– కేసీఆర్ బాధితులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను స్వయంగా అందజేసిన మంత్రి పొంగులేటి
వాసాలమర్రి, హైదరాబాద్: వాసాలమర్రి గ్రామాన్ని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగమాగం చేస్తే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని రాష్ట్ర రెవెన్యూ,గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రిలో అర్హులైన 205 మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంత్రి మంజూరీ పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి నెరవేర్చలేదని విమర్శించారు.
నాడు గ్రామస్తులతో కేసీఆర్ సంహపంక్షి భోజనం చేసి, ఆగవ్వ అనే వృద్ధురాలిని పక్కన కూర్చోబెట్టుకొని ఇల్లు కట్టిస్తానని ఇచ్చిన హామీ నెరవేర్చలేదని ఇప్పుడు ఆగవ్వ మాటల్లోనే వింటుంటే ఎంతో బాధ కలిగిందన్నారు. ఆగవ్వ చెప్పినట్టు కేసీఆర్ చేసిన పచ్చి మోసం బట్టబయలు అయ్యిందని అన్నారు. కేసీఆర్ మాటలు నమ్మి ఆగవ్వతో పాటు వాసాలమర్రి గ్రామస్తులందరూ ఆగమమయ్యారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
ఇందిరమ్మ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వాసాలమర్రిని అన్ని విధాలుగా ఆదుకుంటూ అర్హులైన పేదలందరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరీ చేస్తుందన్నారు. వాసాలమర్రి లాగానే ఇండ్లు ఇస్తామంటూ బొమ్మను చూపి ఓట్లు వేయించుకున్న కేసీఆర్ ఏ ఒక్క ఊరికి ఇండ్లు ఇవ్వకుండా రాష్ట్రాన్ని అధోగతి పాల్జేశారని విమర్శించారు.
రాష్ట్రాన్ని 8 లక్షల కోట్లకు పైగా అప్పుల ఊబిలో ముంచితే ప ప్రభుత్వం అసలు, మిత్తి రూ. 6500 కోట్లు ప్రతి నెలా చెల్లిస్తుందన్నారు. ఆర్ధిక ఇబ్బందులు ఎన్నివున్నా ఇచ్చిన హామీల మేరకు అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నామని తెలిపారు.
భవిష్యత్తులో కూడా ఇచ్చిన ప్రతి ఒక్క హామీని ఇందిరమ్మ ప్రభుత్వం ప్రతి ఇంటి గుమ్మానికి చేరుస్తుందని మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా ఇంటి నిర్మాణపనులు మొదలు పెట్టడానికి డబ్బులు కూడా లేవని ఆగవ్వ చెప్పడంతో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి వెంటనే లక్ష రూపాయలు అందజేశారు. తక్షణమే ముగ్గు పోసి పనులు చేపట్టాలని సూచించారు. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి మంత్రి అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి , ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య , భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి , రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ ఛైర్ పర్సన్ బండ్రు శోభారాణి , జిల్లా కలెక్టర్ , సంబంధిత శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.