Suryaa.co.in

Andhra Pradesh

అవినీతిపరులను అడ్డుకుందాం

– ధైర్యంగా బయటకు వచ్చి న్యాయంకోసం నిలబడాలి
– రాష్ట్రం పరువు తీసిన వారిని ఇంటికి సాగనంపాలి
– కార్యకర్తలకు భువనేశ్వరి పిలుపు

రాష్ట్రంలో తిష్టవేసిన అవినీతిపరులను రాయలసీమ ప్రజలు పౌరుషంగా అడ్డుకోవాలని…వారి చేతిలో నుండి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని పార్టీ కార్యకర్తలకు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు.
రాయచోటి నియోజకవర్గంలో నిజం గెలవాలి పర్యటన సందర్భంగా కార్యకర్తలతో భువనేశ్వరి మాట్లాడుతూ…చంద్రబాబు పాలనలో సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ గా పేరుపొందిన ఏపీ నేడు అప్పుల ఆంధ్రప్రదేశ్ అయ్యింది. దేశంలో రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని వైసీపీ ప్రభుత్వం నిలబెట్టింది. గతంలో ఏపీలో ఉన్న పరిశ్రమలన్నీ ప్రక్కనున్న రాష్ట్రాలకు తరలివెళ్లిపోయాయి. యువతకు ఉద్యోగావకాశాలు లేక ఇబ్బందులుపడుతున్నారు. టీడీపీ పాలనలో ఏపీకి పెట్టుబడులు వస్తే..నేడు ఆ కంపెనీలు ఏపీని వదిలిపారిపోతున్నాయి.

రాష్ట్ర సచివాలయాన్ని సహా తాకట్టు పెట్టి, అప్పులు తెచ్చి ఆ అప్పులను మన నెత్తిమీద వేస్తున్నారు. తెలుగుదేశంపార్టీ కార్యకర్తలు, నాయకులను గత 5ఏళ్లుగా అనేక ఇబ్బందులకు గురిచేశారు. దేశంలోనే రాజధాని లేని ఏకైక రాష్ట్రంగా ఏపీని మార్చారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు రాయలసీమ కార్యకర్తలు పౌరుషంగా బయటకు రావాలి. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు నడుం బిగించాలి. ఎవరు ఎదురొచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొని పోరాడాలి…తెలుగుదేశం జెండాను ఎగరేయాలి.

చంద్రబాబు ఏం చేస్తారో అవే చెప్తారు. 2024లో మన ప్రభుత్వం వచ్చిన వెంటనే యువతకు 20లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఇవ్వడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు. నిరుద్యోగులకు నెలకు రూ.3వేలు నిరుద్యోగ భృతి, రైతులకు సంవత్సరానికి రూ.20వేలు పెట్టుబడిసాయం, 18సంవత్సరాలు నిండిన ప్రతి మహిళలకు నెలకు రూ.1,500, చదువుకునే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి రూ.15వేలు, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సదుపాయం అందిస్తామని చంద్రబాబు చెప్పారు.

మహిళలు కూడా చంద్రబాబు అక్రమ అరెస్టు సమయంలో అలుపెరుగని పోరాటం చేశారు. పోలీసులు ఇబ్బందులు పెట్టినా ఎక్కడా వెనకడుగు వేయకుండా మా కుటుంబానికి అండగా నిలిచారు. ప్రతి ఒక్కరికీ మేం రుణపడి ఉంటాం. వచ్చే ఎన్నికల్లో మహిళలు కూడా తమ వంతు తెలుగుదేశంపార్టీ విజయానికి కృషి చేయాలి అని భువనేశ్వరి అన్నారు.

LEAVE A RESPONSE