Suryaa.co.in

Telangana

కాంగ్రెస్‌ తడాకా దేశానికి చాటుదాం

 -తుక్కుగూడ కాంగ్రెస్‌ జనగర్జనలో కదం తొక్కుదాం
-చారిత్రాత్మక సభలో దేశానికి దిశానిర్దేశం
-బీఆర్‌ఎస్‌ ప్రతిపక్ష పార్టీగా కూడా పనికిరాదు
-ఫోన్‌ ట్యాపింగ్‌పై పద్ధతి ప్రకారం చర్యలు
-ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ మాట నిలబెట్టుకున్నాం
-64.75 లక్షల మందికి రైతు బంధు జమ
-టీపీపీఎస్సీని ప్రక్షాళన చేశాం..మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు
-డ్రగ్స్‌ ఫ్రీ నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతాం
-డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్‌ తుక్కుగూడలో గురువారం కాంగ్రెస్‌ పార్టీ శుక్రవారం నిర్వహించనున్న జన గర్జన సభ వేధికను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరిశీలించారు. అనంతరం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడిరచారు. తుక్కుగూడ సభ ఈ దేశానికి దిశా నిర్దేశం చేయనుం దని, దేశంలోనే ఈ సభ చారిత్రాత్మకం కానుందని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టో ను తుక్కుగూడ సభ నుంచే ఏఐసీసీ నాయకత్వం ప్రకటించనుందన్నారు. దేశంలో ప్రజాస్వా మ్య పరిరక్షణకు ఏకైక దిక్కు కాంగ్రెస్‌ మాత్రమేనని పునరుద్ఘాటించారు.

తెలంగాణ రాష్ట్రం మన అందరిది..స్వేచ్ఛగా, స్వతంత్రంగా బతికే ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తుందని, అవాస్తవాలు మాట్లాడే బీఆర్‌ఎస్‌ ప్రతిపక్షంగా కూడా పనికిరాదని విమర్శించారు. పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్‌ నాయకులు గత పాపాలకు బాధ్యత లేదంటే ఎలా నమ్ముతారని వ్యాఖ్యానించారు. దేశ భద్రతకు వాడాల్సిన కమ్యూనికేషన్‌ వ్యవస్థను గత పాలకులు వ్యక్తిగత అవసరాలకు వినియోగించి దేశ భద్రతకు ప్రమాదం తెచ్చారని దుయ్యబట్టారు. వ్యక్తిగత కుటుంబ జీవితాలు, వ్యాపారవేత్తలు, అధికారులు, జడ్జీలు ఏం మాట్లాడుకుంటున్నారో నిబంధనలకు విరుద్ధంగా తెలుసుకున్నారు…జరిగిన నష్టానికి పద్ధతి ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు.

కేసీఆర్‌లా తప్పుకోలేదు… హామీలు అమలు చేశాం
జూన్‌ మాసంలో వచ్చిన వర్షాలను కేసీఆర్‌ ఒడిసి పట్టలేదని, అవసరం లేకున్నా గొప్పల కోసం నాగార్జున సాగర్‌ నీటిని కిందికి వదిలారని విమర్శించారు. నిర్మాణ లోపంతో కాళేశ్వరంలో గోదావరి నీటిని కిందికి వదలాల్సి వచ్చిందని, కేసీఆర్‌ తప్పిదాల వల్ల రాష్ట్రం ఇబ్బంది పడుతోందని దుయ్యబట్టారు. గత ఎన్నికలకు ముందు తుక్కుగూడ సభ నుంచే ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, సోనియా, రాహుల్‌, ప్రియాంక గాంధీలు ఇచ్చిన ఆరు గ్యారంటీల ను దేశమే ఆశ్చర్యపోయేలా అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. హామీల అమలులో ఒక్క రోజు ఆలస్యమైనా ఆలస్యమే అని భావించి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి తెచ్చాం… నిరుపేదల ఆరోగ్యం కోసం రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షల పెంచుతూ నిర్ణయం తీసుకున్నామన్నారు. కేసీఆర్‌ మాదిరిగానే హామీలు అమలు చేయకుండా దిగిపోతారని అనుకున్నారని, ఎవరి ఊహకు అందని విధం గా అడగకముందే రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ భారతదేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా అమలు చేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వం డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల కోసం దశాబ్దకాలం పాటు కల్లబొల్లి కథలు చెప్పిందని, వీళ్లు కూడా అలాగే ఉంటారు అనుకోకుండా భద్రాచల సీతారామచంద్రస్వామి, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో పూజ చేసి ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు ప్రకటించి మాట నెరవేర్చుకున్నామని వివరించారు.

డ్వాక్రా సంఘాలకు లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు
ఒక అడుగు ముందుకు వేసి ఊహలకు అందని విధంగా రాబోయే ఐదు సంవత్సరాల్లో డ్వాక్రా సంఘాలకు లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలను అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అధికారంలోకి వచ్చిన డిసెంబర్‌ 7 నుంచి మొదలు హైదరాబాద్‌ సభ వరకు డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణం మొత్తం లెక్కగట్టి చెక్కు రూపంలో అందజేశాం. అంగన్‌వాడీ, ఆశ, మధ్యాహ్న భోజన వర్కర్లకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తున్నామని వివరించారు.

64.75 లక్షల మందికి రైతు బంధు జమ
ఒక ఎకరం నుంచి మొదలుపెట్టి కేవలం మూడు నెలల్లోనే 64.75 లక్షల మంది రైతులకు రైతుబంధు మొత్తాన్ని వారి ఖాతాల్లో జమ చేశాం. మీలాగా 8 నెలలు తీసుకోలేదని లెక్కలు చెబితే బీఆర్‌ఎస్‌ నేతలు నోరు మూసుకున్నారని వ్యాఖ్యానించారు. రైతు బీమా కింద 1500 కోట్ల ప్రీమియం ప్రభుత్వమే చెల్లించిందని, ప్రతినెలా ఒకటో తేదీనే ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాలు అంద జేస్తున్నామన్నారు.

థేమ్స్‌ నది మోడల్‌గా మూసీ నది..విద్యుత్‌ వ్యవస్థను సరిచేశాం
మూసీ నదిని పునరుజ్జీవింపచేసి లండన్‌లోని థేమ్స్‌ నదిని మరిపించేలా సుందరంగా తీర్చిదిద్దేలా ప్రణాళికను సిద్ధం చేసినట్లు వివరించారు. హైదరాబాద్‌ మెట్రో విస్తరణ చేపట్టామని, ధరణి వ్యవస్థను సర్వనాశనం చేసి రైతులను ఇబ్బంది పెడితే సమస్యల కు పరిష్కారాలు చూపిస్తున్నామని పేర్కొన్నారు. ఫామ్‌ హౌస్‌లో మూడు నెలలు పడుకొని బయటికి వచ్చి కరెంటు లేదంటూ మాట్లాడుతున్నారు. భద్రాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ కు పనికిరాని సబ్‌ క్రిటికల్‌ టెక్నాలజీని వాడారు. యాదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ను బొగ్గు రవాణా ప్రాంతం నుంచి 350 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేయడంతో తీవ్ర ఆర్థిక భారం పడుతుందన్నారు. డిస్కమ్‌లు, జెన్కోలు మీ పాలనలో కుప్పకూలిపోయాయని, కుప్పకూలిన విద్యుత్‌ వ్యవస్థను సరిచేసి క్షణం కూడా కరెంటు పోకుండా చూస్తున్నామని తెలిపారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందజేస్తున్నామని, 2030-31 వరకు పీక్‌ డిమాండ్‌ను అందుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వివరించారు.

మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు..డ్రగ్స్‌ ఫ్రీ సిటీగా నగరం
30 వేల ఉద్యోగాలు మూడు నెలల్లో ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానిదని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను ప్రక్షాళన చేసి అదనపు పోస్టులు కలిపి గ్రూప్‌ 1 నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు వివరించారు. హైదరాబాద్‌ను డ్రగ్‌ ఫ్రీ సిటీగా మార్చడమే మా ప్రభుత్వ లక్ష్యమన్నారు. హైదరాబాదులో డ్రగ్స్‌ మాట వినిపిస్తే తాటతీస్తాం. హైదరాబా ద్‌లో ఉన్న బిడ్డలు నిశ్చింతగా ఉండేలా కాంగ్రెస్‌ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. ఆదిలాబాద్‌ నుంచి ఖమ్మం వరకు, వరంగల్‌ నుంచి మహబూబ్‌నగర్‌ వరకు తుక్కుగూడ సభకు కదలి రావాలని, ప్రజాస్వామ్యం, హక్కుల పరిరక్షణ అంటే ఏమిటో ఈ దేశానికి జన గర్జన సభ ద్వారా చాటాలని పిలుపునిచ్చారు.

LEAVE A RESPONSE