Suryaa.co.in

Political News

గెలుపు తంత్రం.. మేనిఫెస్టో మంత్రం

ఎన్నికల గెలుపులో మేనిఫెస్టోల పాత్ర ఎంత ?
(ఏఎన్‌ఎస్)

మ్యానిఫెస్టో మీద రాజకీయ పార్టీలు ఎక్కువగా ఫోకస్ పెడుతూ ఉంటాయి. మేనిఫెస్టోల అంటే సింపుల్ గా చెప్పుకోవాలీ అంటే హామీలను గుమ్మరించడం.వాటిని నమ్మి జనాలు ఓటు వేస్తారు, అధికారాన్ని అందిస్తారు అని రాజకీయ పార్టీలు గాఢంగా విశ్వసిస్తూంటాయి.అందుకే అభ్యర్ధుల విషయంలో చేసే సీరియస్ కసరత్తునే ఎన్నికల మేనిఫెస్టో విషయంలో కూడా చేస్తూ ఉంటాయి. ఇక ఎన్నికల్లో ప్రజల వద్దకు వెళ్లే ముందు మేనిఫెస్టోకు తుది మెరుగులు దిద్దడం అన్నది రాజకీయ పార్టీలకు చాలా కీలకంగా మారుతోంది.

మేము ఫలానా వారికి ఫలానా హామీలు అమలు చేస్తామని చెబుతూ మేనిఫెస్టోలని రెడీ చేస్తూంటారు. తమ పార్టీని ఎన్నికల్లో గెలిపిస్తే ఏమి చేస్తామన్నది చెబుతూ ఉంటారు. గతంలో మేనిఫెస్టోల లో ఒక హామీ ఇవ్వాలంటే ఎంతో ఆలోచించేవారు. కొంత నైతిక విలువలు పాటించేవారు. సాధ్యాసాధ్యాలు కూడా ఆలోచించేవారు. అందువల్ల ఆకర్షణీయమైన హామీలతో మేనిఫెస్టో ని తయారు చేస్తున్నారు. అయితే ఇష్టం వచ్చినట్లుగా మేనిఫెస్టో ని తయారు చేయడం వల్ల ఆర్ధిక పరమైన సమస్యలు వస్తున్నాయని అంటున్నారు.రాష్ట్ర ఖజానా మీద కొన్ని సార్లు పెను భారంగా ఈ హామీలు మారుతున్నాయని అంటున్నారు.

మాట ఇచ్చిన తరువాత కొన్నాళ్లు అయినా అమలు చేయాలి.లేకపోతే జనాల సంగతి పక్కన పెడితే ప్రత్యర్థి పార్టీలు ఊరుకోవు.గద్దెనెక్కిన మరుసటి రోజు నుంచే అధికారంలో ఉన్న పార్టీని పట్టుకుని గద్దిస్తాయి.ఈ నేపధ్యంలో నుంచి చూసుకుంటే మేనిఫెస్టో లు మునుపటి కంటే కూడా కష్టంగా మారాయని చెప్పాల్సి ఉంటుంది. ఈ రోజున భారతదేశమంతా మేనిఫెస్టోల పేరు చెప్పి ఇష్టం వచినట్లుగా హామీలు ఇచ్చే కల్చర్ స్టార్ట్ అయింది అని అంటున్నారు.

ఇక శతకోటి అనంతకోటి ఉపాయాలతో మేనిఫెస్టో ను ఎన్నికల తరువాత మరో రకంగా మార్చేస్తుంటారు. ముందు అందరికీ ఫలనా స్కీం ఉచితంగా ఇస్తామని చెబుతారు. తీరా అధికారంలోకి వచ్చాక అది కేవలం తెల్ల కార్డు దారులకే అని మరో కీలకమైన కండిషన్ పెడతారు అని అంటున్నారు. ఇలా మేనిఫెస్టో లో ఎన్నో తమాషాలు ఉంటున్నాయి.

చాలా మంది అయితే మేనిఫెస్టోల లో ఏముందో చూడకుండానే ఓటు వేస్తున్నారు తమకు అన్ని పధకాలు వస్తాయని ఆశతో వేసే వారూ ఉంటున్నారు. అయితే అందరికీ పధకాలు అన్నట్లుగా మేనిఫెస్టో లు తయారు చేసి, గెలిచిన తరువాత కటింగులు చేయడం కండిషన్లు పెట్టడం మీద ప్రతిపక్షాలు అయితే ఎక్కడా ఊరుకోవడం లేదు. అధికార పార్టీలను మొదటి రోజు నుంచే గట్టిగా తగులుకుంటున్నాయి.

ఇక ఏపీలో చూస్తే అయిదేళ్ల క్రితం వైసీపీ మేనిఫెస్టో లో చాలా హామీలు ఇచ్చారు.అందులో సంపూర్ణ మద్య పాన నిషేధం అన్నది ఉంది.అలాగే సీపీఎస్ రద్దు అన్న్నది మరో కీలకమైన హామీగా ఉంది.అయితే ఈ రెండింటినీ వైసీపీ అయిదేళ్ల పాలనలో అమలు చేయలేక పోయింది.దాన్ని ఇపుడు టీడీపీ శ్రేణులు గట్టిగానే ఫోకస్ చేస్తున్నాయి.హామీలు వైసీపీ నిలబెట్టుకోలేదని కూడా విమర్శిస్తున్నాయి.

ఇక తెలంగాణాలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు పేరు చెప్పి అధికారంలోకి వచ్చింది. అయితే అందులో కొన్ని ఇప్పటికే అమలు చేశారు.మొత్తానికి మొత్తం ఆరు హామీలు అమలు చేయాలని అక్కడ ప్రతిపక్షం బీఆర్ఎస్ గట్టిగా అధికార కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తోంది. ఇక 2014 ఎన్నికల్లో నరేంద్ర మోడీ పార్టీ బీజేపీకి ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు అంటూ హామీ ఇచ్చింది. తీరా పదేళ్లు గడిచినా ఆ హామీ అమలు కాలేదు. అలాగే నల్లధనం వెలికి తీసి ప్రతీ ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు వేస్తామని చెప్పారని ఈ రోజుకీ అంటూ ఉంటారు.

ఈ నేపధ్యం నుంచి చూసినపుడు అన్ని పార్టీలు ఆ తానులో ముక్కలే అన్నట్లుగా ఎన్నికల మేనిఫెస్టో తోనే అద్భుతాలు జరిగిపోతాయని ఎవరూ అనుకోవడం లేదు అని అంటున్నారు. మేనిఫెస్టో లో ఉన్న వాటికి అధికారంలో వచ్చాక చేసే వాటికి చాలా తేడా కనిపిస్తుంది. దాంతో ప్రతిపక్షాలకు మాత్రం ఇది మంచి అస్త్రంగా మారుతోంది అని అంటున్నారు.ఇక ఎన్నికల్లో ఈ రోజు మ్యానిఫెస్టోలన్నవి మొక్కుబడి తంతు అయిపోయాయి అని అంటున్నారు.

నరేంద్ర మోడీని గెలిపించినా లేక జగన్ ని గెలిపించినా, చంద్రబాబుని గెలిపించినా ఎన్నో అంశాలు పనిచేస్తాయని అందులో ఎన్నికల మేనిఫెస్టోల పాత్ర ఎంత అంటే, ఈ రోజుకు గట్టిగా చెప్పలేరనే అంటున్నారు. ఏది ఏమైనా ఎన్నికల మేనిఫెస్టో లు గేమ్ చేంజర్ అయితే కానే కావు అని అంతా కొట్టి పారేస్తున్నారు.వాటిని జనాలు కూడా లైట్ తీసుకుంటున్నారు.

LEAVE A RESPONSE