Suryaa.co.in

Andhra Pradesh

అంబేద్కర్ అడుగుజాడల్లో నడుద్దాం

– అసమానతలు లేని సమాజాన్ని నిర్మిద్దాం
– అంబేద్కర్ జయంతి వేడుకలో పాల్గొన్న మంత్రి సుభాష్

రామచంద్రపురం : భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తూ, అసమానతలు లేని సమాజాన్ని నిర్మిద్దామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు. మంగళవారం రామచంద్రపురం నియోజవర్గంలోని చోడవరం గ్రామంలో జరిగిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలో మంత్రి సుభాష్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తొలుత బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి సుభాష్ మాట్లాడుతూ భారతీయ సమాజానికి అంబేద్కర్ సూచించిన మార్గం ఎప్పటికీ ఆదర్శప్రాయమైనదిగా నిలిచిపోతుందని అన్నారు. భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య, గణతంత్ర, లౌకిక రాజ్యంగా వికసించడంలో అంబేద్కర్ కృషి అమోఘమని కొనియాడారు. దేశానికి ఆయన అందించిన సేవలు నిరుపమానమని గుర్తుచేసుకున్నారు.

కులతత్వం, అంటరానితనం, అసమానతలు లేని సమాజం కోసం ఆయన అనునిత్యం పరితపించారని స్మరించుకున్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగాన్ని రూపొందించి దేశానికి అందించిన మహా మేధావిగా అభివర్ణించారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 14న ప్రపంచ విజ్ఞాన దినోత్సవం (నాలెడ్జ్ డే) గా ఐక్యరాజ్యసమితి నిర్ణయించి పాటిస్తుందన్నారు. ఆ మహనీయుని బాటలో నేటి యువత సాగిపోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు, దళిత సంఘాల నేతలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

LEAVE A RESPONSE