Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డి ధన దాహానికి సహకార రంగం బలి

• రూ.1000కోట్ల సొసైటీల సొమ్ము ముఖ్యమంత్రి ఖజానాకు చేరింది
• కోర్టులు చెప్పినా వినకుండా.. ఓటమి భయంతో సహాకార సంఘాల ఎన్నికలు నిర్వహించకుండా జగన్ రెడ్డి నచ్చిన వారిని నామినేట్ చేసి, తన దోపిడీని కొనసాగిస్తున్నాడు
• టీడీపీ-జనసేన గెలుస్తాయన్న భయంతోనే ఎన్నికల నిర్వహణకు జగన్ సాహసించడం లేదు
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి

జగన్ రెడ్డి ధనదాహానికి రాష్ట్ర సహాకార రంగం బలైపోయిందని, తనపార్టీవారు, నచ్చినవారిని సహాకార సంఘాల్లో నామినేట్ చేయడం ద్వారా ముఖ్యమంత్రి రూ.1000కోట్ల సొసైటీ సొమ్ము కాజేశాడని టీడీపీ సీనియర్ నేత, పార్టీ పొలిట్ బ్యూరోసభ్యులు, శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్పారు.

మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

“ జగన్ రెడ్డి ధనదాహానికి సహకార రంగం బలైపోయింది. నిధులు పక్కదారి పట్టించి స్థానిక సంస్థలు సహా, అన్ని వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేసినట్టే ముఖ్యమంత్రి సహకారరంగాన్ని నిర్వీర్యం చేశాడు. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్ లు, అధికారుల్ని నామమాత్రంగా మార్చి స్థానిక సంస్థల్ని నిర్వీర్యం చేసినట్టే, తనకు నచ్చిన వారిని సహకారసంఘాల్లో నియమిస్తూ ఆ వ్యవస్థని కూడా కోలుకోలేని విధంగా దెబ్బతీశాడు. కోర్టులు చెప్పినా, నాలుగేళ్లుగా సహాకా ర సంఘాల్లో ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి.

రాజ్యాంగబద్ధంగా మూడేళ్లకోసారి ఎన్నికలు నిర్వహించాల్సిన సొసైటీ ల్లో, నచ్చినవారిని నామినేట్ చేసి, సహాకార బ్యాంకుల సొమ్ముని దోచేస్తున్నాడు. గోడౌన్ల పేరుతో, ఆర్బీకేల ముసుగులో సొసైటీల నిధుల్ని పక్కదారి పట్టిస్తున్నాడు. జగన్ రెడ్డి నియమించిన వారే సహాకార సంస్థల సొమ్ముని పక్కదారి పట్టిస్తున్నారు. కనీసం ధాన్యం తాలూకా డబ్బులు కూడా రైతులకు చెల్లించకుండా సొసైటీలు నిర్వీర్యం కావడం నిజంగా బాధాకరం. రైతులకు సకాలంలో ఇవ్వాల్సిన లోన్లు, ఇతర సొమ్ము ఇవ్వలేని దుస్థితికి సహకార సంఘాలు రావడానికి కారణం జగన్ రెడ్డి, అతని పరివారం సాగిస్తున్న దోపిడీనే. ఆఖరికి ఈ ముఖ్యమంత్రి సొసైటీల సొమ్ముని కూడా తన రంగులపిచ్చికి తగలే శాడు.

సహకార సంఘాల సొమ్ము రూ.1000 కోట్లు ముఖ్యమంత్రి ఖజానాకు చేరింది
నాలుగున్నరేళ్లలో సహకార సంఘాలు, సొసైటీలలో జరిగిన వ్యవహారాలపై ఆడిటింగ్ జరిపించి, తప్పులు జరిగిన చోట, తప్పుచేసిన వారిపై ముఖ్యమంత్రి ఎందుకు చర్యలు తీసుకోలేదు?న్యాయస్థానాలు చెప్పిన చోట కూడా ముఖ్యమం త్రి ఇంతవరకు విచారణ జరిపించి సొమ్ము తిన్నవారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ముఖ్యమంత్రే దొంగయితే ఇక చర్యలేముంటాయి? అధికారులు ప్రేక్షకపాత్ర పోషిస్తుంటే, ముఖ్యమంత్రి తనకు అందాల్సిన సొమ్ము తనకు అందుతోందని నామినేషన్ల పద్ధతిలోనే కార్యక్రమాలన్నీ జరిపిస్తున్నాడు.

కేంద్ర ప్రభుత్వ సూచనలు కూడా అమలు చేయకుండా, కేంద్రంనిధుల్ని కూడా పక్కదారి పట్టిస్తున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా సహకార రంగంలోని అవకతవకలపై సమగ్ర విచారణ జరగాలి. ఇప్పటివరకు 1000కోట్లరూపాయల సహాకార సంఘాల సొమ్ము ముఖ్యమంత్రి సొంత ఖజానాకు చేరింది. జగన్ నిర్వాకం, సహాకార సొసైటీల నిర్వీర్యంతో రైతులు దారుణంగా నష్టపోయారు. రాష్ట్రవ్యాప్తంగా సహాకారం రంగంలో అవినీతి, అక్రమాలు తప్ప ఏమున్నది గర్వకారణం అనే పరిస్థితి.

నష్టాల్లో ఉన్న 7000లకు పైగా సొసైటీలు మూసేసి కొత్త సొసైటీలు ఏర్పాటుచేస్తానన్నహామీ కూడా జగన్ అమలుచేయలేదు. సహాకార రంగం నిర్వీర్యంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆఖరికి రైతులకు పంటల నష్ట పరిహారం ఇవ్వలేక, ముఖ్యమంత్రి వేలకోట్ల నష్టాన్ని వందలకోట్లుగా తగ్గించి చూపాడు. పాల డెయిరీలను అమూల్ కు కట్టబెట్టి, రాష్ట్ర సంపదను అమూల్ కు దోచిపెట్టిన జగన్ రెడ్డి పాడిరైతుల్ని కూడా మోసగించాడు.

టీడీపీ-జనసేన గెలుస్తాయన్న భయంతోనే జగన్ రెడ్డి ఎన్నికల నిర్వహణకు సాహసించడం లేదు
ఖాళీగా ఉన్న ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో ఎన్నికలు పెట్టడానికి కూడా జగన్ జంకుతున్నాడు.ఓటమి తప్పదన్న భయంతోనే జగన్ రెడ్డి ఎక్కడా, ఎలాంటి ఎన్నికలు నిర్వహించడం లేదు. 151 మంది ఎమ్మెల్యేలు, దాదాపు 30 మంది ఎంపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు అన్నీ తనచేతిలో ఉన్నా జగన్ రెడ్డి సహాకార సంఘాల ఎన్నికలకు ఎందుకు మొగ్గుచూపడు? ఏ విధమైన ఎన్నిక జరిపినా, టీడీపీ-జనసేన గెలుస్తాయన్నభయంతోనే ఎన్నికల నిర్వహణకు జగన్ సాహసించడం లేదు.” అని బుచ్చయ్య చౌదరి ఎద్దేవాచేశారు.

LEAVE A RESPONSE