అయ్యన్న అరెస్టు జగన్ రెడ్డి అధికార కక్ష సాధింపే

-భూ కబ్జాలు, షర్మిల వాంగ్మూలం, రైతు పాదయాత్రతో జగన్ రెడ్డిలో ఫ్రస్టేషన్ పెరిగింది
-మూడున్నరేళ్లుగా లక్షల ఎకరాలు దోచిన జగన్ రెడ్డి అండ్ కో సుద్దులు చెప్పడం సిగ్గుచేటు
-వేల ఎకరాలు దానం చేసిన అయ్యన్నపై రెండు సెంట్ల ఆక్రమణ అంటూ కేసు కక్ష సాధింపు కాదా?
-పొలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు

ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలు గుర్తించిన ప్రతిసారి.. ఏదో ఒక విషయంలో హడావుడి చేసి ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రయత్నించడం అలవాటుగా మారిపోయింది. అయ్యన్న పాత్రుడి విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు అత్యంత దుర్మార్గం. వివేకా హత్య విషయంలో వైఎస్ షర్మిల ఇచ్చిన వాంగ్మూలం ప్రజల్లో చర్చకు దారి తీసింది. షర్మిల వ్యాఖ్యలు ప్రజల్లోకి వెళ్లకుండా ఉండేందుకు అడ్డగోలు పనులకు దిగుతున్నారు. రాజ్యాంగం, చట్టం, ప్రజాస్వామ్యం అనేవి ఉన్నాయనే విషయాన్ని జగన్ రెడ్డి కనీసం గుర్తించడం లేదు. ఆ పూటకు ప్రజల దృష్టి మరలిస్తే చాలు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించిన అయ్యన్నను తీవ్రవాదిని అరెస్టు చేసినట్లు లాక్కెలతారా? ప్రజాసమస్యల్ని ప్రశ్నించే హక్కు సామాన్య పౌరుడికి లేదా?

అధికార పార్టీ నేతలు గత మూడున్నరేళ్లలో లక్షలాది ఎకరాలు దోచుకున్నారు. అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నారు. విశాఖలో గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.40 వేల కోట్ల విలువైన ఆస్తుల్ని కబ్జా చేశారు. విశాఖలో విజయసాయిరెడ్డి, జగన్ రెడ్డి ఏ స్థాయిలో భూ కబ్జాలకు పాల్పడుతున్నారో అక్కడి ఒకటో తరగతి పిల్లాడిని అడిగినా చెబుతారు. మరోవైపు ప్రజలకు చెందిన వేలాది ఎకరాల భూముల్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకున్నారు.

ఆస్పత్రి, సర్క్యూట్ హౌస్ సహా.. అన్ని ప్రభుత్వ భవనాలూ తాకట్టు పెట్టేశారు. ఆ భూములు తాకట్టు పెట్టి తెచ్చిన అప్పులు ఏం చేశారు అని అయ్యన్న పాత్రుడు ప్రశ్నిస్తే తప్పా? సొంత జిల్లాలో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నించడం నేరమా? అయ్యన్న చేస్తున్న ప్రజా పోరాటం ప్రజలు గుర్తిస్తున్నారనే అధికార మదం, దుగ్ధతో తప్పుడు కేసు పెట్టి వేధించడం మొదలు పెట్టారు. అయ్యన్న పాత్రుడి ఇళ్లు ఎంత విస్తీర్ణంలో ఉంది? రెండు సెంట్లు ఆక్రమించారంటూ.. ఒక రిటైర్డ్ అధికారితో ఫిర్యాదు చేసి ఎలాంటి విచారణా లేకుండా అరెస్టుకు సిద్ధమైపోయారు. అసలు అది ఫోర్జరీ అనేందుకు మీ దగ్గరున్న ఆధారాలేంటి?

రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కుల్ని హరించేలా అర్ధరాత్రి వేళ ఇంట్లోకి దూరి, హడావుడిగా లాక్కెళ్లిపోవడానికి ఈ పోలీసులు సిగ్గుపడాలి. ఏపీ పోలీసుల వైఖరిపై పదే పదే కోర్టు ప్రశ్నిస్తోంది. కక్షతో అరెస్టు చేస్తున్నారనీ చెబుతున్నాయి. అయినా ప్రాథమిక హక్కుల్ని గౌరవించకుండా నడుచుకుంటున్నారు. వ్యవస్థల్ని నాశనం చేస్తూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారని అయ్యన్న పాత్రుడి కేసులో మరోసారి రుజువైంది.

వివేకా హత్య, షర్మిల వాంగ్మూలం, భూ కబ్జాలు, హత్యలు, అత్యాచారాలు, ప్రభుత్వ వైఫల్యాల నుండి దృష్టి మరల్చేందుకు.. బీసీ వర్గాల నుండి వచ్చిన వ్యక్తిని బలివ్వాలనుకుంటున్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎలాంటి అవినీతి మచ్చ లేని వ్యక్తిని అవమానించాలనే ఉద్దేశ్యంతోనే అరెస్టు చేశారనేది స్పష్టమైంది. తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు.. బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ. బీసీలను రాజకీయంగా ఆర్ధికంగా సామాజికంగా అండగా నిలిచింది తెలుగుదేశం పార్టీనే.

మండల వ్యవస్థలో 20 శాతం రిజర్వేషన్ పెట్టాం. జిల్లా పరిషత్ లలో 20 శాతం రిజర్వేషన్ ఇచ్చాం. అక్కడ నుండి ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా ఎంపీలుగా రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీదే. అప్పటి నుండి బీసీలు టీడీపీ వెంటే ఉన్నారనే కక్షతో.. బీసీ నేతల్నే లక్ష్యంగా చేసుకుని అక్రమ అరెస్టులతో భయపెట్టాలనుకుంటున్నారు.

జగన్ రెడ్డి పాలనలో బీసీలకు ఏం ఒరిగిందో సమాధాన చెప్పే ధైర్యం మంత్రులకు గానీ.. ముఖ్యమంత్రికి గానీ ఉన్నాయా? మంత్రుల్ని చేశాం, కార్పొరేషన్లు ఇచ్చాం అంటున్నారు. అయ్యా జగన్ రెడ్డీ.. ఏ ఒక్క బీసీ మంత్రికైనా స్వతంత్రత ఉందా? స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే హక్కు ఉందా? నేతి బీరలో నెయ్యి ఉండనట్లే.. బీసీ మంత్రులకు అధికారం లేదనే సత్యం ప్రజలందరికీ తెలుసు. కార్పొరేషన్లకు మూడున్నరేళ్లుగా ఎంత బడ్జెట్ కేటాయించారో.. ఖర్చు చేశారో సమాధానం చెప్పగలరా?

అయ్యన్నను అరెస్టు చేస్తే.. తన దుర్మార్గాలు పక్కదారి పట్టించొచ్చు అని జగన్ రెడ్డి అనుకుంటున్నారు. కానీ.. ప్రజలు పిచ్చి వారు కాదని జగన్ రెడ్డి తెలుసుకోవాలి. జగన్ రెడ్డీ.. నీ దిక్కుమాలిన పాలనపై ప్రజలంతా ఎంత వ్యతిరేకతతో ఉన్నారో నీకు కూడా తెలుసు. ఆ విషయాలను ఇలాంటి అరెస్టులు, అవమానాలతో పక్కదారి పట్టించలేరు.

రాష్ట్రంలో 52 శాతం ఉన్న బీసీ జనాభా జగన్ రెడ్డి పాలనలో ఎంతలా నష్టపోయారో, ఎన్ని రకాలుగా దగాకు గురయ్యారో ప్రజలందరికీ చెబుతాం. అయ్యన్న పాత్రుడి విషయంలో జగన్ రెడ్డి చర్యలు అత్యంత అమానవీయం. ప్రజాస్వామ్య విరుద్ధం. జగన్ రెడ్డి దుర్మార్గ పాలనకు రాష్ట్రంలోని బీసీలంతా ఏకమై చెక్ పెట్టే రోజు దగ్గరలోనే ఉందనే విషయం గుర్తుంచుకోవాలి.

Leave a Reply