Suryaa.co.in

Telangana

కేసీఆర్ డబ్బును, మద్యాన్ని నమ్ముకున్నారు

బీజేపీ, బీఆరెస్ పోటీ పడి ఉప ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చు చేశాయి
డబ్బు, మద్యంతో ఉప ఎన్నికలు గెలిచిన చరిత్ర బీఆర్‌ఎస్‌ది
ప్రవళ్లికది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే
ఫోరెన్సిక్ నివేదిక రాక ముందే.. డీసీపీ ప్రెస్ మీట్ ఎలా పెడతారు
డీసీపీ పై ఎన్నికల కమిషన్ కు పిర్యాదు చేస్తాం
30 లక్షల మంది నిరుద్యోగులు తలుచుకుంటే ఇందిరమ్మ రాజ్యం వస్తుంది
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

కేసీఆర్ ఎన్నికల్లో గెలవడానికి డబ్బు, మద్యాన్ని నమ్ముకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. మ్యానిఫెస్టో చూపించి ఓట్లు అడిగేందుకు బీఆర్‌ఎస్ సిద్ధమా? అని సవాల్ విసిరారు. మద్యం, డబ్బు పంపిణీ చేయకుండా ఎన్నికలకు వెళ్దామని అమరవీరుల స్థూపం వద్ద ప్రమాణం చేద్దామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు, రేవంత్ రెడ్డి ఆదివారం సవాల్ విసిరారు.

అందుకు తగ్గట్టుగానే రేవంత్ రెడ్డి మేరకు మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంటకు అమరవీరుల స్తూపం వద్దకు చేరుకున్నారు. అయితే ఎలక్షన్ కోడ్ పేరుతో రేవంత్ రెడ్డిని పోలీసులు అడుకున్నారు. అమరవీరుల స్థూపం వద్దకు అనుమతించకుండా రేవంత్ రెడ్డిని గాంధీభవన్ కు తరలించారు. తర్వాత రేవంత్ రెడ్డి గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు.

కేటీఆర్, హరీశ్ రావు పదే పదే కాంగ్రెస్‌ పార్టీ మీద ఆరోపణలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. పక్క రాష్ట్రాల నుంచి కాంగ్రెస్‌కు కోట్లకొద్దీ కరెన్సీ కట్టలు వస్తున్నాయని తమపై ఆరోపణలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. ఎక్కడ డబ్బులు దొరికినా కాంగ్రెస్‌వే అని ప్రచారం చేస్తున్నారని, తమ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు, మందు పంచి ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్ చూస్తోందని ఆరోపిస్తున్నారని మండిపడ్డారు.

హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో డబ్బు, లిక్కర్ పంచి ఎన్నికల్లో గెలవాలని చూశారన్నారు. బీజేపీ, బీఆరెస్ పోటీ పడి ఉప ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చు చేశాయన్నారు. హుజూరాబాద్, మునుగోడు ఉపఎన్నికలను దేశ ప్రజలంతా చూశారని, అక్కడ వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తే, అధికార పార్టీకి పోటీ బీజేపీ అలాగే ఖర్చు చేసిందన్నారు. ఇక్కడ కేసీఆర్ ప్రొటెక్షన్ మనీ కింద తమకు ఇచ్చిన మొత్తాన్ని బీజేపీ ఉపయోగించిందన్నారు.

తమకు డబ్బులు రాలేదని అక్కడి ప్రజలు ధర్నా చేసేందుకు రోడ్డెక్కిన సందర్భాలు చూశామని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ పోటీ పడి ఓటుకు రూ.5 వేల నుంచి రూ.10 వేలు ఇచ్చి, రూ.10 వేల కోట్ల వరకు ఖర్చు చేశాయన్నారు. మునుగోడు నియోజకవర్గ పరిధిలోని వైన్స్ దుకాణాల్లో ప్రతి నెల రూ.60 కోట్ల మద్యం విక్రయాలు జరిగేవని, కానీ మునుగోడు ఉప ఎన్నిక సమయంలో 20 రోజుల్లోనే రూ.300 కోట్ల విక్రయాలు జరిగాయని ఆరోపించారు.

మునుగోడులో కాంగ్రెస్ చుక్క మందు, రూపాయి డబ్బు కూడా పంచలేదని స్పష్టం చేశారు. దేశంలోనే హుజూరాబాద్ అత్యంత ఖరీదైన ఎన్నికలని ఆనాడు విశ్లేషకులు చెప్పారని గుర్తు చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో అంతకంటే ఎక్కువ ధన ప్రవాహం జరిగిందన్నారు రేవంత్ రెడ్డి.

అందుకే తమపై ఆరోపణలు చేస్తున్న కేసీఆర్‌కు సూటిగా సవాల్ విసిరానన్నారు రేవంత్ రెడ్డి. చుక్క మందు, డబ్బు పంచకుండా ఎన్నికలు నిర్వహించాలని సవాల్ విసిరానని తెలిపారు.

మంచి సంప్రదాయాన్ని అందిద్దామనే ఉద్దేశ్యంతో ఆయనను అమరవీరుల స్థూపం వద్దకు ఆహ్వానిస్తే ఆయన రాలేదన్నారు. అమరవీరుల స్థూపం దగ్గరకు వచ్చి ప్రమాణం చేద్దామని ఆహ్వానించానని తెలిపారు. కేసీఆర్ రాకపోగా… అమరుల స్థూపం వద్దకు వెళితే నన్ను అరెస్టు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు అనుమతి పేరుతో పోలీసులు నిర్బంధించారన్నారు. తెలంగాణ ప్రజలు కోరింది స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అభివృద్ధి అని, నీళ్లు, నిధులు, నియామకాలను కేసీఆర్ తన కుటుంబానికే పరిమితం చేశారని ఆరోపించారు.

తాము విసిరిన సవాల్ స్వీకరించకపోవడంతో… కేసీఆర్ ఎన్నికల్లో డబ్బు, మద్యాన్ని నమ్ముకున్నారని స్పష్టత వచ్చిందని తెలిపారు. కేసీఆర్ మాయ చేసి ఎన్నికల్లో నెగ్గాలని చూస్తున్నారన్నారు. కేసీఆర్ నమ్ముకున్నది ప్రజలను కాదని… మద్యాన్ని, డబ్బును నమ్ముకున్నారన్నారు రేవంత్ రెడ్డి.

డబ్బు, మద్యంతో ఉప ఎన్నికలు గెలిచిన చరిత్ర బీఆర్‌ఎస్‌ది అని, డబ్బు, మద్యం పంచి ఎన్నికలు గెలవాలని తాము ఎప్పుడూ అనుకోలేదన్నారు రేవంత్ రెడ్డి. రేపటి ఎన్నికల్లో సిద్ధాంతాలు ప్రచారం చేసి ఓట్లు అడుగుతామని, మ్యానిఫెస్టో చూపించి ఓట్లు అడిగేందుకు బిఆర్‌ఎస్ సిద్ధమా? అని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.

నిన్న గన్ పార్క్ వద్ద నిరసనలు చేసినవారికి నిబంధనలు వర్తించవా? కాంగ్రెస్ ను తిట్టి ధర్నా చేసే వారికి రిటర్నింగ్ అధికారి అనుమతి అవసరం లేదా? అని ఆయన ప్రశ్నించారు. రిటైర్ అయిన అధికారులను ప్రభుత్వం ఎందుకు కొనసాగిస్తోంది. వారిని ప్రయివేట్ సైన్యంగా చేసుకుని కేసీఆర్ మాపై దాడులు చేయిస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ వైఖరిపై.. తెలంగాణ పోలీసుల తీరుపై రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కార్ నిరంకుశ పాలన చేస్తోందని విమర్శించారు. నిరుద్యోగ యువతి ప్రవళిక ఆత్మహత్య చేసుకుంటే… ఆ కుటుంబం పరువును మంటగలిపేలా ప్రభుత్వం వ్యవహరించిందని, ప్రేమ విఫలమై చనిపోయిందని పోలీసు అధికారి ఎలా చెబుతారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

ప్రవళ్లికది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని చెప్పారు. కేసీఆర్ పాలనలో నిరుద్యోగ యువత నరకం అనుభవిస్తోందని అన్నారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ప్రవళ్లిక గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రవళిక విషయంలో ప్రెస్ మీట్ పెట్టిన డీసీపీపై కేసు పెడతామన్నారు.

అమ్మాయి ఫోన్ సీజ్ చేస్తే సమాచారం ఎలా బయటకు వచ్చిందని నిలదీశారు. ఫోన్ ఓపెన్ చేయాలంటే.. కోర్టు అనుమతి తీసుకోవాలని అన్నారు. ఫోన్ సమాచారం పై ఫోరెన్సిక్ నివేదిక రాక ముందే.. డీసీపీ ప్రెస్ మీట్ ఎలా పెడతారని నిలదీశారు.

డీసీపీ పై ఎన్నికల కమిషన్ కు పిర్యాదు చేస్తామని తెలిపారు. నిరుద్యోగ యువకులారా సంబంధిత పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేయండి. కాంగ్రెస్ లీగల్ విభాగం వారికి సహాయ సహకారాలు అందిస్తుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

ప్రవళ్లిక కుటుంబ సభ్యులను రేపు రాహుల్ గాంధీ వద్దకు తీసుకెళ్లాలనుకుంటే… బీఆరెస్ నేతలను పంపి ఆకుటుంబాన్ని ప్రగతి భవన్ లో బంధిస్తారట కేసీఆర్ ఇంతటి దిగజారుడు చర్యలకు పాల్పడుతున్నారు అని రేవంత్ రెడ్డి విమర్శించారు.

“నిరుద్యోగ యువకులారా మీ శక్తిని తక్కువ అంచనా వేయకండి… 30 లక్షల నిరుద్యోగ యువకులారా … ఇక్కడి నుంచి పిలుపునిస్తున్నా ఈ 45 రోజులు ప్రతీ నిరుద్యోగ యువకుడు ముందుకొచ్చి కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగాలను ఊడగొట్టాలి” అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

తెలంగాణలో ఉన్న 30 లక్షల మంది నిరుద్యోగులు తలుచుకుంటే ఇందిరమ్మ రాజ్యం వస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. 30 లక్షల మంది నిరుద్యోగులకు విజ్ఞప్తి చేస్తున్నానని, మీ ఓటు, మీ కన్నతల్లిదండ్రుల ఓటు కలుపుకుంటే దాదాపు 90 లక్షల ఓట్లు అవుతాయని, ఈ ఓట్లు పడితే చాలు 90 సీట్లు వస్తాయని పిలుపునిచ్చారు. ఇక ఎవరి ఓటు అవసరం లేదన్నారు. మీ ఓటు వేసి కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగం ఊడగొడితే చాలన్నారు. కాబట్టి నిరుద్యోగులే కథానాయకులై, మీరు కదనరంగంలోకి దిగి, మీరే ఇందిరమ్మ రాజ్యం తీసుకు రావాలన్నారు రేవంత్ రెడ్డి.

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే జాబ్ క్యాలండర్ ప్రకారం ఉద్యోగ నియామకాలు చేపడుతుందన్నారు రేవంత్ రెడ్డి. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది..ఒక ఆడబిడ్డ కుటుంబాన్ని అవమానించేలా వ్యవహరించిన ప్రభుత్వానికి బుద్ది చెప్పాలి అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

బస్సు యాత్రలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేపట్టనున్న బస్సు యాత్రలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాల్గొనన్నారు. అందులో భాగంగా రేపు సాయంత్రం 4 గంటలకు రామప్ప దేవాలయాన్ని దర్శించుకుంటారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను శివుడి ముంది పెట్టి పూజిస్తారన్నారు. శివుడిపై నాకూ విశ్వాసం ఉంది. శివుడిని దర్శించుకుని బస్సు యాత్ర మొదలు పెడతామని వ్యాఖ్యానించారు. మొదటి రోజు ములుగు, భూపాలపల్లి పరిధిలో మహిళలతో మాట్లాడి సమస్యలు తెలుసుకుంటామన్నారు. రెండో రోజు కరీంనగర్ జిల్లాలో, మూడో రోజు నిజామాబాద్ జిల్లాలో బస్సు యాత్ర ఉంటుందని రేవంత్ రెడ్డి వెల్లడించారు.

అధికారంలోకి రాగానే ఉద్యోగం..రజినీ అనే యువతికి రేవంత్ హామీ

నాంపల్లి కి చెందిన దివ్యాంగురాలు రజినీ గాంధీ భవన్ లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిశారు. పీజీ పూర్తి చేసిన ఉద్యోగం రాలేదని, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం కూడా ఇవ్వడం లేదని తన ఆవేదనను రేవంత్ తో పంచుకున్నారు. దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. డిసెంబర్ 9వ తేదీన ఏల్బీ స్టేడియంలో జరిగే కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా దివ్యాంగురాలిని కోరారు. ప్రభుత్వం ఏర్పాటు కాగానే తన అర్హతలకు తగ్గ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆరు గ్యారెంటీ స్కీముల కార్డుపై రేవంత్ రెడ్డి స్వయంగా తన దస్తూరీతో దివ్యంగురాలి వివరాలు నమోదు చేసుకున్నారు.

రేవంత్ ను కలిసిన బోథ్ ఎమ్మెల్యే బాపురావు

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఆదిలాబాద్ జిల్లా బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మంగళవారం ఆయన నివాసంలో కలిశారు.

చేరికలు

జీహెచ్ఎంసీ పరిధిలో బీఆర్ఎస్ భారీ షాక్ తగిలింది. జీహెచ్ఎంసీలో బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంగళవారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. అదేవిధంగా షాద్ నగర్, కొడంగల్, కల్వకుర్తి నియోజకవర్గాలకు చెందిన బీఆర్ఎస్, బీజేపీ పార్టీ నాయకులు పలువురు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్ నివాసంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్ రెడ్డి.

కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన మాజీ ఎంపీపీలు రాంరెడ్డి, సాంబయ్య గౌడ్, సర్పంచ్ లక్ష్మణ్ నాయక్, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు, కార్యకర్తలు ఉన్నారు.
షాద్ నగర్ నియోజకవర్గానికి చెందిన సర్పంచులు ప్రతాప్, మంజుల, బాల్ రాజు, గోపాల్, రాములు, యాదయ్య, జహంగీర్, కౌన్సిలర్లు, ఇతర నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలానికి చెందిన పలువురు నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు.

LEAVE A RESPONSE