అక్రమాల్లో మరో మార్గదర్శిలా జగత్ జనని చిట్స్..

– ఆదిరెడ్డి కుటుంబంపై ఎటువంటి రాజకీయ కక్ష లేదు
– మార్గదర్శి అయినా జగత్‌జనని అయినా ప్రభుత్వం దృష్టిలో ఒక్కటే
– ప్రజలకు అన్యాయం జరిగితే.. ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు
-ః ఎంపిలు మార్గాని భరత్, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ స్పష్టీకరణ

ఖాతాదారులు మోసపోకూడదనే ప్రభుత్వ జోక్యం
చిట్‌ఫండ్స్‌ సంస్థలు ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి కమిషన్‌ మాత్రమే తీసుకోవాలని 1982 చిట్‌ ఫండ్‌ నిబంధనలు చెబుతున్నాయి. రోజువారీ డబ్బులు వసూలు చేసిన సొమ్మంతా చిట్‌ఫండ్ చట్టం ప్రకారం జాతీయ బ్యాంకులో డిపాజిట్ చేయాలి. కానీ రాష్ట్రంలో మార్గదర్శిగానీ, రాజమండ్రిలోని జగత్ జననీ చిట్ ఫండ్స్ కంపెనీలు ఆ విధంగా చేయకుండా, నిబంధనలను ఉల్లంఘిస్తూ.. ఖాతాదారుల డబ్బులతో ఇతర వ్యాపారాలు చేస్తున్నాయి. ఇదేవిధంగా, దేశవ్యాప్తంగా ఎన్నో కంపెనీలు బోర్డు తిప్పేశాయి. శారదా చిట్స్‌ వ్యవహారం అయితే పార్లమెంట్‌ను కుదిపేసింది. సహారా సంస్థ ప్రజల సొమ్మును తీసుకెళ్లి వేరేచోట పెట్టుబడులు పెట్టి దుర్వినియోగం చేసింది. సత్యం కంప్యూటర్స్‌ నిధులను భూముల కొనుగోలు చేసి దుర్వినియోగం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో, లక్షలాది మంది ఖాతాదారులు మరోసారి మోసపోకాడనే లక్ష్యంతో.. చేసుకునే పరిస్థితులు వచ్చాయి. అంతెందుకు.. మన రాష్ట్రంలో కూడా అగ్రిగోల్డ్ సంస్థ అధిక వడ్డీ ఆశ చూపి ప్రజలను నట్టేట ముంచింది. ఇలాంటి స్కాంల వల్ల ప్రజలు నష్టపోతున్నారు.

రాజకీయ కక్ష సాధింపులు లేవు
రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారస్తులకు వ్యతిరేకం కాదు. వ్యాపారస్తులతో ఫ్రెండ్లీగానే ఉంటుంది. ప్రజల సొమ్ముకు గ్యారంటీ, సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అగ్రిగోల్డ్‌ సంస్థ కూడా వేల కోట్లు ప్రజల నుంచి వసూలు చేసి బోర్డు తిప్పేశారు. ఎవరైనా, తమ సొంత ఆస్తి తాకట్టు పెట్టి బ్యాంకు లోను తీసుకోవచ్చు. ఆ వ్యాపారం దెబ్బతిన్నా.. ఆస్తిని జప్తు చేసి డబ్బులు రికవరీ చేస్తారు. దీన్ని ఎవ్వరూ తప్పు పట్టడం లేదు. చిట్‌ఫండ్ కంపెనీలు రూల్ ప్రకారం ఫాలో అయితే ఎవ్వరికీ అభ్యంతరం లేదు. ప్రజల డబ్బులతో ఆస్తులు కొంటున్నారు. ఫార్మా, రియల్‌ ఎస్టేట్‌ సంస్థల్లో పెట్టుబడులు పెడుతున్నారు. చిట్స్ పాడుకున్న వ్యక్తికి ఆరు నెలల్లో డబ్బులు ఇవ్వాలి. కానీ 6-9 నెలలు పాటు తిప్పుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆదిరెడ్డి కుటుంబంలో అరెస్టులపై కక్షసాధింపు చర్యలని కొందరు విమర్శలు చేస్తున్నారు. జగన్‌ ఎమ్మెల్సీ పదవి ఇస్తే ఆదిరెడ్డి తెలుగుదేశంకు అమ్ముడైపోయాడని అందుకే కక్షసాధిస్తున్నారని అంటున్నారు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేయాల్సిన పనేం ఉంటుంది? అలాంటి ఉద్దేశమేమీ మాకు ఉండదు. ప్రభుత్వం వచ్చి నాలుగేళ్లు అయింది. కక్షసాధింపు చర్యలు చేపట్టాలంటే ఇంతకాలం ఎందుకు ఆగుతాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీకి ఓటేయలేదని కక్షసాధింపు చర్యగా అరెస్టులు చేశారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ విమర్శిస్తున్నారు. మాకు టీడీపీ ఓట్లతో అవసరం లేదు. సమస్యను పక్కదారి పట్టించి ప్రభుత్వంపై బురదజల్లాలని చూస్తున్నారు.

మరో మార్గదర్శిలా.. జగత్ జనని
ఆదిరెడ్డి కుటుంబం అరెస్టు వ్యవహారంలో ఎలాంటి రాజకీయాలు లేవు. ఎన్నో కంపెనీలు బోర్డులు తిప్పేస్తున్నారు. ఇలాంటి వ్యవహారాలు జరగటానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇవ్వట్లేదు. మరోవైపు.. మార్గదర్శి విషయంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ పోరాటం చేస్తున్నారు. ప్రజల డబ్బుతో భూములు కొనటం, సినిమాలు తీయటం చేస్తున్నారు. ప్రజల డబ్బుతోనే రామోజీ ఫిల్మ్‌ సిటీ కట్టారు. మరో చిన్న మార్గదర్శిగా జగత్‌జనని చిట్‌ఫండ్స్‌ అని చెప్పవచ్చు. బ్యాంకు ద్వారా లావాదేవీలు జరిపితే ఎలాంటి అభ్యంతరం లేదు. నగదు లావాదేవీలతో పాటు అక్రమాలు చేశారు. ఎంతోమందిని చిట్స్ డబ్బులు ఇవ్వకుండా వేధించారు. చాలా మంది బాధితులు ముందుకు వస్తున్నారు. చిట్‌ డబ్బులు రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెడుతున్నారు. ఒకేవేళ రియల్‌ఎస్టేట్‌లో నష్టాలు వస్తే బోర్డు తిప్పేస్తున్నారు.

30 ఏళ్ల నుంచి డ్రైవింగ్ చేస్తున్నా.. లైసెన్స్ అక్కర్లేదు అంటే చెల్లుతుందా..?
20-30 ఏళ్ల నుంచి వ్యాపారం చేస్తున్నాం అంటున్నారు. ఇది ఎలా ఉందంటే.. 30 ఏళ్ల నుంచి డ్రైవింగ్ చేస్తున్నాను. నాకు లైసెన్స్ అక్కర్లేదు అంటే ఎలా ఉంటుంది? లైసెన్స్‌ ఎక్స్‌పైరీ అయితే రెన్యువల్ చేయించుకోవాలి. యాక్సిడెంట్ అయితే.. ఎవరు సమాధానం చెబుతారు. అలాగే.. చిట్‌ఫండ్ సంస్థలు కూడా 1982 చిట్‌ఫండ్ యాక్ట్‌కు లోబడే వ్యాపారాలు చేయాలి. ఆదిరెడ్డి కుటుంబం రాజకీయాలను అడ్డుపెట్టుకునే వ్యాపారాల్లో ఈ స్థాయికి ఎదిగారు. వీరి బాధితులు చాలా మందే ఉన్నారు. వ్యాపారం చేసేవారు ఎవరైనా చట్టానికి లోబడే వ్యవహరించాలి. వీరు చూపిస్తున్న డాక్యుమెంట్స్‌ లో ఎన్నో అవకతవకలు ఉన్నాయి. చిట్‌ఫండ్ యాక్ట్ ప్రకారం అరెస్టులు జరిగాయి కూడా. వీరికి కావాల్సిన వారికి అడ్వాన్స్‌ పేమెంట్స్ చేశారట. చిట్‌ఫండ్ వ్యాపారం చేసేవారు.. అది కాకుండా ఇతర వ్యాపారాలు చేయటానికి వీల్లేదని 1982 చట్టం చెబుతోంది. ఈ చిట్‌ఫండ్‌ వ్యాపారంతో పాటు నాలుగైదు రకాల వ్యాపారాలు చేస్తున్నారు. రూ.20వేల పైబడి నగదు లావాదేవీలు చేయటానికి వీల్లేదు. కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయని రికార్డులు చెబుతున్నాయి. ఆదిరెడ్డి కుటుంబం ఎలా ఎదిగిందో రాజమండ్రి ప్రజలకు తెలుసు. కోట్ల రూపాయలతో చేస్తున్న చిట్‌ ఫండ్స్ వ్యాపారంలో ఏవైనా అవాంతరాలు ఎదురైతే చివరికి నష్టపోయేది ప్రజలే. జగత్‌జనని చిట్‌ఫండ్స్‌ బాధితులు వచ్చి కలిశారు. మీడియా సమావేశంలో గోడు వెల్లబోసుకుంటామంటే రాజకీయం చేయవద్దని, పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేయమన్నాను. ఇదేమీ వ్యక్తిగత వ్యవహారం కాదు. ఏదైనా తేడా వస్తే.. నష్టపోయేది ప్రజలే.

తప్పు చేయకపోతే ఎందుకు యాంటిస్పేటరీ బెయిల్‌?
తప్పు చేకపోతే కేసు వేయండి. ఎందుకు యాంటిస్పేటరీ బెయిల్‌ తెచ్చుకున్నారు? జీఎస్టీ అంశంలో తెచ్చుకున్నారు. ఏ తప్పు చేసినా యాంటిస్పేటరీ బెయిల్‌ ఇవ్వటం కుదరదు. మహానాడు వస్తోందని ఆదిరెడ్డి కుటుంబాన్ని అరెస్టు చేశామనటం హాస్యాస్పదం. ఆంధ్రప్రదేశ్‌లో విప్లవాత్మకమైన సంక్షేమ పాలన జరుగుతోంది. దమ్ముంటే మహానాడులో వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థను తీసేస్తామని, మా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తొలగిస్తామని తీర్మానం చేయండి. అదే మహానాడులోనే మీ పార్టీ కార్యకర్తలు, ప్రజలు ఎలా బుద్ధి చెబుతారో తెలుస్తుంది. చంద్రబాబు, తాను చేసిన కార్యక్రమాలు చెప్పి ఓట్లు అడిగే పరిస్థితి లేదు. ప్రభుత్వంపై బురద చల్లి ఓట్లు అడిగే కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ర్పచారాన్ని ప్రజలు గమనించాలి.

రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌ చంద్రబోస్ మాట్లాడుతూ..
ప్రజలకు అన్యాయం జరిగితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు
రాష్ట్రంలో సంఘనలు చూస్తే.. ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం చేస్తున్నారు. రాజకీయాలు అడ్డుపెట్టుకొని.. బురద చల్లితే.. నేరాలన్నీ తొలగిపోతాయనే భ్రమల్లో టీడీపీ నేతలు ఉన్నారు. వ్యాపారులు, ప్రజలు ఇద్దరి హక్కులను ప్రభుత్వం పరిరక్షిస్తుంది. వ్యాపారస్తులు పన్నులు కడతారు. ప్రభుత్వానికి వారు వీఐపీలు. ఎందుకు వ్యాపారస్తులను ప్రభుత్వం వేధిస్తుంది. ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ప్రభుత్వం చూస్తూ ఉండదు. తన విధిని తాను నిర్వర్తిస్తోంది. రాజకీయ కక్షతో అరెస్టు చేస్తున్నారని విమర్శలు చేయటం సరికాదు. జగత్‌ జనని చిట్‌ఫండ్ సంస్థలో ఉల్లంఘనలు చేశారనే ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసును అరెస్టు చేశారు. తప్పు జరిగితే చిట్‌ఫండ్‌ సంస్థలో పనిచేసే ఉద్యోగి కూడా శిక్షార్హుడే అవుతాడు. చంద్రబాబు హయాంలో అగ్రిగోల్డ్‌ సంస్థలో స్కాం జరిగి.. ఖాతాదారులు రోడ్డున పడి, ఆత్మహత్యలకు పాల్పడుతుంటే.. జగన్ మోహన్ రెడ్డిగారే వారిని ఆదుకున్నారు.

రామోజీరావు అయినా ఆదిరెడ్డి అప్పారావు అయినా ఒక్కటే
మీడియా కూడా ఇలాంటి సంస్థలు ఏవైనా ఉంటే ప్రభుత్వానికి సమాచారం ఇవ్వండి. ఎవరు తప్పు చేసినా తప్పే. అది రామోజీరావు కావొచ్చు. ఆదిరెడ్డి అప్పారావు అవ్వొచ్చు. ఎవరైనా ప్రభుత్వానికి ఒకటే. ప్రజలు ఎవ్వరూ అన్యాయానికి గురికాకూడదు. రామోజీకి ఒక న్యాయం, ఆదిరెడ్డికో న్యాయమా? నిద్రలేస్తే ఎన్ని భాషల్లో తిట్టాలంటే.. అన్నిరకాలుగా తిడుతున్నారు. రామోజీరావు కోర్టులకు వెళ్లి వెసులుబాటు తెచ్చుకుంటున్నారు. అది ప్రభుత్వం తప్పు కాదు. కోర్టుల ఆదేశాల ప్రకారం ప్రభుత్వం వ్యవహరిస్తోంది.

Leave a Reply