– దళిత గిరిజన ఆడబిడ్డలపై లైంగిక వేధింపులు, హింసను మానవ హక్కుల కమిషన్ తేల్చిన నేపథ్యంలో కేటీఆర్ డిమాండ్
– బాధ్యులైన పోలీసులను సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలని కేటీఆర్ డిమాండ్
హైదరాబాద్: అధికార మదంతో విర్రవీగుతున్న రేవంత్ రెడ్డి చెంప మీద కొట్టినట్టుగా జాతీయ మానవ హక్కుల కమీషన్ రిపోర్ట్ ఇచ్చిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. లగచర్ల ఆడబిడ్డలను లైంగికంగా హింసించిన పోలీసులను సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. మూడేళ్లలో మళ్లీ బీఆర్ఎస్సే అధికారంలోకి వస్తుందన్న కేటీఆర్, రేవంత్ రెడ్డి ప్రైవేటు సైన్యంలాగా ఓవరాక్షన్ చేస్తున్న పోలీసు అధికారులను వదిలిపెట్టేది లేదన్నారు.
రిటైర్డ్ అయి ఏ మూలలో దాక్కున్నా పట్టుకొచ్చి హిసాబ్ కితాబ్ బరాబర్ చేస్తామని హెచ్చరించారు. హైదరాబాద్ నందీనగర్ లో కేటీఆర్ ను కలిసిన లగచర్ల బాధితులను బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం లక్ష రూపాయలను విరాళంగా ఇచ్చారు. ఆ తరువాత మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. లగచర్ల ఆడబిడ్డలపై లైంగిక వేధింపులు జరిగాయని, అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందన్న ఎన్.హెచ్.ఆర్. సి నివేదికతో అయినా సిగ్గు తెచ్చుకుని రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డికి సిగ్గు,శరం ఉంటే దళిత గిరిజనులపై జరిగిన అరాచకాలు, లైంగిక వేధింపులకు బాధ్యత వహించి రాజీనామా చేసి క్షమాపణ కోరేవారన్నారు. రేవంత్ రెడ్డి సిగ్గు,మానం ఏమాత్రం లేనందునే ఇంకా సిఎంగా కొనసాగుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు.
బీఆర్ఎస్ రజతోత్సవ సభకోసం లగచర్ల గిరిజనులు లక్ష రూపాయలు విరాళంగా ఇస్తే గుండె నిండా సంతోషంగా అనిపించింది. తాము కష్టంలో ఉన్నప్పుడు అండగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఉడతాభక్తిగా సహాయం చేస్తామని లగచర్ల గిరిజనులు చెప్పారు. ఒక మనిషిని ఎన్ని రకాలుగా శారీరకంగా చిత్రవధ చేసే అవకాశం ఉంటదో అన్ని రకాలుగా లగచర్ల గిరిజనులను పోలీసులు హింసించారు.
హీర్యానాయక్ కు ఛాతిల గుండెనొప్పి వస్తే బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకుపోయిన నికృష్ణ ప్రభుత్వం రేవంత్ రెడ్డిది. దారుణాతి దారుణంగా కిరాతకంగా మానవ మృగాల మాదిరి లెక్క రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యం లాగా పనిచేస్తున్న కొంతమంది పోలీసులు లగచర్ల ఆడబిడ్డలతో అసభ్యంగా ప్రవర్తించారు. వీటిని ప్రశ్నించిన మా నాయకుడు నరేందర్ రెడ్డిని 37 రోజులు అక్రమంగా జైల్లో పెట్టారు.
ప్రభుత్వ దమనకాండకు బలైన లగచర్ల రైతులు తెలంగాణ భవన్ కు వస్తే న్యాయం దక్కేలా చూస్తామని వాళ్లకు మా పార్టీ తరపున మాటిచ్చాం. లగచర్ల బాధితులను ఢిల్లీ దాకా తీసుకుపోయి మానవ హక్కుల కమీషన్, జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్, జాతీయ మహిళా కమిషన్ ను మా పార్టీ నేతలు కలిశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన దుర్మార్గమైన పనిని దేశం దృష్టికి బీఆర్ఎస్ తీసుకుపోయింది. దేశంలో ఇంకా న్యాయం, ధర్మం బతికే ఉన్నాయి. మానవత్వం కూడా మిగిలే ఉన్నదని ఎన్.హెచ్.ఆర్.సి రిపోర్ట్ తో స్పష్టం అయింది.
హెచ్.సి.యూ భూముల విషయంలోనూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారాన్ని అడ్డం పెట్టుకుని బడా ఆర్థిక మోసానికి పాల్పడిందని మొన్ననే సుప్రీం కోర్టు నియమించిన సెంట్రల్ ఎంపవర్ కమిటీ నివేదిక ఇచ్చింది. నిన్ననే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా అధికారం మదంతో విర్రవీగుతున్న రేవంత్ రెడ్డి చెంప మీద కొట్టినట్టుగా రిపోర్ట్ ఇచ్చింది.
రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యం లాగా పనిచేస్తున్న కొంతమంది పోలీసులు ఆనాడు లగచర్ల ఆడబిడ్డల మీద, అమాయక గిరిజన సోదరుల మీద పాశవికంగా దాడి చేశారని ఎన్.హెచ్.ఆర్.సి రిపోర్ట్ ఇచ్చింది. సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని ఎన్.హెచ్.ఆర్.సి బాధ్యులైన పోలీసుల మీద చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది రేవంత్ రెడ్డి అల్లుడిదని చెప్పుకుంటున్న ఫార్మస్యూటికల్ కంపెనీ కోసం పేదల భూములు గుంజుకునే ప్రయత్నాన్ని ఎన్.హెచ్.ఆర్. సి అభిశంసించింది.
ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మాత్రమే కాదు, కొడంగల్ ఎమ్మెల్యేగా కూడా రేవంత్ రెడ్డి ఉన్నాడు. అట్లనే హోంమంత్రి కూడా రేవంత్ రెడ్డినే. స్థానిక ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి సిగ్గుపడాలి. ఇజ్జతుంటే రాష్ట్ర హోంమంత్రిగా పోలీసులు దౌర్జన్యానికి ముక్కు నేలకు రాయాలి, సిగ్గు,శరం ఉంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి