– గత ఏడాదితో పోలిస్తే 13 ర్యాంకుల మెరుగుదల
– ప్రభుత్వ మద్దతు, సిబ్బంది కృషి ప్రధాన కారణాలు
– ఉపకులపతి అల్థాస్ జానయ్య
హైదరాబాద్: దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల పనితీరుపై భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ నిర్వహించిన సర్వే నివేదిక NIRF (National Institutional Ranking Framework) 2025 విడుదల అయ్యింది. ఈ జాబితాలో దేశంలోని అన్ని వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ విశ్వవిద్యాలయాలు, సంస్థల జాబితాలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTAU) 24వ ర్యాంక్ ను సాధించింది.
2015 లో PJTAU ఆరవ ర్యాంక్ సాధించగా, 2023లో ఆ ర్యాంక్ 37కు పడిపోయింది. ఇప్పుడు పనితీరు మెరుగు పరుచుకుని 24 ర్యాంకు సాధించిందని PJTAU ఉపకులపతి అల్దాస్ జానయ్య వివరించారు. దక్షిణాదిలోని అన్ని వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ విశ్వవిద్యాలయాలు, సంస్థల్లో 4వ స్థానంలో PJTAU నిలవడం గర్వకారణమని జానయ్య అన్నారు. 10 నెలల క్రితం తాను PJTAU ఉపకులపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విశ్వవిద్యాలయ ర్యాంకింగ్ మెరుగుదలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి అనేక కార్యక్రమాలు చేపట్టడం వల్ల ఈ ఏడాది ర్యాంకు మెరుగుపడిందని ఆయన తెలిపారు.
విశ్వవిద్యాలయం పరిధిలో ప్రత్యేకంగా 4 ఆధునిక పరిశోధన కేంద్రాలు ప్రారంభించానన్నారు. మానవ రహిత వ్యవసాయమే ధ్యేయంగా డిజిటల్ టెక్నాలజీ వినియోగం పెంపునకు సెంటర్ ఫర్ డిజిటల్ అగ్రికల్చర్ ను, సహజ వనరులు, పర్యావరణ పరిరక్షణ పరిశోధనలకు గాను సెంటర్ ఫర్ నేచురల్ రిసోర్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ను, అదేవిధంగా సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ సిస్టమ్స్ ను, అలాగే బోధన, బోధనేతర సిబ్బంది లో నైపుణ్యాల పెంపుదలకి సెంటర్ ఫర్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
అదేవిధంగా సహజ వనరుల పరిరక్షణ, యూరియా, ఇతర రసాయన ఎరువుల వినియోగం తగ్గింపు, నీటి సమర్థ యాజమాన్యం వంటి ముఖ్యమైన అంశాలపై రాష్ట్రవ్యాప్తంగా ”రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” అనే వినూత్న కార్యక్రమాన్ని అమలు చేసి సుమారు 1200 గ్రామాల్లో 1,20,000 మంది రైతులని శాస్త్రవేత్తలు ప్రత్యక్షంగా కలిసి ఆ అంశాలపై అవగాహన కల్పించారని జానయ్య వివరించారు. అలాగే సుమారు 11వేల గ్రామాల్లో ఎంపిక చేసిన అభ్యుదయ రైతులకి నాణ్యమైన 40 వేల విత్తన కిట్లను పంపిణీ చేశామని జానయ్య పేర్కొన్నారు.
సామాన్యులకి, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు వ్యవసాయ విద్యను చేరువ చేయాలన్న ఉద్దేశంతో సీట్లను పెంచి, ఫీజులు తగ్గించామని, వ్యవసాయ కూలీల పిల్లలకు ప్రత్యేక సీట్లు కేటాయించామని జానయ్య వివరించారు. అలాగే అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు చేసుకొని విస్తృత పరిశోధనలు చేపట్టామని జానయ్య తెలిపారు.
భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ICAR), రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ కార్యదర్శి రఘునందన్ రావు ల నిరంతర మార్గదర్శకత్వం, తోడ్పాటుతో ఈ ర్యాంకు సాధించగలిగామన్నారు. అదేవిధంగా బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థుల కృషి, తోడ్పాటు ర్యాంకుల పెరుగుదలకు దోహదం చేసిందని జానయ్య అన్నారు. వారందరికీ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో 2026 లో 10వ ర్యాంకు, 2027లో 5వ ర్యాంకు సాధిస్తామని అల్థాస్ జానయ్య ధీమా వ్యక్తం చేశారు.