-సిందూర్ సివంగిలకు సెల్యూట్
– ఆపరేషన్ సిందూర్ ఆర్మీ దళానికి నాయకత్వం వహించింది గుజరాత్ ముస్లిం మహిళ సోఫియా ఖురేషి
“అసలు వాళ్లిద్దరూ నడచి వస్తుంటే ఆడ పులులు గుర్తుకొచ్చాయట! బూజ్ బంప్స్ అట! వారు మాట్లాడుతున్నంత సేపు అలాగే చూస్తుండి పోయారట! నోట మాటల్లేవు అట! ఏమి ఆత్మ విశ్వాసం రా! ఆ జాబ్ అలాంటిది” అని చెబుతుంటే వింటున్న నాలోనూ ఉత్తేజం, ఉత్సాహం పెల్లబుకింది!
అసలు దేశ భద్రతా చరిత్రలోనే ఇలా ఒక ఆపరేషన్ కు ఇరువురు మహిళలు నాయకత్వం వహించడం మొదటిసారి! దానికన్నా ముఖ్యమైంది… ఆపరేషన్ సక్సెస్ అయ్యాక దేశ ప్రజలకు వివరించే క్రమం ఎప్పుడూ పురుష అధికారులే తీసుకుంటారు! కానీ, మొట్టమొదటిసారి మీడియా ముందుకు వచ్చి జరిగింది వివరించే అవకాశం ఆ సివంగులకే ఇచ్చారు! ఒకరు ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషి, మరొకరు ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్! ఇద్దరూ ఇద్దరే మిస్సైల్స్ లా కనిపించారు!
మనం ఇక్కడ ముస్లిం లు హిందువులు అంటూ తెగ రెచ్చిపోతాం! సోషల్ మీడియాలో యుద్ధం చేసేస్తాం! కానీ, రక్షణ శాఖ ఆధ్వర్యంలో భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కు ఆర్మీ దళానికి నాయకత్వం వహించింది గుజరాత్ కు చెందిన ముస్లిం మహిళ సోఫియా ఖురేషి!
ఆమె భర్త, తండ్రి, తాత అందరూ భారత ఆర్మీ అధికారులే! 2016లోనే పూణే లో జరిగిన బహుళ జాతీయ సైనిక విన్యాసం ఎఫ్ 18కు నాయకత్వం వహించి తొలి మహిళా లెఫ్టినెంట్ కల్నల్ గా సోఫియా చరిత్ర సృష్టించారు! యుయన్ శాంతి పరిరక్షణ మిషన్ లోనూ తన సత్తా చాటుకున్నారు! ఆమె ఇవాళ ఆపరేషన్ సింధూర్ గురించి వివరించి “సైన్యంలో చేరండి” అంటూ ముగించి యువతకు ముఖ్యంగా అమ్మాయిలకు గొప్ప పిలుపునిచ్చారు.
ఆమెకు చిన్నప్పుడు వ్యోమిక అని ఎందుకు పేరు పెట్టారో కానీ ఆ పేరును సార్ధకం చేసుకుంది ఎయిర్ ఫోర్స్ దళ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్! ఆపరేషన్ సిందూర్ లో వైమానిక దాడులకు ఆమె నాయకత్వం వహించారు! ఇంజనీరింగ్ పూర్తి చేసి ఇంట్లో వాళ్ళు వారించినా ఆమె పట్టుబట్టి వైమానిక దళంలో హెలికాప్టర్ పైలట్ గా చేరారు! చేతక్, చీతా యుద్ధ హెలికాప్టర్లను నడపడంలో ఆమె సివంగి! కొండల్లో లోయల్లో హెలికాప్టర్ నడపడంలో దిట్ట! అందుకే జమ్ము కాశ్మిర్, అరుణాచలప్రదేశ్ లలో జరిగిన పలు రెస్క్యూ ఆపరేషన్స్ లో వ్యోమికాను మాత్రమే రంగంలోకి దించుతుంది భారత వైమానిక దళం!
మొత్తానికి మన ఇండియా ఇటు మాక్ డ్రిల్ అని ప్రకటించి కాస్త ఎడమార్చి అటు పాక్ ఉగ్రవాదుల పై ముందస్తు యుద్ధం చేసి దిగ్విజయంగా ముగించింది! జయహో భారత్! కేవలం 27 నిముషాల్లో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసేసింది మన సైన్యం! పాక్ తొండి చేస్తూ అంగీకరించక పోయినా దాదాపు వంద మంది వరకు ఉగ్రవాదులు ఈ సిందూర్ ఆపరేషన్ లో హతమయ్యారని తెలుస్తోంది!
26 మంది భారత మహిళల సింధూరాన్ని చేరిపేసిన పాక్ ఉగ్రవాదులను 27 నిముషాల్లో మట్టి కరిపించి ప్రతీకారం తీర్చుకుంది! ఈ ఆపరేషన్ కు సిందూర్ అని నామకరణం చేయడం, ఆర్మీ, వైమానిక దళాలకు మహిళలు నాయకత్వం వహించడం భారత రక్షణ శాఖ తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయం దిగ్వజయం అయ్యింది!
పాక్ ఉగ్రవాదులు భారత అమాయక పర్యాటకుల ప్రాణాలు నిర్దాక్షిణ్యంగా తీసినా, మన సైన్యం మాత్రం మామూలు జనం జోలికి వెళ్ళకుండా గొప్ప మానవతను చాటుకుంది! పాకిస్థాన్ తోక ముడిచింది! యుద్ధం చేసే ఆలోచన లేదంటూ ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించింది! జయహో భారత్!