అన్ని వ్యవస్థలను జగన్‌రెడ్డి ప్రభుత్వం నాశనం చేసింది

– వందల సంఖ్యలో కోర్టు ధిక్కార పిటిషన్లు గాడి తప్పిన పాలనకు నిదర్శనం
– ప్రజలందరూ ఏకమై రాజ్యాంగ విలువల్ని కాపాడుకోవాలి
– రాష్ట్రం ఇప్పుడు ఎందుకు ఇలా అయిపోయింది… ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి?
– ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగలేఖ

తేది : 26.11.2022
బహిరంగ లేఖ
అందరికీ నమస్కారం….
ప్రజలందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతిఒక్కరికీ స్వేచ్ఛ, సమన్యాయం అందించే ఉన్నత లక్ష్యాలతో రూపొందించిన రాజ్యాంగం మనది. ప్రపంచంలో అత్యున్నత రాజ్యాంగాన్ని మనకు అందించిన రాజ్యాంగ రూపకర్తల ఆశయాల అమలుకు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సంకల్పం తీసుకుందాం. రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితుల నేపథ్యంలో రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రజలకు ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను.

‘‘రాజ్యాంగం ఎంత మంచిదైనా దాన్ని అమలు చేసే పాలకుడు చెడ్డవాడు అయితే అది చెడ్డ ఫలితాలనే ఇస్తుంది. రాజ్యాంగం ఎంత చెడ్డదైనా దాన్ని అమలు చేసే పాలకుడు మంచివాడు అయితే అది మంచి ఫలితాలు ఇస్తుంది’’ అని డా.బి.ఆర్‌. అంబేడ్కర్‌ 1949లో రాజ్యాంగ సభలో అభిప్రాయపడ్డారు. ఆయన నాడు చేసిన వ్యాఖ్యలు జగన్‌ రెడ్డి లాంటి చెడ్డ పాలకులు భవిష్యత్తు లో వస్తారని ముందే ఊహించి చెప్పి ఉంటారు. నేడు ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా పాలన జరుగుతోంది. అధికారంలో ఉన్నామని, తామేం చేసినా చెల్లుతుందనే అహంకారంతో వ్యవహరిస్తున్నారు. రాజ్యాంగ విలువల్ని పాటించడంలేదు. రాజ్యాంగ నియమాలను తుంగలో తొక్కుతూ ప్రజల హక్కులు, స్వేచ్ఛను హరిస్తున్నారు.

ప్రజాస్వామ్య దేశంలో నియంతృత్వ పోకడలతో జగన్‌రెడ్డి పాలన సాగిస్తున్నారు. ప్రభుత్వ టెర్రరిజంతో రాష్ట్రంలో ఆరాచక, ఆటవిక పాలన సాగుతోంది. ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రశ్నించినా…పాలకులు, పాలనను విమర్శించినా ప్రజలు, రాజకీయ పార్టీలపై అక్రమ కేసులు పెడుతూ వేధిస్తున్నారు. ప్రజా సమస్యలపై రాజకీయ పక్షాలు నిరసనలు తెలిపే హక్కు కూడా లేదన్నట్లు అక్రమ కేసులు పెడుతున్నారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ప్రతిపక్ష పార్టీలు నిరసన తెలియజేసే హక్కును హరిస్తున్నారు. కొంతమంది కళంకిత అధికారులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీకి కొమ్ముకాస్తూ తాము ప్రజలకు జవాబుదారీ అనే విషయాన్ని మరచిపోయారు.

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించే చట్టసభలను దూషణలకు, అసత్యాలకు వేదికగా చేశారు. చట్టసభల గౌరవాన్ని తగ్గించారు. ప్రతిపక్షాలనే కాకుండా మీడియా, న్యాయ వ్యవస్థలపైనా దాడికి దిగుతున్నారు. న్యాయమూర్తులపై ఆరోపణలు చేసే స్థితికి వైసీపీ నాయకులు తెగించారు. అలాంటివారిని వైసీపీ ప్రభుత్వ పెద్దలే రక్షించి, ప్రోత్సహించే పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. ఫోర్త్‌ ఎస్టేట్‌గా ఉన్న మీడియాను సైతం చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు రాజద్రోహం వంటి కేసులు పెడుతున్నారు. మీడియా ఛానళ్ల ప్రసారాలు నిలిపివేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారు.

రాష్ట్రంలోఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలపై దాడులు పెరిగిపోయాయి. బడుగు, బలహీన వర్గాలపై శిరోముండనాలు, హత్యాయత్నాలు, అక్రమ కేసులు నాటి నాజీ పాలనను గుర్తుకు తెస్తున్నాయి. మాస్క్‌ అడిగిన దళిత డాక్టర్‌ సుధాకర్‌ను నర్సీపట్నంలో ఎలా వేధించి చంపేశారో… న్యాయం అడిగిన అబ్దుల్‌ సలాంను నంద్యాలలో ఎలా బలితీసుకున్నారో… తమను ప్రశ్నించిన సొంత పార్టీ లోక్‌సభ సభ్యుడు రఘురామకృష్ణంరాజును అక్రమ కేసులతో కస్టడీలో ఎలా చిత్రహింసలకు గురిచేశారో మీరంతా చూశారు. 42 నెలల్లో ప్రభుత్వ విధానాలకు సంబంధించి దాదాపు 330 పైగా కేసుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు తీర్పులు రావడం ప్రజా వ్యతిరేక పాలనకు అద్దం పడుతోంది. వందల సంఖ్యలో కోర్టు ధిక్కార పిటిషన్లు గాడి తప్పిన పాలనకు నిదర్శనం.

రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా పలువురు అధికారులు కోర్టు బోనులో నుంచోవాల్సిన దుస్థితి గతంలో ఎప్పడూ లేదు. రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా లక్షల కోట్ల అప్పులు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. రాష్ట్ర భవిష్యత్‌కు ఇది అత్యంత ప్రమాదకరం, గొడ్డలిపెట్టు. ఇలా అన్ని వ్యవస్థలను ఈ ప్రభుత్వం నాశనం చేసింది.

ఒకప్పుడు అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల్లో దేశంలోనే ముందున్న రాష్ట్రం ఇప్పుడు ఎందుకు ఇలా అయిపోయింది… ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి? ప్రజలంతా ఆలోచన చేయాలి. డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగానికి విలువ ఇవ్వకుండా తాము చెప్పిందే రాజ్యాంగం అనే గర్వంతో విర్రవీగుతున్న వైసీపీ నేతలను ప్రజాక్షేత్రంలో శిక్షించి ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరు నడుంబిగించాలి. లేకపోతే వైసీపీ శ్రేణుల ఆకృత్యాలు మీ ఇంటిని చుట్టుముడతాయి. దుర్మార్గులు మీ ఆస్తులను చెరబడతారు. మీ ప్రాణాలకు ముప్పు తీసుకువస్తారు.

నేడు రాష్ట్రంలో జరుగుతున్న రాజ్యాంగ వ్యతిరేక పాలనపై ప్రజలందరూ ఏకమై రాజ్యాంగ విలువల్ని కాపాడుకోవాలి. లేకుంటే రాష్ట్ర భవిష్యత్తు అంధకారమవుతుంది. భారత రాజ్యాంగం అత్యున్నతమైనది. రాజ్యాంగ పరిరక్షణకు, ప్రజల హక్కుల రక్షణ కోసం ప్రతిపక్షపార్టీగా మేము చేసే పోరాటానికి ప్రజలంతా కలిసి రావాలని భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పిలుపునిస్తున్నాం.

ధన్యవాదములతో…
మీ
నారా చంద్రబాబునాయుడు

Leave a Reply