Suryaa.co.in

National

భారత సాంకేతిక నుదట కొత్త ‘సిందూరం’

– కశ్మీర్ బాధితుల ‘ప్రతీకార సిందూరం’
– సరికొత్త టెక్నాలజీ.. సరికొత్త వ్యూహాలు
– పాక్‌కు భారత్ గట్టి గుణపాఠం- స్కాల్ప్ క్రూజ్ మిసైల్, హ్యామర్ గైడెడ్ బాంబులు వంటి అధిక కచ్చితత్వం కలిగిన ఆయుధాలతో పాటు, ఆత్మాహుతి డ్రోన్ తో ఉగ్రశిబిరాలు నేలమట్టం
– 80 మందికి పైగా ఉగ్రవాదుల మృతి

గతంలో ఇదే ప్రధాని మోదీ నిఖిల ప్రపంచం నివ్వెరపోయేలా.. తెల్లవారుఘామున పాక్‌పై విరుచుకుపడిన సర్జికల్ స్ట్రైక్స్ కు, తాజా విధ్వంసం పూర్తి భిన్నం. ఇది పూర్తిగా టెక్నికల్ వార్. కశ్మీర్‌లో పర్యాటకులను మతం అడిగి మరీ హత్య చేసిన హంతకుల ఏరివేత ఆపరేషన్‌కు భారత్ సర్కారు పెట్టిన పేరు ‘ఆపరేషన్ సిందూర్’. ఒక్క పీఓకే మాత్రమే కాదు. పాక్ లోపలికీ చొచ్చుకువెళ్లి, భారత సత్తా ఏమిటన్నది చాటి.. హంతకులను మట్టుపెట్టిన ఈ ఆపరేషన్ కథేమిటో చూద్దాం రండి.

2016 నాటి యూరి ఘటన అనంతరం జరిగిన సర్జికల్ స్ట్రైక్స్, 2019 నాటి బాలాకోట్ వైమానిక దాడుల శైలికి పూర్తి భిన్నం. ఈ ఆపరేషన్ ద్వారా.. అవసరమైతే పాకిస్థాన్‌ భూభాగంలోని ఏ లక్ష్యాన్నైనా ఛేదించడానికి భారత్ వెనుకాడదని, లక్షిత దాడులు చేయగల సత్తా తమకుందని ఈ ఆపరేషన్ ద్వారా స్పష్టం చేసినట్లయింది.

ఈ దాడికి ముందు, భారత ఇంటెలిజెన్స్ అధికారులు అత్యంత పకడ్బందీగా సమాచారాన్ని సేకరించారు. ఉపగ్రహ చిత్రాలు, మానవ వనరుల ద్వారా అందిన నిఘా సమాచారం, ఉగ్రవాదుల మధ్య జరిగిన కమ్యూనికేషన్లను లోతుగా విశ్లేషించి, జైషే మహమ్మద్, లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలు వినియోగించే శిక్షణా కేంద్రాలను, కాంప్లెక్స్‌లను గుర్తించారు.

ఈ బహవల్పూర్ ప్రాంతంలో పాకిస్థాన్ ఆర్మీకి చెందిన రెజిమెంటల్ సెంటర్ కూడా ఉండటం గమనార్హం. పాకిస్థాన్‌లో అత్యంత కీలకమైన పంజాబ్ ప్రావిన్స్‌లోనే నాలుగు ఉగ్రవాద శిబిరాలను ఈ ఆపరేషన్‌లో ధ్వంసం చేశారు.

లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదించగల సామర్థ్యం ఉన్న 24 ఆయుధాలను ఈ ఆపరేషన్‌లో భారత దళాలు వినియోగించాయి. వీటిలో శక్తివంతమైన క్షిపణులు, బాంబులతో పాటు ఆత్మాహుతి డ్రోన్లు కూడా ఉన్నాయి. ఈ ఆయుధాల ద్వారా ఏకకాలంలో తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో దాదాపు 80 మందికి పైగా ఉగ్రవాదులు మరణించగా, మరో 60 మంది వరకు గాయపడినట్లు అంచనా.

ఆయా సంస్థలకు చెందిన ఆయుధ డిపోలు, బ్రెయిన్ వాషింగ్ కేంద్రాలు, స్లీపర్ సెల్ ప్రణాళికా కేంద్రాలను కూడా నిర్ధారించుకున్నారు. సరిహద్దులకు అత్యంత సమీపంలో ఉన్న ఉగ్ర స్థావరాలపై కొన్ని రోజుల పాటు డ్రోన్ల ద్వారా నిరంతర నిఘా ఉంచారు.

స్కాల్ప్ క్రూజ్ మిసైల్, హ్యామర్ గైడెడ్ బాంబులు వంటి అధిక కచ్చితత్వం కలిగిన ఆయుధాలతో పాటు, ఆత్మాహుతి డ్రోన్లను కూడా ఈ ఆపరేషన్‌లో వినియోగించారు. సుమారు 25 నిమిషాల పాటు సాగిన ఈ ఆపరేషన్‌లో, అంతర్జాతీయ సరిహద్దు నుంచి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో పాకిస్థాన్‌లోని బహవల్పూర్‌లో ఉన్న జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరంతో పాటు పలు ఇతర స్థావరాలను నేలమట్టం చేశారు.

తాజా పరిణామాల భారత్‌లో ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాక్‌కు గట్టి హెచ్చరికల సంకేతాన్నే పంపించినట్లయింది. భారత్ తలచుకుంటే పాక్‌లోకి పూర్తి స్థాయిలో చొరబడగలం అన్నదే ఆ హెచ్చరికల సారాంశం.

LEAVE A RESPONSE