జే ట్యాక్స్ సొమ్మును ఢిల్లీకి తరలించే కుంభకోణానికి కర్త, కర్మ, క్రియ జగన్ రెడ్డే

– ధనదాహానికి అల్లుడిని కూడా బలి చేసిన వ్యక్తి విజయసాయిరెడ్డి
– ఎథిక్స్ కమిటీ నుంచి విజయసాయిరెడ్డిని వెంటనే తొలగించాలి
– టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణా రెడ్డి

రాష్ట్రంలో అడ్డగోలుగా వసూలు చేస్తున్న జే ట్యాక్స్ సొమ్మును ఢిల్లీకి తరలించే కుంభకోణానికి కర్త, కర్మ, క్రియ జగన్ రెడ్డేనని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణా రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు యధాతథంగా…

ఆంద్రప్రదేశ్ లో అక్రమంగా ఇసుక, మద్యం ద్వారా సంపాదిస్తున్న అక్రమ సొమ్ము మొత్తాన్ని ఇతర రాష్ట్రాల్లో తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు పెట్టుబడిగా పెట్టిన విషయం ఢిల్లీ మద్యం కుంభకోణంతో బట్టబయలైంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అడ్డంగా దొరికిన ట్రైడెంట్ ఛాంపర్, శ్రీ అవంతిక కనస్ట్రక్షన్స్ రెండింటికీ సంబంధం లేదని చెప్పే దమ్ము, ధైర్యం జగన్ రెడ్డికి ఉన్నాయా? శ్రీ అవంతిక కనస్ట్రక్షన్స్ రాష్ట్రంలో ఇసుక కాంట్రాక్టులు దక్కించుకున్నది వాస్తవం కాదా? ట్రైడెంట్ ద్వారా క్విడ్ ప్రో కో 1లో రూ.70 కోట్లు జగన్ రెడ్డికి చెందిన జగతి పబ్లికేషన్స్ లో పెట్టుబడులుగా పెట్టారు. ఈ ట్రైడెంట్ ఛాంపర్ ను విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు పెనాక శరత్ చంద్రారెడ్డి, అల్లుడు పెనాక రోహిత్ రెడ్డిలు స్థాపించడం నిజం కాదా? ఇందులో మెజార్టీ షేర్ హోల్డర్స్ వీరిద్దరే అనేది నిజం కాదా?

ఏపీలో నూతన మద్యం పాలసీ ప్రకటించిన తర్వాత ఆదాన్ డిస్టిలరీస్ కంపెనీ పెట్టి మద్యం అక్రమ దందాకు జగన్ రెడ్డి తెరలేపారు. ఒక్క సీసా ఉత్పత్తి చేసే సామర్ధ్యం కూడా లేని ఆదాన్ కు మూడున్నరేళ్లలో రూ.2400 కోట్ల విలువైన కాంట్రాక్టులు ఇవ్వడం లోపాయికారి ఒప్పందం కాదా? అదాన్ లో డైరెక్టర్లుగా ఉన్న కాశీచాయనుల శ్రీనివాస్, ముప్పిడి అనిరుధ్ రెడ్డి విజయసాయిరెడ్డి సన్నిహితులు కాదా? కాశీచాయనుల శ్రీనివాస్ ట్రైడెంట్ చాంపర్ లో కూడా డైరెక్టర్ గా ఉన్నారు. అదాన్ లో మరో డైరెక్టర్ ముప్పిడి అనిరుద్ రెడ్డి జగన్ రెడ్డి ఐటీ సలహాదారులు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి తోడల్లుడు అనేది నిజం కాదా? కాశీచాయనుల శ్రీనివాస్ ఆదాన్ డిస్టలరీకి రూ.10 కోట్లు రుణం ఇచ్చే స్థోమత ఎక్కడిది? ఆ నిధులు ఎక్కడి నుండి వచ్చాయన్నదీ విచారించాలి. అదాన్ డిస్టిలరీకి జీఎస్టీ ఉండదు, బిల్లులు ఇవ్వరు.

అదాన్ కంపెనీ నుండే రాష్ట్రంలో, దేశంలో లిక్కర్ స్కామ్ జరుగుతోంది. ఒకవైపు దొంగ లిక్కర్ అమ్ముతూ ఆ సొమ్మును ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడిగా పెడుతున్నారు. ఎంపీ విజయసాయిరెడ్డికి, అరబిందో కుటుంబానికి ఉన్న సంబంధం అందరికీ తెలిసిందే. విజయసాయిరెడ్డి కుటుంబానికి చెందిన పెనాక శరత్ చంద్రా రెడ్డి, పెనాక రోహిత్ రెడ్డిలు అరబిందో ఫార్మాలో హోల్ టైం డైరెక్టర్లు. వైఎస్ కుటుంబానికి అరబిందో కుటుంబానికి 15 సంవత్సరాల నుండి సంబంధాలున్నాయి. జగన్ రెడ్డి క్విడ్ ప్రోకో కేసులో సాక్షి పేపర్, భారతి సిమెంట్స్ కంపెనీకి అక్రమ నగదు లావాదేవీలు జరిపాయనిఅరబిందో సంస్థపై సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేశాయి.

దేశంలో వెలుగులోకి వచ్చిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ మొత్తం తాడేపల్లి ప్యాలెస్ నుండే జరుగుతోంది. . ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో పట్టుబడిన వారంతా ఆంధ్రావారే. అదాన్ డిస్టలరీ ద్వారా వేల కోట్లు ఢిల్లీకి తరలి వెళ్తోంది. దేశ వ్యాప్తంగా చిన్న పానీపూరీ బండి నుండి.. పెట్రోల్ బంకుల వరకు అందరూ డబ్బు వద్దు, క్యాష్ లెస్ ముద్దు అంటే జగన్ రెడ్డి మాత్రం డబ్బే ముద్దంటూ ఇసుక మద్యంలో నగదు లావాదేవీలు నిర్వహిస్తూ జే- ట్యాక్స్ ద్వారా మూడుననరేళ్లలో మూడున్నర లక్షల కోట్లు సంపాదించాడు. మాఫియా డాన్ జగ్గుభాయ్(జగన్) వద్ద ఉన్న మూడున్నర లక్షల కోట్ల అవినీతి సొమ్మును బయటికి తీసి ప్రజలకు పంచాలి.

నీతి, నిజాయితీ, విలువలు కలిగిన వ్యక్తుల్ని ఎథిక్స్ కమిటీలో వేస్తారు. మనీ లాండరింగ్, చీటింగ్ సహా అనేకానేక ఆర్ధిక అవకతవకల కేసుల్లో సీబీఐ, ఈడీకి సంబంధించి దాదాపు 14 కేసులు ఎదుర్కొంటున్న విజయసాయిరెడ్డి లాంటి ఎథిక్స్ లేని వ్యక్తిని ఎథిక్స్ కమిటీలో వేయడమే సిగ్గుచేటు. విజయసాయిరెడ్డిని ఎథిక్స్ కమిటీ నుంచి వెంటనే తొలగించాలి. విజయసాయిరెడ్డికి కుటుంబంతో సంబంధాలుండవు. కూతురితో సంబంధం ఉండదు. ఆమె అడ్డగోలుగా దక్కించుకున్న ఆస్తులతో సంబంధం ఉండదు. కేవలం డబ్బుతోనే సంబంధాలుంటాయి.

తన ధనదాహానికి అల్లుడిని కూడా బలి చేసిన వ్యక్తి విజయసాయిరెడ్డి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి ఏపీకి సంబంధం లేదని సజ్జల అనడం గుమ్మడికాయ దొంగ భుజాలు తడుముకోవడమే.. స్కామ్ ల వల్ల వచ్చిన కలెక్షన్ చూసుకోవడానికే సజ్జల ఉన్నాడు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై సీబీఐ దర్యాప్తు జరిపితే తాడేపల్లి స్కాం బయటపడుతుంది. వైసీపీ నాయకులంతా ఖాళీ అయిపోయినా ఆశ్చర్యపోనవసరంలేదు.

జగన్ రెడ్డి లిక్కర్ మాఫియా ఏపీ టు డిల్లీ వయా తాడేపల్లి మీదుగా వెళుతోంది. ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసినవారందరినీ అరెస్టు చేయాలి. డీల్లీ లిక్కర్ స్కాంలో జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డే ప్రధాన పాత్రధారులు. విజయసాయిరెడ్డి ఢిల్లీలో కూర్చొని మొత్తం కథ నడిపిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ లిక్కర్ స్కాంపై దృష్టి సారించాలి.

అరబిందో శరత్ రెడ్డితో విజయసాయి రెడ్డిక సంబంధం లేదని వైసీపీ నేతలు చెప్పడం హాస్యాస్పదం. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఉన్నపళంగా రామాయపట్నం పోర్టు, సోలార్ పార్క్, కాకినాడ సెజ్, డీప్ సీ పోర్టు, రాష్ట్ర వ్యాప్తంగా అంబులెన్సుల నిర్వహణ కాంట్రాక్టు వంటివన్నీ అరబిందో కంపెనీకి చెందడం వెనుక విజయసాయిరెడ్డి ప్రలోభాలు లేవని చెప్పగలరా?

సజ్జల రామకృష్ణారెడ్డి ఒక దబేదారు, సాక్షిలో ఓ ఉద్యోగి. సీబీఐ విచారణ జరిపితే.. దందా మొత్తం నడిపిస్తున్న దొంగలు బయటపడతారు. ఈ వ్యవహారంలో భాగస్వాములుగా ఉన్న ముగ్గురు ఎంపీల గుట్టు రట్టవుతుంది. హెరిటేజ్ ను నడిపే బ్రాహ్మణిగారి గురించి మాట్లాడుతారు. అక్రమ పెట్టుబడులు, అడ్డగోలు నిధుల మళ్లింపుతో నడిపిస్తున్న సిమెంటు ఫ్యాక్టరీలు, సాక్షి పత్రికను నడిపే భారతి గురించి మాట్లాడితే ఆమె హౌస్ వైఫ్ అంటూ కేసులు పెట్టడానికి ఏపీ పోలీసులు సిగ్గుపడాలి.

తాడేపల్లి నుంచి ప్రారంభమై ఢిల్లీ వరకు విస్తరించిన జగన్ రెడ్డి అక్రమ లిక్కర్ స్కామ్ పై సీబీఐ దర్యాప్తు జరపాలి. ఒక్కొక్కరి బండారం బయటపెట్టాలి. అదాన్ డిస్టలరీలో జగన్ రెడ్డికి, విజయసాయిరెడ్డికి, పెనాక శరత్ చంద్రారెడ్డి వాటాల లెక్కలు బట్టబయలు చేయాలి. మోడీ వైజాగ్ కు రాగానే మోడీ కాళ్లు పట్టుకోవడానికి ఇద్దరు వ్యక్తులు సిద్ధంగా ఉన్నారు. వీరు చేసే యాక్షన్ కు, దొంగ సినిమా డ్రామాలకు మోడీ లొంగకూడదు.

ఆలస్యం చేయకుండా వెంటనే సీబీఐ ఎంక్వైరీ వేయాలి. తెలుగుదేశం పార్టీ తరపున ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తూ కార్యకర్తలు, నాయకులు కష్టపడి లిక్కర్ స్కామ్ ను బయటికి తీసినవారికి ధన్యవాదాలు. నీతి, నిజాయితీ, ధర్మం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. జగన్ రెడ్డి తన అధికార బలంతో పెట్టే తప్పుడు కేసులకు టీడీపీ కార్యకర్తలు, నాయకులు భయపడేదే లేదు అని ఆనం వెంకట రమణా రెడ్డి పేర్కొన్నారు.

Leave a Reply