జగన్ రెడ్డిని గద్దె దించుతాం.. బీసీ ఐక్యత చాటిచెబుతాం

– తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షులు కొల్లు రవీంద్ర
– టీడీపీ బీసీ నేతల సర్వసభ్య సమావేశంలో బీసీ నేతల శపథం

జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలోని బీసీలంతా అన్యాయమైపోయారు. గత మూడున్నరేళ్లుగా బీసీలను అన్ని రకాలుగా అణచివేస్తున్నారు. హత్యలు, దాడులు, అక్రమ కేసులతో అవస్థలకు గురి చేస్తున్నారు. జనాభాలో సగభాగం ఉన్న బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకోవాలనేలా జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుండి నడుచుకుంటున్నారు తప్ప.. ఏ ఒక్క బీసీని కూడా ఉద్దరించే ఆలోచన చేయడం లేదని తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షులు కొల్లు రవీంద్ర అన్నారు.

ఈ మేరకు గుంటూరు జిల్లా మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీతోనే బీసీల అభివృద్ధి, అభ్యున్నతి సాకారమవుతుందన్నారు. చంద్రబాబు నాయుడు బీసీలను రాజకీయంగా, ఆర్ధికంగా, సామాజికంగా పురోభివృద్ధి సాధించేలా సబ్ ప్లాన్, కార్పొరేషన్లు పెడితే.. ప్రస్తుతం కార్పొరేషన్లను వైసీపీ రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రాలుగా మార్చారు.

సబ్ ప్లాన్ నిధుల్ని మళ్లించి నిర్వీర్యం చేశారు. సంక్షేమం అంటే నవరత్నాలే అంటూ చెబుతూ దగా చేస్తున్నారు. ఆదరణ, స్కిల్ డెవలప్ మెంట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, స్టడీ సర్కిల్స్, పెళ్లి కానుకలు, చంద్రన్నీ బీమా, కార్పొరేషన్ రుణాలు వంటి ఎన్నో ఉన్నత పథకాలతో బీసీలకు అండగా నిలిచిన ఘనత చంద్రబాబు నాయుడుదే. జగన్ రెడ్డి అన్ని రకాల పథకాలు నిలిపివేసి బ్యాక్ బోన్ వర్గాలుగా ఉండే బీసీల బ్యాక్ బోన్ విరిచేశారు.

త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహించి బీసీల ఐక్యత చాటి చెబుతాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికీ వెళ్లి జగన్ రెడ్డి చేస్తున్న అరాచకాలు, అకృత్యాలను ప్రజలకు వివరించి.. బీసీల సత్తా చూపిస్తాం. జగన్ రెడ్డిని గద్దె దించి.. బీసీల జీవితాలు మెరుగుపరిచే తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం రాష్ట్ర బీసీ సాధికార సమితి కన్వీనర్లు, రాష్ట్ర బీసీ కమిటీ సభ్యులు, పార్లమెంట్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, జోనల్ సమన్వయకర్తలు, సాధికార సమితి సమన్వయకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply