Suryaa.co.in

Andhra Pradesh

బాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందాం

-ఇది మన కోసం కాదు.. రాష్ట్ర భవిష్యత్ కోసం
-జగన్ అన్ని వర్గాలను మోసం చేసి.. ప్రజల్ని నట్టేట ముంచారు
-ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబే రాష్ట్రాన్ని కాపాడగలరు
-క్లస్టర్, యూనిట్, బూత్ ఇంచార్జిల సమావేశంలో మాజీ మంత్రి పరిటాల సునీత

ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని.. ఇది మన కోసం కాదు.. రాష్ట్ర భవిష్యత్ కోసమని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. రామగిరి మండలం వెంకటాపురం గ్రామంలో క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్ ఛార్జిలతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న నాయకులందూ హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో పరిటాల సునీత మాట్లాడుతూ ఎన్నికలు ఎంతో దూరం లేవని.. కేవలం 15రోజులు మాత్రమే ఉన్నాయని.. ఇలాంటి పరిస్థితుల్లో మనం ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకుందామని ఆమె పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని.. ప్రతి గడపను తాకాలన్నారు. ఈ 15రోజులు కష్టపడితే మన మెజార్టీ ఇంకా పెరుగుతుందన్నారు. ఏ ఒక్కరూ నిర్లక్ష్యం వహించవద్దన్నారు. ఎక్కడా అతి విశ్వాసానికి పోవద్దని.. ప్రత్యర్థి పార్టీకి చిన్న అవకాశం కూడా ఇవ్వొద్దన్నారు…

అన్ని వర్గాల కోసం చంద్రబాబును మళ్లీ రప్పిద్దాం

ఇదే సమావేశంలో పరిటాల సునీత రాష్ట్రంలో గత ఐదేళ్లలో ఏ వర్గానికి ఎంత అన్యాయం జరిగిందన్నది వివరించారు. ముఖ్యంగా మహిళలకు ఎంతో చేశానని చెప్పుకుంటున్న జగన్ అసలు స్వరూపం ఏంటన్నది తెలియజేశారు. చంద్రబాబు హాయంలో 5 లక్షల వరకు వడ్డీలేని డ్వాక్రా రుణాలు ఇస్తే.. జగన్ మాత్రం రూ.3 లక్షలకు కుదించారన్నారు. అలాగే మద్యపాన నిషేదం అని చెప్పిన జగన్ 60రూపాయలు ఉన్న క్వార్టర్ బాటిల్ ను 120రూపాయలకు విక్రయిస్తూ కోట్ల రూపాయలు అక్రమార్జన చేశారన్నారు.

అలాగే కల్తీ మద్యం విక్రయిస్తూ ప్రజల ప్రాణాలు తీస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్న క్యాంటీన్ల ద్వారా సుమారు 7.25 కోట్ల మందికి భోజనం అందించి వారి ఆకలి తీర్చిందని… అలాంటి అన్న క్యాంటీన్లను జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత నిర్దాక్షిణ్యంగా మూసేయించారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ రుణాలను రూ.4 లక్షల వరకు తాము అందిస్తే.. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత కార్పోరేషన్ లోన్స్ ను ఇవ్వడం పూర్తిగా ఆపేశారన్నారు. ఆదరణ పథకం కింద 4.26 లక్షల మందికి ఆధునిక ఉపకరణాలను టీడీపీ ప్రభుత్వం పంపిణీ చేస్తే.. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పథకాన్ని రద్దు చేశారన్నారు.

టీడీపీ ప్రభుత్వం ప్రజల కోసం 12 లక్షలకు పైగా ఇళ్లను నిర్మించి ఇస్తుంటే.. జగన్‌ కేవలం 5 లక్షల అగ్గిపెట్టెల ఇళ్లు మాత్రమే నిర్మించారన్నారు. అలాగే విద్యార్థులకు, నిరుద్యోగుల విషయంలో చంద్రబాబు ఎన్ని పథకాల ద్వారా లబ్ధి చేకూర్చారో అందరికీ తెలిసిందేనన్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ ఒక్కరికీ మంచి చేయకపోగా.. అబద్ధాలతో మళ్లీ మన ముందుకు వస్తున్నారని.. ఇలాంటి సమయంలో మళ్లీ మనం చంద్రబాబును రప్పించాల్సిన అవసరం ఉందన్నారు…

LEAVE A RESPONSE