(భూమా బాబు)
అబ్బో, లిక్కర్ స్కామ్ వేడి మామూలుగా లేదు! రాజ్ కసిరెడ్డి గారు దుబాయ్ నుంచి “రాజేష్ రెడ్డి” అవతారమెత్తి దిగగానే, సిట్ వాళ్ళు “స్వాగతం సుస్వాగతం” అంటూ ఎత్తుకెళ్ళిపోయారు. “నేను వస్తా, విచారణకు సహకరిస్తా” అని ఆడియో మెసేజ్ పెట్టిన గంటల్లోనే ఇలా జరగడం.. రాజ్ కసిరెడ్డి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పట్టుబడడం.. “మారుపేరుతో వచ్చాడు” అంటే… ఇంతకూ ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో “అసలు బ్రాండ్ మార్పిడి” కూడా జరిగిందా? (జగన్గారు మద్యం బ్రాండ్లు మార్చినట్టే, నటులు కూడా మారుస్తున్నారు!)
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గారు మీడియా ముందుకొచ్చి లెక్చర్లు దంచారు. “లిక్కర్ స్కాంలో నన్ను ప్రశ్నలు అడిగారు… అన్నిటికీ సమాధానం చెప్పా” అని చాలా సింపుల్గా చెప్పేశారు. 2019 చివర్లో తన ఇంట్లో రెండు లిక్కర్ మీటింగ్లు జరిగాయని కూడా ఒప్పుకున్నారు. వాసుదేవరెడ్డి, శ్రీధర్రెడ్డి, మిథున్రెడ్డి, సత్యప్రసాద్, కసిరెడ్డి రాజశేఖర్రెడ్డి ఆ సమావేశాలకు హాజరయ్యారట. ఓఎస్డీ కృష్ణమోహన్, ఐఏఎస్ ధనుంజయరెడ్డి రాలేదని గుర్తులేదన్నారు.
ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. విజయసాయిరెడ్డి గారు రాజ్ కసిరెడ్డిని “తెలివైన క్రిమినల్” అని తేల్చేశారు. పార్టీలో వాళ్లే పరిచయం చేశారట. ప్రశాంత్ కిషోర్కు ప్రోటోకాల్ వ్యవహారాలు అప్పగిస్తే.. ఈయనగారు మాత్రం కసిరెడ్డిని అంటగట్టారట! కసిరెడ్డి వెనకాల ఎవరున్నారో తనకు తెలియదంటూ అమాయకంగా మాట్లాడారు. “ప్రభుత్వాన్ని, ప్రజలను మోసం చేసిన కసిరెడ్డి” అని కూడా బాధపడ్డారు. మూడు కంపెనీలతో కొత్త బ్రాండ్లు తయారుచేసి అమ్మాడనే సంగతి తనకు తెలియనే తెలియదట! మిథున్రెడ్డి పాత్ర గురించి అడిగితే.. “అది కసిరెడ్డికే తెలుసు” అని చేతులెత్తేశారు.
“కసిరెడ్డి నన్ను కాదు.. పార్టీని, ప్రజలను మోసం చేశాడు” అంటూ లెక్చర్లు ఇచ్చారు. లిక్కర్ అమ్మకాల్లో తాను ఎప్పుడూ జోక్యం చేసుకోలేదట! మరి కసిరెడ్డి వసూలు చేసిన డబ్బులు ఎక్కడికి పోయాయో మాత్రం చెప్పలేదు. అరబిందో దగ్గర వంద కోట్లు అప్పు ఇప్పించానని, డీకార్ట్, అడాన్ కంపెనీలకు కూడా అప్పులు ఇప్పించానని గొప్పగా చెప్పారు. మళ్లీ పిలిచినా వస్తానని సిట్ అధికారులకు హామీ ఇచ్చారు.
చివర్లో ఒక పెద్ద డైలాగ్ వేశారు: “ప్రాంతీయ పార్టీల్లో నెంబర్ 2 స్థానం ఉండదు. అధికారంలో లేనప్పుడు అన్నీ నేనే చూసుకున్నా. అధికారంలోకి వచ్చాక ఆ స్థానం మిథ్య.” తనను వెన్నుపోటుదారుడని జగన్కు చెప్పారని బాధపడ్డారు. రెండో స్థానం నుంచి 2000వ స్థానానికి పడిపోయానని వాపోయారు. వైసీపీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని, కోటరీ వల్లనే పార్టీని వీడానని కన్నీళ్లు పెట్టుకున్నారు. తన ఛానల్లో తన మీదే విమర్శలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. “నేను వ్యవసాయం చేసుకుంటా.. ఇంకా ఏమైనా చేసుకుంటా.. సాక్షి మీడియా ఎందుకు అనవసర రాతలు రాస్తుంది?” అని ప్రశ్నించారు. చివరగా.. “మద్యం స్కామ్లో బిగ్బాస్ ఉన్నాడా లేడా నాకు తెలియదు” అని బాంబు పేల్చారు!
ఇక రాజ్ కసిరెడ్డి గారి ఆడియో మెసేజ్ వింటే నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. తనకు నోటీసులు ఇచ్చారని, 24 గంటల్లో స్పందించానని చెప్పారు. ఎందుకు రమ్మంటున్నారో, డాక్యుమెంట్స్ ఏమైనా తేవాలా అని అడిగానంటూ అమాయకంగా మాట్లాడారు. తాను విచారణకు సహకరిస్తానని చెప్పాక రెండో నోటీసు ఇచ్చారట! మీడియాలో తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను లేని టైమ్లో తన తల్లికి నోటీసులు ఇచ్చారని బాధపడ్డారు. సాక్షిగా పిలిచి అరెస్ట్ చేయాలని చూస్తున్నారని లాయర్లు చెప్పారట!
అందుకే హైకోర్టులో పిటిషన్ వేశానని, న్యాయ సలహా తీసుకున్నాకే విచారణకు వస్తానని చెప్పారు. ఇక్కడే అసలు పంచ్ డైలాగ్ పేల్చారు: “విజయసాయిరెడ్డి ఒక బట్టేబాజ్ మనిషి. ఆయన చరిత్రను అందరి ముందు పెడతా!” అప్పటివరకు తన గురించి ఒకవైపు వార్తలు వేయొద్దని మీడియాను కోరారు.
అరెస్ట్ అయ్యాడని తెలవగానే బేబక్క భయంతో బిక్కజచ్చి అలెర్ట్ చేసినట్లుంది.
ఇంతలో జగన్ తాడేపల్లిలో పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ పెట్టారు. అత్యవసరంగా మీటింగ్ ఎందుకు పెట్టారో ఎవరికీ అర్థం కావడం లేదు. “కసిరెడ్డిని బకరా చేయడానికా? లేక ప్రజల దృష్టిని మళ్లించడానికి కొత్త డైవర్షన్ స్కెచ్చా?” అని జనం గుసగుసలాడుకుంటున్నారు.
కసిరెడ్డి గారిని బలిపశువును చేసి, మిగతా వాళ్ళందరూ క్లీన్ చిట్ తెచ్చుకోవాలని చూస్తున్నారేమో! “నాకు తెలీదు, నాకు తెలీదు” అంటూ అందరూ తప్పించుకుంటే, అసలు కథ ఎక్కడికి పోతుంది?
జగన్ గారు మీటింగ్ లో ఏం మాట్లాడతారో, ఏం ప్లాన్లు వేస్తారో చూడాలి. “లిక్కర్ స్కామ్ లో బిగ్ బాస్ ఎవరు?” అనే ప్రశ్న మాత్రం అలానే మిగిలిపోయింది. “నాకు తెలీదు” అనే జవాబులు వింటే, “మరి ఎవరికి తెలుసు?” అని అడగాలనిపిస్తుంది.
విజయసాయిరెడ్డి, రాజ్ కసిరెడ్డి గారి మధ్య “నువ్వెంత అంటే నువ్వెంత” అనే వార్ మాత్రం రంజుగా సాగుతోంది. “నేను అమాయకుడిని” అని విజయసాయిరెడ్డి గారు అంటే, “నువ్వే క్రిమినల్వి” అని కసిరెడ్డి గారు అంటున్నారు. ఈ “ప్రేమ కథ” ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి.
మొత్తానికి, ఈ లిక్కర్ స్కామ్ ఒక సీరియల్ లాగా సాగుతోంది. రోజుకో ట్విస్ట్, రోజుకో కొత్త పాత్ర. జనం మాత్రం పాప్ కార్న్ తింటూ, “ఇంకా ఏం జరుగుతుందో” అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మధ్యలో మిథున్ రెడ్డి.. పైన బేబక్క హ్యాండ్లింగ్ వరకు చాలా లింకులు వున్నాయి. కవితక్క లెక్కన బేబక్క తీహార్ వరకు వెళితే, పొంచివున్న ఆడపడుచు కుల్లబొడిచేస్తుంది.
ఈ కవరప్ల కోసం.. లోన్లు ఇచ్చిన అరబిందో వారి వారి వరకు, ఇంట్లో మద్యం మీటింగులు పెట్టించిన ఎ 2 వరకు, ఏ ఏ డ్రామాలు ఆడుతారో ఆసక్తిదాయకం. బాబాయి మర్డర్ స్టోరీలోనే గుండెపోటు కథలు అల్లిన బేబక్క మీడియాలో ఇవ్వాళ రాత్రి నుండి ఏ ఏ కథలు వస్తాయో చూడాలి.