Suryaa.co.in

Andhra Pradesh

జగన్ కు ప్రాణహాని?

-సీఎం జగన్ ప్రాణాలకు నక్సల్స్, టెర్రరిస్టులు నుంచి ముప్పు ?
-సీఎం జగన్ భద్రతపై ఇంటెలిజెన్స్ డీజీపీ నివేదిక

ఏపీ సీఎం జగన్‌కు ప్రాణహాని ఉందా? నక్సల్స్, టెర్రిరిస్టుల నుంచి ఆయన ప్రాణాలకు హాని ఉందా? అందుకే రెండు హెలికాఫ్టర్లు సిద్ధం చేశారా? నిఘా నివేదిక దీనికి అవుననే నివేదికలిచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రాణాలకు ముప్పు ఉందంటూ ఇంటెలిజెన్స్ డీజీపీ నివేదిక ఇచ్చారు. మావోయిస్టులు, ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తుల నుంచి సీఎం జగన్ కు ప్రాణహాని ఉందని ఆ నివేదికలో పేర్కొన్నారు. సీఎం జగన్ కు అత్యంత కట్టుదిట్టమైన భద్రత కల్పించాల్సి ఉందని డీజీపీ స్పష్టం చేశారు. మరి కొన్ని వారాల్లో ఏపీ ఎన్నికలకు వెళుతున్న నేపథ్యంలో ఈ నివేదిక ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ క్రమంలో సీఎం జగన్ పర్యటనల కోసం రెండు హెలికాప్టర్లను ఏపీ ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ఒక హెలికాప్టర్ ను విజయవాడలో, మరో హెలికాప్టర్ ను విశాఖలో అందుబాటులో ఉంచనున్నారు. మెస్సర్స్ గ్లోబర్ వెక్ట్రా సంస్థ ఈ హెలికాప్టర్లను లీజుకు తీసుకోనున్నారు. ఇవి రెండు ఇంజిన్లు కలిగిన బెల్ తయారీ హెలికాప్టర్లు.

ఒక్కో హెలికాప్టర్ కు నెలకు రూ.1.91 కోట్లు లీజు రూపేణా చెల్లించనున్నట్టు తెలుస్తోంది. ఇతర ఖర్చులను కూడా ప్రభుత్వమే చెల్లించనుంది. ఈ మేరకు మౌలిక వసతుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి యువరాజ్ ఉత్తర్వులు ఇచ్చారు.

ప్రస్తుతం సీఎం వినియోగిస్తున్న హెలికాప్టర్ పాతదైపోయిందని ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ వెల్లడించింది. ప్రస్తుత హెలికాప్టర్ 2010 నుంచి వాడుకలో ఉన్నందున, దాన్ని మార్చాల్సి ఉందని వివరించింది. నిఘా నివేదిక రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది.

LEAVE A RESPONSE