– ఎంబీబీఎస్ చదువు బాధ్యత తీసుకున్న కేటీఆర్
– అనాథ విద్యార్థి గణేష్కు తక్షణ సహాయంగా రూ. 1.50 లక్షల ఆర్థిక సాయం
– ఎంబీబీఎస్ పూర్తి ఖర్చు భరించేందుకు కేటీఆర్ హామీ
– అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేసిన బీఆర్ఎస్ నాయకులు
– కేటీఆర్ ఆదేశాల మేరకు తక్షణ సాయంగా రూ. 1,50,000 చెక్కు అందజేసిన మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్
వరంగల్: ఎంబీబీఎస్ కలను సాకారం చేసేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మానవత్వంతో ముందుకు వచ్చారు. ఆర్ముళ్ల గణేష్ అనే ఆ విద్యార్థి పూర్తి వైద్య విద్య ఖర్చును తామే భరిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు, తొలి విడతగా అడ్మిషన్ ఫీజు కోసం అవసరమైన రూ. 1,50,000 ను బీఆర్ఎస్ నాయకులు సోమవారం రోజున గణేష్కు అందించారు.
అమ్మమ్మ చెంతనే పెరిగిన సరస్వతి పుత్రుడు
వరంగల్లోని పశ్చిమ నియోజకవర్గం, పెద్దమ్మగడ్డకు చెందిన ఆర్ముళ్ల గణేష్ చిన్నతనంలోనే తల్లిదండ్రులను, తోబుట్టువును కూడా కోల్పోయి, తన అమ్మమ్మ ఇంట్లో పెరిగాడు. పేదరికం వెంటాడుతున్నప్పటికీ, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోనే చదివి, పట్టుదలతో కష్టపడి ఎంబీబీఎస్ ఫ్రీ సీటు (ప్రతిమ రిలీఫ్ మెడికల్ కాలేజీలో) సాధించాడు. అయితే, ఈ నెల 6వ తేదీ లోపు ట్యూషన్ ఫీజు, డిపాజిట్ కింద రూ. 1,50,000 చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గడువులోగా డబ్బు చెల్లించకపోతే సీటు కోల్పోయే ప్రమాదం ఉందని తెలుసుకున్న కొందరు సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులు కేటీఆర్కు ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు.
ట్వీట్కు స్పందించిన కేటీఆర్
విజ్ఞప్తి అందిన వెంటనే కేటీఆర్ చలించిపోయారు. విద్యార్థి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, వెంటనే స్పందించి, గణేష్ ఎంబీబీఎస్ చదువు పూర్తి బాధ్యత బీఆర్ఎస్ పార్టీ తరపున తానే తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో, బాలసముద్రంలోని హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ గారు సోమవారం రోజున గణేష్ను, అతని మామ దేవదాసును కలిశారు. కేటీఆర్ ఆదేశాల మేరకు తక్షణ సాయంగా రూ. 1,50,000 చెక్కును వారికి అందజేశారు.
ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ… సాయం అవసరమైన వేలాది మందికి అండగా నిలిచిన మనుసున్న నేత కేటీఆర్ గారు అని కొనియాడారు. కేటీఆర్ ఆదేశాల మేరకు తాము నేరుగా ప్రతిమ రిలీఫ్ మెడికల్ కాలేజీకి వెళ్లి, ఈ తక్షణ సాయంతో గణేష్ అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేశామని తెలిపారు. భవిష్యత్తులో ఎంబీబీఎస్ చదువు పూర్తి అయ్యేంత వరకు అయ్యే ఖర్చును మొత్తం కేటీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ తరపున అందిస్తారని ఆయన హామీ ఇచ్చారు.
ఉద్యమనేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్ఫూర్తితోనే బీఆర్ఎస్ పేద ప్రజల కష్టాలకు స్పందిస్తుందని వినయ్ భాస్కర్ అన్నారు. పేదలకు విద్య, వైద్యం అందేలా కేసీఆర్ పదేళ్ల పాలనలో కృషి చేశారని, అదే సంస్కృతిని కేటీఆర్ కొనసాగిస్తున్నారని తెలిపారు.
అందిన సహాయానికి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతూ .. విద్యార్థి ఆర్ముళ్ల గణేష్ భావోద్వేగానికి గురయ్యాడు. “ఆపద అని వస్తే కాపాడే ధైర్యం, కష్టం అని తెలిస్తే తీర్చే మంచితనం కేటీఆర్ అన్నది. నేనున్నా అని చదువు ఖర్చు అంతా నేను చూసుకుంటా అని అన్న కేటీఆర్ అన్నకు, సాయం చేసిన వినయన్నకు ప్రత్యేక ధన్యవాదాలు” అని ఆయన కృతజ్ఞతలు తెలియజేశాడు.
గణేష్ కోసం ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేసిన జర్నలిస్ట్ బొలెపాక రాజేష్కు, అతని మామ దేవదాసు , పాస్టర్ స్వామి దాసు , ఈ పరిస్థితిని కేటీఆర్కు చేరవేసిన దామెర అక్షయ్కు వినయ్ భాస్కర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు.