Suryaa.co.in

Andhra Pradesh

జగన్ డ్రామా ఆడారు

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల

ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో నాటకాలాడారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. స్పెషల్ స్టేటస్ కోసం మూకుమ్మడి రాజీనామాలు అని చెప్పి డ్రామాలాడారని దుయ్యబట్టారు. వైసీపీ తరపున గెలుపొందిన 23 మంది ఎంపీలు పార్లమెంట్ లో ఒక్క రోజు కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్ల పాటు స్పెషల్ స్టేటస్ ఇస్తామని తెలిపారు. జగన్ ప్రభుత్వంలో ఏడు సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచారని విమర్శించారు. విజయవాడలోని ఓ కన్వెషన్ సెంటర్ లో కాంగ్రెస్ నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్ర ప్రయోజనాలను జగన్ తాకట్టు పెట్టారని షర్మిల దుయ్యబట్టారు. షర్మిల రేపు ఢిల్లీకి వెళ్తున్నారు. కాంగ్రెస్ పెద్దలతో ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాపై ఆమె చర్చించనున్నారు. ఎల్లుండి అభ్యర్థుల జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే జాబితా సిద్ధమయినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు 1,500 దరఖాస్తులు వచ్చినట్టు షర్మిల ఇంతకు ముందే వెల్లడించారు. అభ్యర్థుల పనితీరుపై సర్వే చేయించి తుది జాబితాను ప్రకటిస్తామని చెప్పారు.

ఆ రెండు పార్టీలు మోదీకి బానిసలు
రాష్ట్రానికి బీజేపీ ఎలాంటి మేలు చేయకపోయినా… వైసీపీ, టీడీపీ ప్రధాని మోదీకి బానిసలుగా మారాయని విమర్శించారు. ఏపీలో ఆ రెండు పార్టీలు బీజేపీకి తొత్తులుగా తయారయ్యాయని అన్నారు. చంద్రబాబు, జగన్ ఇద్దరూ ఇద్దరేనని… ఒకరిది బీజేపీతో బహిరంగ పొత్తు అయితే, మరొకరిది రహస్య పొత్తు అని ధ్వజమెత్తారు. 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకుని, ఆపై విడిపోయిన చంద్రబాబు, ఇప్పుడు మళ్లీ కలిశాడని ఎద్దేవా చేశారు. ఇక, నిర్మలా సీతారామన్ అయితే జగన్ ను మోదీ దత్తపుత్రుడిగా అభివర్ణించారని షర్మిల వెల్లడించారు.

 

LEAVE A RESPONSE