Suryaa.co.in

Andhra Pradesh

శవ రాజకీయాలు చేసింది జగన్ రెడ్డే

-ఇళ్ల వద్దే పెన్షన్లు ఇవ్వాలని ఈసీ చెప్పినా.. సచివాలయాలకు తిప్పారు
-రాబోయే చంద్రబాబు ప్రభుత్వం ఏప్రిల్ 1 నుండి రూ.4000 పింఛన్ ఇంటి వద్దే ఇస్తుంది
– తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు

దర్శిలో పింఛన్ దారులతో జగన్ రెడ్డి డ్రామా, చెప్పించిన అబద్దాలు న భూతో.. నభవిష్యతి అన్నట్లుంది. అధికారంలోకి రాగానే రూ.3000 పెన్షన్ ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక వాయిదాలు పెట్టి ఒక్కో పింఛన్ దారుడికి రూ.32 వేలు ఎగ్గొట్టారు. పెన్షన్‌ను ప్రారంభించిందే తెలుగుదేశం పార్టీ. నాడు ఎన్టీఆర్ రూ.30తో పెన్షన్ ప్రారంభిస్తే, చంద్రబాబు తొలుత రూ.75కి, ఆ తర్వాత రూ.200 నుండి రూ.2000కి పెంచారు.

ధరలు పెంచకుండా చంద్రబాబు రూ.1800 పింఛన్ పెంచారు. టీడీపీ అధికారంలోకి వచ్చే నాటికి 39 లక్షల పెన్షన్లు ఉంటే, ఐదేళ్లలో 21 లక్షల కొత్త పెన్షన్లు ఇచ్చి 2019 నాటికి 54.25 లక్షలకు చేర్చారు. కొత్తగా కిడ్నీ, తలసేమియా, హిజ్రా, మత్స్యకారులు, కల్లుగీత, చేనేత కార్మికులు, డప్పు కళాకారులు, చర్మ కారులకు పెన్షన్లు అమలు చేసి ఆర్ధికంగా తోడ్పాటు అందించారు. జగన్ రెడ్డి ఐదేళ్లలో పెంచింది కేవలం 10 లక్షలు మాత్రమే. ఇలా పెన్షన్ల సంఖ్యపై కూడా మభ్యబెట్టి మోసపూరిత రాజకీయం చేస్తూ ప్రజల్ని ఏమార్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. పింఛన్ దారులపై చిత్తశుద్ధి లేకుండా.. వాలంటీర్లతో రాజకీయం చేస్తున్నారు.

జగన్ రెడ్డి ప్రభుత్వం తిరిగి రాదని తెలిసి ఆయన ఒత్తిడి చేసినా 97% వాలంటీర్లు రాజీనామా చేయమని అడ్డం తిరిగారు. సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్ల వద్దనే పింఛన్లు పంపిణీ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించినా, ఆ విధంగా చర్యలు తీసుకోకుండా, కావాలనే వైసీపీ నేతలతో పింఛన్ దార్లతో ర్యాలీలు చేయించారు. వృద్ధులు, దివ్యాంగులను మండుటెండలో, రోడ్లపై ఊరేగింపులు చేశారు. వాలంటీర్లు లేకపోతే అసలు ప్రభుత్వ యంత్రాంగం ఏమీ చేయలేదనేలా అబద్దపు ప్రచారం చేస్తున్నారు.

ఎన్నికల కమిషన్ మొట్టికాయలు వేయడంతో సచివాలయ సిబ్బందితో రెండు రోజుల్లోనే పింఛన్ల పంపిణీ పూర్తి చేశారు. అదే పని ముందే ఎందుకు చేయలేదు? రూ.13 వేల కోట్ల ప్రభుత్వ నిధులు సొంత వారికి దోచిపెట్టడంతో ఖజానాలో నిధులు లేకపోవడం వల్లనే ఒకటో తేదీన పింఛన్లు ఇవ్వలేదు. 3వ తేదీన అప్పు తెచ్చి 4వ తేదీన పింఛన్లు ప్రారంభించారు. వాలంటీర్లను ఎన్నికల సంఘం ఎందుకు పక్కన పెట్టిందో సమాధానం చెప్పకుండా, తప్పుదోవ పట్టించి ప్రజల్ని ఏమార్చే ప్రయత్నం చేయడానికి జగన్ రెడ్డి సిగ్గుపడాలి.

అనారోగ్యంతో చనిపోయిన వృద్ధురాలితో జగన్ రెడ్డి రాజకీయం చేయబోతే ప్రజలు చీవాట్లు పెట్టి మంత్రి జోగి రమేష్‌ను తరిమికొట్టారు. రాబోయే చంద్రబాబు ప్రభుత్వం ఏప్రిల్, మే, జూన్ మూడు నెలల పింఛన్‌ను పెంచిన మొత్తంతో కలిపి జులైలో రూ.7000 ఇంటి వద్దనే అందించబోతున్నారు. జగన్ రెడ్డి మొసలి కన్నీరు, అబద్దపు ప్రచారాలను పింఛన్ దారులు నమ్మనందునే వైసీపీ శవ రాజకీయాలను తిప్పికొట్టారు. జగన్ రెడ్డి శవ రాజకీయాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందిగా విజ్ఞప్తి.

LEAVE A RESPONSE