Suryaa.co.in

Andhra Pradesh

న్యాయమూర్తులకు సొంత సామర్థ్యాలపై విశ్వాసం ఉండాలి

– తెలుపు, నలుపులను ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణలకు గుర్తులు
– కోర్టులు వివాదాల పరిష్కారమే కాదు, న్యాయాన్ని నిలబెట్టేలా చూడాలి
– కేసుల పరిష్కారంలో జాప్యాన్ని తగ్గించాలి
– సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌
– ఏపీ జ్యుడీషియల్ అకాడమీని ప్రారంభించిన సీజేఐ

కేసుల పరిష్కారంలో జాప్యాన్ని నివారించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని కాజ వద్ద నిర్మించిన ఏపీ జ్యుడీషియల్‌ అకాడమీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. హైకోర్టు రికార్డుల డిజిటలైజేషన్‌ ప్రాజెక్టుతో పాటు ఆన్‌లైన్‌ సర్టిఫైడ్‌ కాపీల జారీకి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్స్‌ను కూడా సీజేఐ ప్రారంభించారు. అనంతరం నాగార్జున యూనివర్సిటీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏపీ హైకోర్టు మొదటి వార్షిక నివేదికను ఆయన విడుదల చేశారు.

ఈ సందర్భంగా న్యాయమూర్తులు, న్యాయవాదులను ఉద్దేశించి సీజేఐ మాట్లాడారు. న్యాయవ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానం వాడకం పెరిగింది. సాంకేతికతను అందిపుచ్చుకునేలా డిజిటలైజేషన్‌ ప్రక్రియకు శ్రీకారం చుట్టాం. సాంకేతికతకు అనుగుణంగా మార్పులు చేసుకోవాలి. కేసుల సత్వర పరిష్కారానికి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడుతుంది. న్యాయవాదులు నల్లకోటు ధరించి తిరగడం చూస్తుంటాం. అందులోని తెలుపు, నలుపు రంగులను ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణగా పరిగణిస్తారు. న్యాయమూర్తులు నిత్య విద్యార్థులుగా ఉంటూ నైపుణ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. కోర్టులు వివాదాల పరిష్కారమే కాదు, న్యాయాన్ని నిలబెట్టేలా చూడాలి. కేసుల పరిష్కారంలో జాప్యాన్ని తగ్గించాలి. న్యాయవ్యవస్థను పరిరక్షించడానికి అందరి సహకారం అవసరం. పెండింగ్ కేసులు సత్వరమే పరిష్కరించాలి. జడ్జిలకు సొంత సామర్ధ్యాలపై విశ్వాసం ఉండాలి. ముఖ్యమైన కేసుల్లో త్వరగా న్యాయం జరిగేలా చూడాలి.

‘‘న్యాయవ్యవస్థను పరిరక్షించేందుకు అందరి సహకారం అవసరం. పెండింగ్‌ కేసులను సత్వరమే పరిష్కరించాలి. కేసుల సత్వర పరిష్కారానికి సాంకేతిక పరిజ్ఞానం చాలా ఉపయోగపడుతుంది. న్యాయవ్యవస్థ వేగంగా సేవలందించాలంటే మౌలిక వసతులు మెరుగుపరచాలి. నూతన సాంకేతికతకు అనుగుణంగా మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం. న్యాయవాదులు తెల్లచొక్కాలపై నల్ల కోటు ధరిస్తారు. తెలుపు, నలుపులను ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణలకు గుర్తులుగా పరిగణిస్తారు. న్యాయమూర్తులకు సొంత సామర్థ్యాలపై విశ్వాసం ఉండాలి. నిత్య విద్యార్థులుగా ఉంటూ వృత్తి నైపుణ్యం పెంచుకోవాలి. న్యాయవ్యవస్థలో కేసుల సంఖ్య కంటే నాణ్యతకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఉత్తమ పద్ధతులను పరస్పరం పంచుకోవడం ద్వారా లక్ష్యాన్ని సాధించవచ్చని సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రతో పాటు న్యాయమూర్తులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE