కాశ్మీరంలోనే కుంకం పువ్వెందుకు పూస్తుందో నాకర్థమైపోయింది !
అక్కడ ఉన్నట్టుండి
పాకే పాకే పసిబిడ్డ
నెత్తురు ముద్దై పోతుంది
సామగానం చేసే
కాశ్మీరీ పండితుల కంఠాల్లోంచి
వేదం ఆగి – రుధిరం బైటికొస్తుంది
అక్కడ రేపు పల్లకీ లెక్కి
ఊరేగాల్సిన పెళ్ళికొడుకులు
ఇవాళే పాడెక్కుతారు…
ఆ లోయలో
హిమాలయాలు సైతం
మూర్తీభవించిన
వైధవ్యాల్లా ఉంటాయ్
భరతమాత కిరీటం
వొరుసుకునీ
నిరంతరం అక్కడ
నెత్తురోడుతూ ఉంటుంది !
బుద్ధుడు కూడా
కళ్ళూ నోరూ మూసుకుని
మళ్ళీ అంతర్ముఖుడౌతాడు !!
( ప్రముఖ రచయిత, నటుడు తనికెళ్ల భరణి ఎప్పుడో 40 ఏళ్ళ క్రితం రాసిన కవిత, ఇంకా తడిగానే ఉంది!! )
– సేకరణ: మైలరవపు మనోరమ
నరసరావుపేట