కనీవినీ ఎరగని రీతిలో జేపీ నడ్డా సభను సక్సెస్ చేద్దాం

-పాలమూరు గడ్డ బీజేపీ అడ్డా
-బీజేపీ కార్యకర్తల సత్తా చూపండి
-ఉమ్మడి పాలమూరు జిల్లా నేతలతో బండి సంజయ్ భేటీ
-జన సమీకరణపై ఇప్పటికే ద్రుష్టి సారించిన జిల్లా నేతలు
-మండలాలు, గ్రామాలు, బూత్ ల వారీగా జన సమీకరణ

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈనెల 5న మహబూబ్ నగర్ కు రాబోతున్న నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభను కనీవినీ ఎరగని రీతిలో విజయవంతం చేయాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. అందులో భాగంగా భారీ ఎత్తున జన సమీకరణ చేసి సత్తా చాటేందుకు సిద్ధమైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అధ్యక్షతన ఈరోజు పాదయాత్ర లంచ్ శిబిరం వద్ద ఉమ్మడి జిల్లాల నేతలతో సమావేశం నిర్వహించారు.

బండి సంజయ్ తోపాటు పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె. లక్ష్మణ్, జాతీయ కార్యవర్గ సభ్యులు ఏపీ జితేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు దుగ్యాల ప్రదీప్ కుమార్, మంత్రి శ్రీనివాసులు, బంగారు శ్రుతి, పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, కోశాధికారి శాంతికుమార్, రాష్ట్ర కార్యదర్శి కొల్లి మాధవి, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి హాజరయ్యారు. మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, వనపర్తి జిల్లాల అధ్యక్షులు, ఇంఛార్జీలతోపాటు ఆయా జిల్లాల పదాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గత 18 రోజులుగా బండి సంజయ్ కొనసాగిస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతున్న తీరు తెన్నులు, ప్రజల నుండి వస్తున్న స్పందనతోపాటు ప్రజా సమస్యలను లేవనెత్తుతున్న వైనంపై సమావేశంలో చర్చించారు. పాదయాత్రకు విశేష స్పందన లభిస్తోందని, ప్రజా సమస్యలను ప్రభుత్వం ద్రుష్టికి తీసుకురావడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో బండి సంజయ్ విజయవంతమయ్యారని నేతలు పేర్కొన్నారు.

పాలమూరులో నెలకొన్న ప్రధాన సమస్యలను గుర్తించడంతోపాటు ఒక్కో రోజు ఒక్కో అంశాన్ని లేవనెత్తుతూ ఇటు జిల్లా, అటు రాష్ట్ర ప్రజల ద్రుష్టిని ఆకర్షిస్తున్నారని… ఇదే పంథాను కొనసాగించాలని సూచించారు. పాదయాత్రలో భాగంగా ఇప్పటి వరకు అలంపూర్, గద్వాల్, మక్తల్, నారాయణపేట నియోజకవర్గ కేంద్రాల్లో జరిగిన బహిరంగ సభలు ఒకదానికి మించి మరొకటి సక్సెస్ అయ్యాయని అభిప్రాయపడ్డారు. దీనికి కొనసాగింపుగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ కళాశాల మైదానంలో ఈనెల 5న చేపడుతున్న భారీ బహిరంగ సభకు పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా హాజరవుతున్నందున కనీవినీ ఎరగని రీతిలో ప్రజలను సమీకరించి సభను సక్సెస్ చేయాలని నిర్ణయించారు.

ఈ సందర్భంగా జిల్లాల వారీగా నేతలు మాట్లాడుతూ బండి సంజయ్ చేపడుతున్న పాదయాత్ర సక్సెస్ తో ఈసారి అధికారంలోకి వచ్చే పార్టీ బీజేపీ అనే భావన ప్రజల్లో నెలకొందన్నారు. ఈ నేపథ్యంలో జేపీ నడ్డా సభకు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు పెద్ద ఎత్తున ప్రజలు, యువత సంసిద్ధంగా ఉన్నందున సభకు లక్ష మందికిపైగా తరలి వచ్చేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.

జిల్లా నేతల అభిప్రాయాలను తెలుసుకున్న అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ…‘‘పాలమూరు గడ్డా.. బీజేపీ అడ్డా. రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రను ఉమ్మడి జిల్లా ప్రజలు సక్సెస్ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి తమ సమస్యలు చెప్పుకోవడంతోపాటు బీజేపీ అధికారంలోకి వస్తే తమ సమస్యలు పరిష్కారమవుతాయనే భావిస్తున్నారని తెలిపారు. దీనికి కొనసాగింపుగా మహబూబ్ నగర్ కేంద్రంలో ఈనెల 5న నిర్వహించే భారీ బహిరంగ సభను భారీ ఎత్తున సక్సెస్ చేసి సత్తా చూపాలి’’అని కోరారు.

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రధాన సమస్యలైన ఆర్డీఎస్ ఆధునీకరణ, 69 జీవో అమలుతోపాటు చేనేత కార్మికులు, రైతులు, మాదాసి కురువ, వాల్మీకీ బోయలు సహా వివిధ సామాజికవర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశం చేయడంలో ప్రజా సంగ్రామ యాత్ర సఫలీక్రుతమైందన్నారు.

ఈ నేపథ్యంలో పాలమూరు జిల్లా కేంద్రంగా ఈనెల 5న నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభ కు జేపీ నడ్డా వస్తున్నందున ఈ సభ ద్వారా ఉమ్మడి పాలమూరు ప్రజలు ఎదుర్కొంటున్న ప్రజా సమస్యలను మరోసారి జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యేలా చేద్దాం.

Leave a Reply