– ల్యాండ్, శాండ్, మైన్, వైన్.. అన్నంటా అవినీతి రాజ్యమే
– రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో వ్యవస్థలను నాశనం చేస్తున్నారు
– తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి ఆర్కే రోజా
తాడేపల్లి: కూటమి ప్రభుత్వ పాలనా వైఫల్యాలు, అవినీతి, అక్రమాలపై ప్రజల దృష్టి మళ్ళించేందుకు చంద్రబాబు తనకు అలవాటైన డైవర్షన్ పాలిటిక్స్ను పదేపదే అమలు చేస్తున్నారని మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. డీజీపీ కేడర్లో ఉన్న పీఎస్ఆర్ ఆంజనేయులును అరెస్ట్ చేయడం కూడా దీనిలో భాగమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన పీఎస్ఆర్ ఆంజనేయులుని అరెస్ట్ చేయడం చూస్తుంటే.. ఈ కూటమి ప్రభుత్వం రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో ఎటువంటి అరాచకాలకు పాల్పడుతుందో అర్ధం చేసుకోవచ్చు. చంద్రబాబు, లోకేష్ ల చేత నెత్తిన కిరీటం పెట్టించుకోవాలని తహతహలాడుతూ తప్పుడు కేసులు పెడుతున్న పోలీసులంతా భవిష్యత్తు గురించి కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. రాబోయేది మళ్లీ వైయస్సార్సీపీ ప్రభుత్వమే. జగన్ సీఎం అయ్యాక తప్పు చేసిన వాళ్లు ఎవరైనా సరే వదిలే ప్రసక్తే లేదు. న్యాయస్థానం ముందు నిలబెట్టి జైళ్లకు పంపుతాం.
చంద్రబాబు చేస్తున్న అవినీతిపై అమరావతిలో నిర్మాణాల భూమిపూజకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ దృష్టి సారించాలి. గతంలో అమరావతి కోసం రూ. 36 వేల కోట్లతో టెండర్లు పిలిచి భూమి పూజ చేశారు. ఇప్పుడు అవే టెండర్లను రూ. 77 వేల కోట్లకు పెంచి మళ్లీ ప్రధాని మోడీని భూమి పూజకు పిలుస్తున్నారు.
ఆయన, ఆయన బినామీలు, ఆయన సామాజిక వర్గం తప్ప ఇంకెవరూ రాజధానిలో ఉండటానికి అర్హులు కాదా? చేతికి వాచీ లేదు, జేబులో డబ్బుల్లేవని చెప్పే చంద్రబాబు రాజధానిలో 5 ఎకరాల భూమి రూ. 150 కోట్లతో ఎలా కొనుగోలు చేశా రు ? నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుకి ఆయన పార్టనర్ పవన్ కళ్యాన్ కి ఇన్నేళ్లలో ఆంధ్రాలో ఇళ్లు కట్టుకోవాలనిపించలేదు ఇప్పటికీ వీకెండ్ వచ్చిందంటే చాలు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వెళ్లిపోతారు. రాజకీయాలు చేసేది ఏపీలో, నివాసం ఉండేది హైదరాబాద్లోనా?
‘ఉర్సా’కిచ్చిన భూ కేటాయింపులు రద్దు చేయాలి
కూటమి ప్రభుత్వం వచ్చాక విశాఖను సర్వనాశనం చేస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని బీసీ మహిళ అని కూడా చూడకుండా విశాఖ మేయర్ పదవి నుంచి దించేశారు. ఉర్సా అనే 60 రోజులు ముందు పుట్టిన సూట్ కేస్ కంపెనీకి రూ. 3వేల కోట్లు విలువ చేసే 60 ఎకరాల భూమిని ధారాదత్తం చేశారు. నారా లోకేష్ ఐటీ మంత్రిగా ఉండగా ఆయన ప్రమేయం లేకుండా ఈ భూ కేటాయింపు జరిగి ఉండే అవకాశమే లేదు. టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని ఆయన పార్టనర్కి చెందిన డొల్ల కంపెనీకి 60 ఎకరాలు ఎలా ఇచ్చారు? ఈ కంపెనీకి అమెరికాలో కూడా సరైన కార్యాలయం కూడా లేదు. ఇది దోపిడీ కాదా? ఈ కంపెనీకి ఇచ్చిన భూ కేటాయింపులను కూడా వెంటనే రద్దు చేయాలి.
పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదు?
రాష్ట్రంలో వరుసగా ఆలయాలపై, హిందూ ధర్మంపై దాడులు జరుగుతున్నా సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తానని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడో అంతుబట్టడం లేదు. అవసరమైనప్పుడు మాత్రమే సనాతన ధర్మాన్ని గుర్తు చేసుకుంటారా? దళితుల మీద దాడులు జరుగుతుంటే పవన్ కళ్యాణ్ స్పందించడం లేదు.
ఆలయాల మీద దాడులు జరుగుతుంటే మాట్లాడటం లేదు. తన నియోజకవర్గం సహా రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల మీద అఘాయిత్యాలు జరుగుతుంటే పట్టించుకోవడం లేదు. సినిమా ఫంక్షన్లో అభిమానులు చనిపోతే అభిమానుల కుటుంబాలను పరామర్శించలేదు. బాధిత కుటుంబాలను ఆయన ఉన్నచోటకే పిలిపించినా సరే మాట్లాడకుండా వెళ్లిపోయారు .