Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డి.. విద్యారంగాన్ని నిజంగా ఉద్ధరిస్తే,ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి

-సమాధానం చెప్పే ధైర్యం జగన్ రెడ్డికి సాక్షి మీడియాకు ఉందా?
-జగన్ రెడ్డి విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసి నాలుగున్నరేళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల జీవితాల్ని రోడ్డున పడేశాడు రాష్ట్ర విద్యారంగాన్ని జగన్ నిజంగా ఉద్ధరిస్తే, తాము లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి
-కే.ఎస్.జవహర్ (మాజీ మంత్రి), గురజాల మాల్యాద్రి (టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి)

అల్లూరి జిల్లా చింతపల్లిలో విద్యార్థులకు ట్యాబుల పంపిణీ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి రాజకీయ విద్వేష ఉపన్యాసం చేయడం విద్యాసంస్థల్ని దుర్వినియోగం చేయడం కాదా అని, తాము అడిగే కింది ప్రశ్న లకు సమాధానం చెప్పే ధైర్యం జగన్ రెడ్డికి సాక్షి మీడియాకు ఉందా అని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి గురజాల మాల్యాద్రి నిలదీశారు.

మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం మాజీ మంత్రి జవహర్ తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు వారి మాటల్లోనే …

తాము అడిగే ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం ఈ ముఖ్యమంత్రికి, సాక్షి మీడియాకు ఉన్నాయా?

1 గత ఏడాది కంటే ఈ సంవత్సరం విద్యార్థులకు అందించే ట్యాబుల్లో 25,379 ట్యాబులు కోత పెట్టింది నిజం కాదా?
2. బహిరంగ మార్కెట్లో ఒక్కో ట్యాబ్ ధర రూ.11,200లు మాత్రమే ఉంటే, ఒక్కో ట్యాబ్ రూ.15,500లకు కొన్నట్టు లెక్కలుచూపించి, గడచిన రెండేళ్లలో రూ.470కోట్లు కమీషన్లు కొట్టేసింది వాస్తవం కాదా?
3.నాడు-నేడు పేరుతో, ప్రభుత్వ పాఠశాలలకు రంగులేసే నెపంతో..ఇతర పనులు చేసినట్టు చెప్పి రూ.3వేలకోట్లు కొట్టేసింది నిజం కాదా?
4. పాఠశాల ప్రాంగణాల్లో రైతుభరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి, హైకోర్టుతో ప్రభుత్వం మొట్టికాయలు వేయించుకున్నది నిజం కాదా?
5. అధికారంలోకి వస్తే ఏటా డీఎస్సీ నిర్వహిస్తానని చెప్పి, ముఖ్యమంత్రి అయ్యాక జగన్ మాట తప్ప లేదా?
6. చంద్రబాబునాయుడి ప్రభుత్వం 5 ఏళ్లల్లో 2 డీఎస్సీలు నిర్వహించి 18వేల ఉపాధ్యాయ నియామకాలు పూర్తిచేసింది నిజం కాదా? నాలుగున్నరేళ్లలో జగన్ ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా భర్తీ చేయంది వాస్తవం కాదా?
7. చంద్రబాబు బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు ఏర్పాటుచేసి, 2,45,000 మంది ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైనవిద్యను అందిస్తే.. జగన్ రెడ్డి ఆ పథకాన్నే రద్దు చేసింది నిజం కాదా?
8. ఎయిడెడ్ విద్యాసంస్థల భూముల్ని కొట్టేయడం కోసం, ఆ సంస్థల్నే ఈ ముఖ్య మంత్రి నిర్వీర్యం చేసింది నిజం కాదా?
9. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్నభోజన పథకం రద్దు చేసింది నిజం కాదా?
10. ఐదు కొత్త మెడికల్ కాలేజీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు చెందిన 160 160 వైద్య విద్యసీట్లను ఓపెన్ కేటగిరిగి మార్చి, కోట్లరూపాయలకు అమ్ముకుంది నిజం కాదా?
11. ఫీజు రీయింబర్స్ మెంట్ చంద్రబాబు 16లక్షల మంది విద్యార్థులకు అందిస్తే, దాన్ని 9.86లక్షల మందికి.. అంటే, 6లక్షల మందికి కోత కోసింది నిజం కాదా?
12. జీవోనెం-1 ద్వారా గిరిజనప్రాంతాల్లో పనిచేసే ఎస్టీ ఉపాధ్యాయులకు అన్యాయం చేసింది నిజం కాదా?
13. రాష్ట్రంలో 84 లక్షల మంది విద్యార్థులుంటే, కేవలం 44 లక్షల మందికే అమ్మఒడి ఇస్తున్నది నిజం కాదా? ఒక్కొక్కరికి రూ.15వేలు ఇస్తామని, రూ.13వేలకు తగ్గించి, మాటతప్పింది వాస్తవం కాదా?
14. విశ్వవిద్యాలయాల్లో చంద్రబాబునాయుడు ప్రొఫెసర్లు.. అసోసియేట్ ప్రొఫెసర్ల నియామకాలు 1385 వరకు చేపడితే, జగన్మోహన్ రెడ్డి నాలుగున్నరేళ్లల్లో ఒక్క నియామకం చేపట్టకుండా విశ్వవిద్యాలయాలను రాజకీయ కలుషిత కేంద్రాలుగా మార్చింది నిజం కాదా?
15. ఉపాధ్యాయ, లెక్చరర్, ప్రొఫెసర్ల పోస్టులు భర్తీ చేయకుండా, ఫీజు రీయింబర్స్ మెంట్ సకాలంలో సరైన రీతిలో ఇవ్వనందున రాష్ట్రంలో విద్యాప్రమాణాలు దిగజారింది నిజం కాదా?
16. నీతి అయోగ్ నివేదిక ప్రకారం నాణ్యమైన విద్యలో చంద్రబాబు హయాంలో 3వ స్థానంలో ఉన్న ఏపీ, నేడు 19వ స్థానానికి పడిపోయింది వాస్తవం కాదా?
17. 2022-23కి గాను కేంద్రం విడుదల చేసిన ‘ఫౌండేషనల్ లెర్నింగ్ మరియు న్యూమరసీ నివేదిక’ ప్రకారం దేశంలో ఏపీ 29వ స్థానంలోకి దిగజారిందనేది నిజం కాదా?
18. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ‘ఆరా’ సంస్థ నివేదిక ప్రకారం 8వ తరగతి విద్యార్థులు 2వ తరగతి లెక్కలు కూడా చేయలేకపోతున్నారని వెల్లడి కాలేదా?
19. పదవ తరగతి ఫలితాల్లో ఐదేళ్ల టీడీపీ పాలనలో సరాసరి ఉత్తీర్ణతాశాతం 92.9 శాతముంటే, అది నేడు 66.76శాతానికి దిగజారింది నిజం కాదా?
20. ప్రభుత్వ పాఠశాలల నుంచి .750లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు తరలిపోయింది నిజం కాదా?
21. దాదాపు 60వేల మంది ఇంజనీరింగ్, వగైరా కోర్సుల విద్యార్థులు నాణ్యమైన విద్యకోసం పొరుగురాష్ట్రాలకు తరలిపోయింది నిజం కాదా?
22. చంద్రబాబు ప్రభుత్వం తక్కువ ఖర్చుతో 7,500 పాఠశాలల్లో ఫైబర్ గ్రిడ్ ఏర్పాటు చేయడం వల్లే నేడు డిజిటల్ విద్యకు దోహదపడిందనేది నిజం కాదా? ఇంగ్లీష్ మీడియాన్ని కూడా మొదట పైలెట్ ప్రాజెక్ట్ గా మున్సిపల్ పాఠశాలల్లో మొదట ప్రవేశపెట్టింది చంద్రబాబు ప్రభుత్వం కాదా?23. గురుకుల పాఠశాలలు, బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు, 22 మెడికల్ కాలేజీలు 350కి పైగా ఇంజనీరింగ్ కాలేజీలు, 12 కేంద్రీయ విద్యాసంస్థలు స్థాపించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను ఉన్నత స్థానాలకు పంపిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానిది కాదా?

విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసి.. కమీషన్ల కోసం పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడి నాలుగున్నరేళ్లలో ప్రాథమిక విద్య మొదలు కళాశాల విద్యవరకు సర్వనాశనం చేశాడు. విద్యాసంస్థలను రాజ కీయ కార్యకలాపాలకు కేంద్రాలుగా మార్చి, విషపూరిత ప్రసంగాలు చేస్తూ.. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నది నిజం కాదా? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఈ నాలుగున్నరేళ్లలో జగన్ చేసిన అపకారాన్ని కళ్లకు కట్టినట్టు ప్రజలకు తెలియచేస్తున్న ప్రజా మీడియాపై అక్కసు వెళ్లగక్కినంత మాత్రాన జగన్ రెడ్డి చేసిన దుర్మార్గాలు బయటపడకుండా పోవు. తాము లేవనెత్తిన ప్రశ్నలకు జగన్మోహన్ రెడ్డిగానీ.. ఆయన సాక్షి మీడియాగానీ సమాధానం చెప్పగలవా?” అని గురజాల మాల్యాద్రి నిలదీశారు.

చంద్రబాబు హయాంలో దేశంలో ప్రథమస్థానంలో ఉన్న రాష్ట్ర విద్యారంగం నేడు అథమస్థాయికి పడిపోవడానికి కారణం జగన్ రెడ్డి అవినీతే : జవహర్
“రాష్ట్ర విద్యావ్యవస్థ జగన్ రెడ్డి హయాంలో ప్రయోగశాలగా మారింది. ఆ ప్రయోగశాల కూడా రాబోయే తరానికి శాపంగా తయారవ్వడం నిజంగా బాధాకరం. చంద్రబాబు హయాంలో దేశంలో ప్రథమస్థానంలో ఉన్న రాష్ట్ర విద్యారంగం.. నేడు జగన్ పాలనలో అథమస్థానానికి పడిపోవడానికి కారణం.. ఆయన అవినీతే.

జగన్ అధికారంలోకి వచ్చీరావడంతోనే 1964 కొఠారి కమిషన్ సిఫార్సులు పట్టించుకోకుండా.. నూతనవిద్యా విధానం పేరుతో గ్రామాలకు విద్యార్థులు దూర మయ్యే పరిస్థితి తీసుకొచ్చాడనే వాస్తవాన్ని ప్రజలు తెలుసుకోవాలి.

దేశమంతా తిరస్కరించిన నూతన విద్యావిధానాన్ని రాష్ట్రంలో ఎందుకు అమలు చేస్తున్నాడో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి
ట్యాబ్ ల పంపిణీ పేరుతో జగన్ రెడ్డి .. తానే రాష్ట్ర విద్యారంగాన్ని ఉద్ధరించినట్టు మాట్లాడాడు. దేశంలో ఏ రాష్ట్రం అమలుచేయని నూతన విద్యావిధానాన్ని ఏపీలో తాను మాత్రమే ఎందుకు అమలుచేస్తున్నాడో జగన్ సమాధానం చెప్పాలి.

అధికారంలోకి రాకముందు 26వేల ఉపాధ్యాయ పోస్టుల్ని భర్తీచేస్తానని ప్రగల్భాలు పలికిన జగన్.. ఈరోజుకి ఒక్క పోస్టు కూడా ఎందుకు భర్తీచేయలేదో చెప్పాలి. రాష్ట్రంలో 9వేల ఏకోపాధ్యాయ పాఠశాలలుంటే… ఒక్కో ఉపాధ్యాయుడు అన్ని తరగతుల విద్యార్థులకు.. అన్నిరకాల పాఠాలు చెప్పడం ఎలా సాధ్యమవుతుందో జగన్ చెప్పాలి.

ప్రాథమికవిద్య.. ప్రాథమికోన్నత విద్య…ఉన్నత విద్యకు బొత్సకు తేడా తెలియద ని ఆయన మాటల్ని బట్టే అర్థమవుతోంది
ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్థులు 98మంది కంటే తక్కువ ఉంటే సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయుల్ని నియమించలేమని చెబుతున్న మంత్రి బొత్స మాటలు వింటే.. ప్రాథమికవిద్యకు, ప్రాథమికోన్నత విద్యకు, ఉన్నత విద్యకు ఆయనకు తేడాతెలియదని అర్థమవుతోంది. విద్యాశాఖ మంత్రికి ఆయన శాఖలో జరుగుతున్న మార్పులు.. విద్యార్థులు, ఉపాధ్యాయులు పడు తున్న పాట్లు తెలియవని అర్థమవుతోంది.

తరగతి గదిలో విద్యార్థుల ఎదుట ఉపాధ్యాయుడు ఉంటేనే వారికి మెరుగైన విద్య లభిస్తుంది తప్ప… బైజూస్ పేరుతో ట్యాబ్ లు అందిస్తేనే.. కంప్యూటర్లపై రికార్డెడ్ పాఠ్యాంశాలు బోధిస్తేనో నాణ్యమైన విద్య అందదనే వాస్తవాన్ని మంత్రి గ్రహించాలి. విద్యార్థులు టీవీ చూస్తూ విద్యను అభ్యసించడం కష్టమని తెలుసుకోవాలి. గురుకుల పాఠశాలల్లో 8, 9 తరగతులకు సీబీఎస్ఈ సిలబస్ బోధిస్తూ.. 10వ తరగతికి స్టేట్ సిలబస్ బోధించడం ఏమిటో ..ఈ విధమైన బోధనకు ఉపాధ్యాయుడు సిద్ధంగా ఉన్నాడా.. విద్యార్థులు గ్రహిస్తున్నారా ..లేదా అనే ఆలోచన ఈముఖ్యమంత్రి, మంత్రి బొత్స చేయక పోవడం నిజంగా దురదృష్టకరం.

నాడు-నేడు పథకంతో విద్యారంగం బాగుపడితే….3, 5, 8వ తరగతి విద్యార్థుల పరిణితి..గ్రాహకశక్తి తగ్గిందంటున్న, నేషనల్ ఎఛీవ్ మెంట్ సర్వేపై జగన్ సమాధానం చెప్పాలి
జగన్ సర్కారు గొప్పలు చెబుతున్న నాడు-నేడు పథకంపై నేషనల్ ఎఛీవ్ మెం ట్ సర్వే ఆసక్తికర విషయాలు వెల్లడించింది. జాతీయస్థాయిలో 3వ తరగతి విద్యార్థుల పరిణితి, విద్యాభ్యాసంపై వారిగ్రాహాక శక్తి 59శాతముంటే, ఏపీలో మాత్రం అది 54 శాతానికే పరిమితమైంది. 5వ తరగతి విద్యార్థుల్లో దేశస్థాయిలో అది 49శాతం ఉంటే, మనరాష్ట్రంలో మాత్రం 43శాతానికే పరిమితం. 8వ తరగతి విద్యార్థుల్లో జాతీయస్థాయిలో అది 42 శాతముంటే, ఏపీలో 38 శాతమే ఉంది.

రాష్ట్ర విద్యావ్యవస్థ దేశంలో 3వ స్థానంలో నిలవడానికి కారణం…గతంలో చంద్రబాబు ముందుచూపుతో తీసుకున్న నిర్ణయాలు
చంద్రబాబు హాయాంలో రాష్ట్ర విద్యావ్యవస్థ దేశంలో 3వ స్థానంలో ఉండటానికి కారణం ఆనాడు ఆయన తీసుకున్న చర్యలు.. ముందుచూపు నిర్ణయాలు. 17వే లకు పైగా ఉపాధ్యాయుల్ని నియమించడం.. డిజిటల్ తరగతి గదుల ఏర్పాటు వంటి నిర్ణయాలతో విద్యారంగాన్ని చంద్రబాబు బలోపేతం చేశారు. జగన్ పాలనలో రాష్ట్ర విద్యావ్యవస్థ 19వ స్థానానికి దిగజారడాన్ని బట్టే.. ఆయన విద్యా రంగాన్ని సర్వనాశనం చేశాడని చెప్పొచ్చు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్. తన తల్లి, భార్యను రోడ్లపైకి పంపి అమ్మఒడి ప్రతి బిడ్డకు అందిస్తామని వారితో చెప్పించి.. తల్లుల్ని వంచించాడు. 5 ఏళ్లల్లో జగన్ మూడుసార్లు మాత్రమే అమ్మ ఒడి ఆర్థిక సాయం అందించాడు. దానిలో కూడా కోతలు పెట్టాడు.

చంద్రబాబుపై అక్కసుతో టీడీపీ ప్రభుత్వంలో సమకూర్చిన సైకిళ్లు వారికి అందించకుండా బాలికల్ని విద్యకు దూరం చేశాడు
అమరావతిపై తనకున్న కోపాన్ని జగన్ విద్యాసంస్థలపై చూపడంతో కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థలు.. అమృత్ వంటి విద్యాలయాలు రాష్ట్రం వదిలి వెళ్లిపోయాయి. ఆఖరికి చంద్రబాబు విద్యార్థినులకు ఇవ్వాల్సిన సైకిళ్లను కూడా పనికిరాకుండా చేసి జగన్ వాటిని మూలన పడేశాడు. చంద్రబాబుపై అక్కసుతో బాలికల్ని ప్రాథమిక విద్యకు దూరం చేశాడు. ఉపాధ్యాయులపై పని భారం పెం చాడు. వారంలో 48 గంటల పాటు వారు విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధిస్తు న్నారు. దేశంలో ఎక్కడా 36 గంటలకు మించి బోధన లేదు.

ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన డీఏలు.. ఇతర ఎరియర్స్ అన్నీ బకాయి పెట్టాడు. యాప్ ల పేరుతో వారిని వేధిస్తూ.. అటు బోధనకు దూరంచేశాడు. రాష్ట్రంలో 50వేలకు పైగా ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయని కేంద్రం చెబితే.. జగన్ ఈ నాలుగున్నరేళ్లలో ఒక్క ఖాళీ కూడా భర్తీచేయలేదు. కేవలం కమీషన్లు వచ్చే అంశాలకు మాత్రమే జగన్ ప్రాథాన్యత ఇస్తూ.. విద్యావ్యవస్థను నీరుగార్చాడు.” అని జవహర్ స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE