Suryaa.co.in

Andhra Pradesh

చిరంజీవి భిక్షతో కన్నబాబు ఈ స్థాయికి ఎదిగాడు

-ప్రజారాజ్యం విలీనానికి కన్నబాబే కారకుడు
-డొక్కు స్కూటర్‌లో తిరిగే వ్యక్తి కోట్లకు పడగెత్తాడు
-జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ వ్యాఖ్యలు

జనసేనాని పవన్‌కళ్యాణ్‌ ఆదివారం సాయంత్రం కాకినాడ రూరల్‌లో ఏర్పాటు చేసిన వారాహి విజయభేరి సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కాకినాడ రూరల్‌ వైసీపీ అభ్యర్థి కురసాల కన్నబాబుపై పలు వ్యాఖ్యలు చేశారు. కన్నబాబుకు, తనకు ప్రత్యేక సంబంధం ఉందని తెలిపారు. గత దశాబ్దకాలంగా నేను రోడ్ల మీద తిరుగుతూ, నలుగుతూ ఉన్నానంటే దాని వెనుక కారణం ఉందన్నారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలో నా రాజకీయ ప్రస్థానం ప్రారంభమైందని వివరించారు. పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడానికి మూలకారకుడు కురసాల కన్నబాబేనని తెలిపారు.

ప్రజారాజ్యం పార్టీ పెట్టాలని 2008లో నిర్ణయం తీసుకున్నప్పుడే నేను ప్రజల కోసం రోడ్ల మీదకు వస్తాను, తిరుగుతాను అని చెప్పాను. ఆ మాటకు నేను ఇప్పటికీ కట్టుబడే ఉన్నాను. కురసాల కన్నబాబు ఒక డొక్కు స్కూటర్‌లో మా వద్ద తిరుగుతుం డేవాడు. కన్నబాబు… ఇలా రా… అంటే పరిగెత్తుకుని వచ్చేవాడు. చిరంజీవికి ఏదైనా చిన్న ఇన్ఫర్మేషన్‌ కావాలంటే ఇచ్చే వ్యక్తి అంచెలంచెలుగా ఎదిగాడు. నాయకులుగా ఎదగడాన్ని మేం వ్యతిరేకించం. అభ్యంతరం చెప్పం కానీ, నువ్వు ఎవరిని తొక్కేసి నాయకుడిగా ఎదుగుతున్నా వన్నదే ముఖ్యం.

కాకినాడ ప్రాంతంలో శెట్టిబలిజలు, మత్స్యకారుల సామాజికవర్గాలు బలంగా ఉన్నాయి. నేను అన్ని కులాలకు సమ ప్రాధాన్యం ఇస్తాను. నేను ఒక కులానికి చెందిన వ్యక్తిని కాను. ఒక పార్టీకి అధినేతను. రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి అని కోరుకునే వ్యక్తిని. టీడీపీ అధినేత చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు నేను ఏ పార్టీ అని ఆలోచించలేదు. రాష్ట్రం బాగుండాలంటే ఒక నాయకత్వం సరిపోదు, చాలామంది నాయకులు ఏకతాటి పైకి రావాలి. అనుభవజ్ఞులైన నాయకులు ఉండాలి అని ఆలోచించాను. నలిగిపోతూ, కుమిలిపోతూ ఉన్న తెలుగుదేశం క్యాడర్‌కు జనసేన అండగా ఉందని రాజమండ్రి వచ్చి భుజం కాశాను. పొత్తులో భాగంగా చంద్రబాబు, బీజేపీ, మేం అందరం త్యాగాలు చేశాం అని వివరించారు.

LEAVE A RESPONSE