కిషన్ రెడ్డి వాస్తవాలు తెలుసుకోవాలి

-అడవుల విస్తరణలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం టాప్
-వన్యప్రాణుల సంరక్షణలో తెలంగాణయే భేష్

-ఇదే విషయం నీతి ఆయోగ్ నివేదికలో ఉంది
-కరోనా కాలంలోనూ పెద్ద ఎత్తున కాంపా నిధులు వినియోగించుకున్న దేశంలోనే ఏకైక రాష్ట్రం తెలంగాణ
-రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్

అడవుల విస్తరణలో తెలంగాణ రాష్ట్రం యావత్ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని వన్యప్రాణుల సంరక్షణలో తెలంగాణ రాష్ట్రమే ఏసైనా స్థానంలో ఉందని ఇదే విషయం కేంద్ర ప్రభుత్వ నీతి ఆయోగ్ నివేదికలో స్పష్టంగా ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే కాంపా నిధులను కరోనా కాలంలోనూ ( 2019-20, 2020-21, 2021-22 ) పెద్ద ఎత్తున వినియోగించుకున్న దేశంలోనే ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని వినోద్ కుమార్ తెలిపారు.

కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని వినోద్ కుమార్ సూచించారు. ఐ.ఎస్.ఎఫ్.ఆర్. నివేదిక ప్రకారం 2015-2021 కాలంలో తెలంగాణ రాష్ట్రంలో 7.7 శాతం అడవుల విస్తీర్ణం పెరిగిందని, 2019-2021 కాలంలో 3.07 శాతం అడవుల విస్తీర్ణం పెరిగిందని వినోద్ కుమార్ తెలిపారు. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం ఎస్.డీ.జీ. 4వ ర్యాంక్ లో మెరుగు పడిందని, ఐ.ఎస్.ఎఫ్.ఆర్. నివేదిక ప్రకారం అటవీ ప్రాంతంలో నీటి లభ్యత పెరిగిందని, అటవీ ప్రాంతంలో గిరిజనులకు, మహిళలకు ఉపాధి అవకాశాలు పెరిగాయని వినోద్ కుమార్ వివరించారు.

తెలంగాణ రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం పెరిగిందని, గ్రీనరీ పెరిగిందని, వన్యప్రాణుల సంరక్షణ బాగుందని, కాంపా నిధుల వినియోగం బాగుందని పార్లమెంటులో కేంద్ర మంత్రులు పలుమార్లు పేర్కొన్న విషయం తెలుసుకోవాలి అని వినోద్ కుమార్ అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసే ముందు ఒకటికి నాలుగు సార్లు వాస్తవాలను తెలుసుకుంటే మంచిది అని, మీరు చేసిన ప్రకటన సరి చూసుకోవాలని వినోద్ కుమార్ సూచించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కానీ, ఇతర రాష్ట్రాల్లో కానీ కాంపా నిధుల వినియోగంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివేదికలను వెల్లడించాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.

Leave a Reply