాంపెయినర్లుగా మారాలి. మండుటెండల్ని లెక్కచేయకుండా కదిలివచ్చిన ఉత్తరాంధ్రప్రజానీకాన్ని నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని మాటిస్తున్నా. నష్టపోయిన రాష్ట్రాన్ని, తెలుగుజాతిని కాపాడుకునేందుకు నేను మీ వద్దకు వచ్చాను…. ఆశీర్వదించండి.

దోపిడీలో నిమగ్నమైన వైసీపీ ప్రజాప్రతినిధులు
మాడుగులలో ఓ మంత్రి ఉన్నాడు… బూడి ముత్యాలనాయుడు నియోజకవర్గాన్ని బూడిద చేశాడు. ఒక్క పనికూడా చేయలేదు. టీడీపీ పాలనలో అయ్యన్నపాత్రుడు మంత్రిగా చేసి అనేక పనులు చేశాడు. జల్ జీవన్ మిషన్ పథకంలో రూ.100కోట్లు కొట్టేశాడు బూడిద మంత్రి. బదిలీలు, పదోన్నతుల కోసం విపరీతంగా వసూళ్లకు పాల్పడుతున్నాడు. సొంత మనుషులు, బినామీలను పెట్టుకుని కాంట్రాక్టర్లకు పనులివ్వకుండా రోడ్ల పనులన్నీ నిలిపేశారు.

ఇలాంటి వాడు మాడుగులకు అవసరమా? అనకాపల్లిలో మంత్రి దోపిడీలో స్పీడు…పెట్టుబడులేవి అంటే కోడి…గుడ్డు అని చర్చలు పెడుతున్నాడు. దావోస్ కు ఎందుకు వెళ్లలేదు అంటే చలి వేస్తోందని చెబుతున్నాడు. ఇలాంటివాళ్లు ఉత్తరాంధ్ర ప్రజలకు అవసరమా? అధికారం ఉంది కదా అని ఎగిరెగిరి పడ్డాడు…నేడు చతికిలపడ్డాడు. అధిష్టానం ఈ కోడిగుడ్డు మంత్రి గెలవలేడనే కాణంతో టిక్కెట్టు ఇవ్వకుండా పక్కన కూర్చోబెట్టింది. ఈ మంత్రికి అసలు సిగ్గుందా? విస్సన్నపేట భూముల్లో 600ఎకరాలు కబ్జా చేసి, ప్లాట్లు వేసుకుని అమ్మేసుకున్నాడు. ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధి లేదు..టిడ్కో ఇళ్లు ఇవ్వలేదు..డబ్బులు మాత్రం దోచేస్తున్నాడు.

నర్సిపట్నంలో వైసీపీ ఎమ్మెల్యే గణేష్. దోపిడీలో అతను భేష్… గణేష్ కు నియోజకవర్గంపై శ్రద్ధ లేదు…కేవలం అయ్యన్న, అయ్యన్న కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం, అక్రమ కేసులు పెట్టడంపై మాత్రమే శ్రద్ధ పెడుతున్నాడు. మల్లవరం రిజర్వ్ ఫారెస్టులో రంగురాళ్ల దొంగవ్యాపారం ద్వారా రూ.150కోట్లు కొట్టేశాడు. గబ్బాడ ఇసుక డిపో నుండి 2,300మెట్రిక్ టన్నుల ఇసుకను మాయం చేశాడు. రెవెన్యూ అధికారులను గుప్పిట్లో పెట్టుకుని ఆన్ లైన్ లో పేర్లు తొలగించి…డబ్బులు వసూలు చేస్తున్నాడు. పాయకరావుపేటలో ఓ ఎమ్మెల్యే ఎగిరెగిరిపడ్డాడు..ఎక్కడ దొరికితే అక్కడ దోచేయాలని చూశాడు.

జగన్ అతన్ని కూడా ప్రక్కన పడేశాడు. పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్…బిల్డప్ లో ఇతను రాజ్… తిక్కవారిపాలెం చెరువును ఆక్రమించి చేపల చెరువుగా మార్చాడు…కాలువలు, నీటివనరులను పూడ్చి లే అవుట్ లు వేశాడు. బినామీలతో సెంటు పట్టాల భూములను ఆక్రమించాడు. నరవ, జెర్రిపోతులపాలెం, ఇత్తులవారిపాలెం, ముదప గ్రామాల్లో అక్రమంగా క్వారీయింగ్ చేస్తున్నాడు. హిందూజా ఫార్మా కంపెనీ నుండి వసూళ్లు విపరీతంగా చేస్తున్నాడు.

చోడవరంలో కరణం ధర్మశ్రీ ఉన్నాడు…ఇతను అధర్మశ్రీ. రావికమతం మండలంలో రాబందుకొండను అనకొండలా మింగేశాడు. గ్రానైట్, మైనింగ్ క్వారీల వద్ద ప్రతినెలా వసూళ్లు చేస్తున్నాడు. మందుగుండు సామాను అమ్ముకోవాలన్నా కమీషన్లు ఇవ్వాల్సిందే. యలమంచిలి ఎమ్మెల్యే రమణమూర్తిరాజు దోపిడీలో రాజు…దోపిడీని ప్రశ్నిస్తే దాడులు చేయిస్తున్నాడు. అచ్యుతాపురం మండలంలో పూడిమడక లాలంకోడూరులో 90ఎకరాలో దోచేశాడు. డొప్పెరలో 60ఎకరాలు కొట్టేశాడు. ఉత్తరాంధ్ర ప్రజలకు ఇలాంటి వసూళ్లు రాజాలు కావాలా? నిజాయితీగల నాయకులు కావాలా?

ఉత్తరాంధ్రకు సుజల స్రవంతి కానుకగా ఇస్తా
ఉత్తరాంధ్రకు మాటిస్తున్నా….బంగారం పండించే రైతులకు ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని పూర్తిచేసి కానుకగా ఇస్తా. 8లక్షల ఎకరాలకు నీరు, 30లక్షల మందికి తాగునీటిని ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా అందిస్తాం. 2017లో రూ.2వేల కోట్ల అంచనాతో టెండర్లు పిలిచాం. మేం ఇప్పుడు అధికారంలో ఉండుంటే ఉత్తరాంధ్రలోని చెరువులు అన్నింటిలో పుష్కలంగా నీరు ఉండేది.

రైవాడ రిజర్వాయర్ ఉంది…దీనికి గోదావరి నీరు ఇచ్చి ఆదుకునే బాధ్యత మాది. దేవరాపల్లి వద్ద రైవాడ రిజర్వాయర్ ఆధునీకరణకు రూ.1824కోట్లు ఇస్తే దాన్ని వైసీపీ నేతలు వచ్చి దోచుకున్నారు. తాచేరు, ఉరకగడ్డ రిజర్వాయర్ కు రూ.8కోట్లు ఇస్తే దాన్ని పూర్తిచేయలేదు.

షుగర్ ఫ్యాక్టరీలను గాడిలో పెడతాం
తాండవ షుగర్ ఫ్యాక్టరీని మూత వేశారు. తుమ్మపాల, ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తామని హామీ ఇచ్చి జగన్ మూత వేశాడు. మేం అధికారంలోకి వచ్చాక చోడవరం షుగర్ ఫ్యాక్టరీని బాగుచేయడంతో పాటు సమర్ధవంతమైన మేనేజ్ మెంట్ ను ఇచ్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం. విశాఖ మన్యంలో లేటరైట్ పేరుతో బాక్సైట్ దోచుకుంటున్నాడు…దాన్ని జగన్ రెడ్డి భారతీ సిమెంట్ కంపెనీలకు తరలించుకుంటున్నాడు.

ఉత్తరాంధ్రలో పాడైపోయిన రోడ్లను బాగుచేసే బాధ్యత మాది. అభివృద్ధి చేసిన పార్టీ, అభివృద్ధి చేసే పార్టీ, ఆదాయాన్ని సృష్టించి దాన్ని పేదలకు పంచడం తెలిసిన పార్టీ టీడీపీ. పేదవాళ్లను ధనికులుగా చేయడానికి పూర్ టు రిచ్ కార్యక్రమం చేయాలనేది నా ఆకాంక్ష. తెలుగుజాతిని ప్రపంచంలో అగ్రజాతిగా మార్చాలనేది నా లక్ష్యం. జగన్ రెడ్డి పాలనలో 30ఏళ్లు వెనక్కిపోయిన రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు మీరు ఒక్క అడుగు ముందుకేయండి నేను వంద అడుగులు ముందుకు వేస్తాను.’’ అని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

LEAVE A RESPONSE